Begin typing your search above and press return to search.

ఉత్తమ్ పార్లమెంట్ కా.? ఇది టీఆర్ ఎస్ పనే

By:  Tupaki Desk   |   29 May 2019 8:48 AM GMT
ఉత్తమ్ పార్లమెంట్ కా.? ఇది టీఆర్ ఎస్ పనే
X
మొన్నటి పార్లమెంట్ ఎన్నికల వేళ నిజామాబాద్ - కరీంనగర్ పార్లమెంట్ లో కాంగ్రెస్ - బీజేపీ కలిసిపోయి బలమైన టీఆర్ ఎస్ అభ్యర్థులను ఓడించిన సంగతి తెలిసిందే.. దీన్నే నిన్న కేటీఆర్ ఎత్తి చూపాడు. కాంగ్రెస్ నాయకులు తమకు ఓట్లు పడకున్నా ఫర్వాలేదు కానీ.. కారుకు ఓటేయవద్దని బీజేపీకి వేయించారని ఆరోపించారు. అందుకే ఈ రెండు సీట్లలో కాంగ్రెస్ కు డిపాజిట్ రాలేదన్నారు. ఇలా కాంగ్రెస్ - బీజేపీ తెరవెనుక స్నేహం తాజాగా తెలంగాణలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.

తెలంగాణలో బీజేపీది గాలివాటం గెలుపు అని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఘాటుగా స్పందించారు. ఇందిరమ్మ ఇళ్లలో అవినీతికి పాల్పడ్డ ఉత్తమ్ ను జైలుకు పంపుతామన్న కేసీఆర్ .. ఇప్పుడు ఆయనను పార్లమెంట్ కు పంపాడని లక్ష్మణ్ మండిపడ్డారు. కాంగ్రెస్, టీఆర్ ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని ఆరోపించారు.

తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందని.. బీజేపీ పాగా వేస్తుందనే ఉత్తమ్ కు భయం పట్టుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. ఉత్తమ్ ప్రగల్బాలు మాని కాంగ్రెస్ పార్టీ ఎక్కడ దిగజారిపోయిందో చూసుకోవాలని అన్నారు. ఓటమి అంచుల్లో నిలిచిన కాంగ్రెస్ నాయకులు ఇంకా భ్రమలోనే బతుకున్నారని ఎద్దేవా చేశారు. భవిష్యత్ లో టీఆర్ఎస్ కు ప్రత్యామ్మాయంగా నిలిచే సత్తా బీజేపీకే ఉందన్నారు.

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 38శాతం ఓట్లు వచ్చాయని.. విద్యావంతులంతా బీజేపీకే ఓటేశారని లక్ష్మణ్ అన్నారు. ఉత్తర తెలంగాణలో నాలుగు సీట్లు గెలిచి తమ సత్తా చాటుకున్నామన్నారు. ఇలాంటి షాక్ లు ఇంకా ఇస్తామని చెప్పుకొచ్చారు. బీజేపీ తెలంగాణపై ఫోకస్ పెట్టిందని.. తెలంగాణలో బీజేపీదే భవిష్యత్ అని.. కాంగ్రెస్ ను పాతాళానికి తొక్కేస్తామని లక్ష్మణ్ హెచ్చరించారు.