Begin typing your search above and press return to search.

తెలంగాణలో పరిస్థితులను క్యాష్ చేసుకుంటున్న బీజేపీ!

By:  Tupaki Desk   |   29 April 2019 12:44 PM GMT
తెలంగాణలో పరిస్థితులను క్యాష్ చేసుకుంటున్న బీజేపీ!
X
ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వందకు పైగా స్థానాల్లో డిపాజిట్లను కోల్పోయింది. ఆ పార్టీ ధరావత్తులను తిరిగి సంపాదించుకుంది కేవలం ఇరవై ఎమ్మెల్యే సీట్లలో మాత్రమే!

కట్ చేస్తే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ పరిధిలో బీజేపీ గట్టిగానే పోరాడింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి, లోక్ సభ ఎన్నికల నాటికి చాలా వ్యత్యాసం కనిపించింది. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తు అయిన కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు నేతలు భారతీయ జనతా పార్టీలోకి చేరడాన్ని కూడా గమనించవచ్చు.ఆ పరిణామాల మధ్యన తెలంగాణలో కరీంనగర్ - నిజామాబాద్ - మహబూబ్ నగర్ - సికింద్రాబాద్ లలో భారతీయ జనతా పార్టీ గట్టి పోటీనే ఇచ్చింది. వీటిల్లో రెండు సీట్లలో విజయం పట్ల బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఆత్మవిశ్వాసంతో ఉందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ఒక మాటలో చెప్పాలంటే ప్రస్తుతానికి తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ కన్నా బీజేపీనే కాస్త బలంగా కనిపిస్తూ ఉంది! అసెంబ్లీ ఎన్నికల నాటికి - లోక్ సభ ఎన్నికల నాటికి ఈ వ్యత్యాసం కనిపిస్తూ ఉంది.

ఈ క్రమంలో రాజకీయంగా మరింతగా బలపడటానికి భారతీయ జనతా పార్టీ రకరకాల ఎత్తులను వేస్తుండటాన్ని గమనింవచ్చు. కేవలం కాంగ్రెస్ నుంచి నేతలను మళ్లించుకుని బలపడాలని అనుకోవడమే కాదు.. ప్రజాపోరాటాల్లో కూడా బీజేపీ ముందుకు సాగుతోంది. కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే ఈ విషయంలో బీజేపీనే ముందుండటం విశేషం. తెలంగాణలో ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ ఇంటర్మీడియట్ ఫలితాల్లో గందరగోళంపై బీజేపీ ఘాటుగా స్పందిస్తోంది. ఇంటర్మీడియట్ బోర్డు ముట్టడి, ఈ విషయంలో ఏబీవీపీ ఆందోళనలు మాత్రమే కాదు.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ దీక్ష కూడా చర్చనీయాంశంగా నిలిచింది.

ఇంటర్మీడియట్ ఫలితాల వ్యవహారంలో ప్రభుత్వ, ఇంటర్మీడియట్ బోర్డు తీరును నిరసిస్తూ ఆయన దీక్షకు దిగారు. ఆ దీక్షను పోలీసులు భగ్నం చేసినా.. ఈ రోజంతా అది చర్చనీయాంశంగా నిలిచింది. ఇలా ప్రజాపక్షాన నిలబడి బీజేపీ బలోపేతం అయ్యే ప్రయత్నంలో ఉన్నట్టుగా ఉంది.

కాంగ్రెస్ పార్టీ ఉత్తుత్తి మాటల్లోనే ఉంది. అక్కడ ఏం చేయాలన్నా ఢిల్లీ నుంచి పర్మిషన్ రావాలి. ఇలాంటి పరిస్థితులను కమలం పార్టీ క్యాష్ చేసుకుంటున్న దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి.

ఇలా ముందుకు వెళ్లి తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బలోపేతం కావాలనేది కమలం పార్టీ ప్రణాళికగా తెలుస్తోంది. మరి లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో ఏమైనా అనుకూలత కనిపిస్తే అప్పుడు బీజేపీ కి మరింత ఊపు రావొచ్చు!