Begin typing your search above and press return to search.

ఎన్నికలసిత్రం.. రైతు ఓటు పదిలం..

By:  Tupaki Desk   |   21 Nov 2018 5:17 AM GMT
ఎన్నికలసిత్రం.. రైతు ఓటు పదిలం..
X
తెలంగాణ ముందస్తు ఎన్నికల వేళ చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడుతారనే విషయంపై ఇప్పుడు తెలంగాణ అంతటా చర్చ మొదలైంది.. బలమైన టీఆర్ఎస్.. కూటమి కట్టిన ప్రతిపక్షాల మధ్య గెలుపుపై ఎవరి ఆశావాదం వారిది.. అయితే.. తెలంగాణలో బలంగా ఉన్న సామాజికవర్గాలు, రైతుల శాతాన్ని కొలమానంగా తీసుకుంటే మాత్రం టీఆర్ఎస్ కు మొగ్గు కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు..

ముఖ్యంగా బీసీల కోసం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఈ ఎన్నికల్లో ఆయనకు కొండంత బలంగా మారాయి. గొల్ల కుర్మలకు గొర్రెల పంపిణీ, మత్య్సకారులకు చేపపిల్లలు, అమ్ముకోవడానికి వాహనాలు.. నాయిబ్రాహ్మణులకు పరికరాలు, రాయితీలు.. రజకులకు వాషింగ్ మేషిన్లు.. నేతన్నలకు బతుకమ్మ చీరల కాంట్రాక్టు.. ఇలా ప్రతి కులాన్ని టచ్ చేసిన కేసీఆర్ వైపు ఆయా వర్గాలు నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు.

తెలంగాణలో దాదాపు 60శాతానికి పైగా జనాలు వ్యవసాయం పైనే ఆధారపడి ఉన్నారు. వారంతా ఈ ఎన్నికల్లో కీలకంగా మారారు. ఈ నేపథ్యంలో తెలుగులోని టాప్ న్యూస్ చానెల్స్ అన్ని ఇప్పుడు పొలాల గట్లు, గ్రామాల్లోని రైతుల వద్దకు మైకులు పట్టుకొని వెళుతున్నాయి. ఇందులో దాదాపు 99శాతం మంది రైతులు.. కేసీఆర్ ఇచ్చిన రైతుబంధు పథకం చెక్కులతో తమకు అప్పుల బాధ తీరిందని.. పంట పండించుకొని అప్పులు లేకుండా బతుకుతున్నామని చెప్పడం విశేషం.. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ వీడియోలు టీఆర్ఎస్ కు కొండంత ధైర్యాన్ని ఇస్తున్నాయి.

రైతులపై కేసీఆర్ కు ఎంత ప్రేమ ఉందో తెలిపే ఓ వీడియో తాజాగా వైరల్ అవుతోంది. ఓ సాధారణ రైతు కాంగ్రెస్ సభకు వెళ్లాడు. అందుకోసం కాంగ్రెస్ నేతలు 300 రూపాయలు కూడా ఇచ్చారని చెప్పుకొచ్చాడు. పోనీలే మరి దేనికి ఓటు వేస్తావ్ అంటే.. ‘ఘంఠాపథంగా కారుకే’ అనేశాడు. కాంగ్రెస్ సభకెళ్లి కారుకు ఓటు వేస్తానన్న రైతు మాటను ఇప్పుడు టీఆర్ ఎస్ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. రైతులకు తాము చేసిన సేవకు ప్రతిఫలం దక్కిందని.. ఇదే గులాబీ పార్టీని గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు..