Begin typing your search above and press return to search.

అమ‌లు చేస్తారో.. ఉరేసుకుంటారో.. మీ ఇష్టం: కేంద్రంపై కేసీఆర్ ఫైర్‌

By:  Tupaki Desk   |   17 Sep 2022 2:49 PM GMT
అమ‌లు చేస్తారో.. ఉరేసుకుంటారో.. మీ ఇష్టం:  కేంద్రంపై కేసీఆర్ ఫైర్‌
X
కేంద్రంపై తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌రింత దూకుడు పెంచారు. ముఖ్యంగా గిరిజ‌నుల రిజ‌ర్వేష‌న్‌కు సంబంధించి ఆయ‌న వ్యాఖ్య‌లు చేశారు. ''వారం రోజుల్లో గిరిజనులకు 10% రిజర్వేషన్ల జీవోను విడుదల చేయిస్తాం. అమలు చేస్తారో.. ఉరి వేసుకుంటారో మీ ఇష్టం'' అని సీఎం కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఆదివాసి, బంజారాల ఆత్మీయ సభలో కేసీఆర్ మాట్లాడుతూ గిరిజనులు, బంజారాల సమస్యల పరిష్కారం కోసం.. భవనాలు వేదిక కావాలన్నారు. గిరిజన రిజర్వేషన్ బిల్లును ఎందుకు తొక్కిపెడుతున్నారో.. ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్‌షా చెప్పాలని డిమాండ్ చేశారు.

రిజర్వేషన్ బిల్లుకు రాజ్యాంగం అడ్డుగా లేదని తెలిపారు. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని గుర్తుచేశా రు. రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని తీర్మానం చేసి.. ఏడేళ్ల క్రితం కేంద్రానికి పంపామని ఆయన తెలిపారు.

ఆ బిల్లును ఎందుకు ఆపుతున్నారో స్పష్టం చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ''బిల్లుకు ఉన్న అడ్డంకి ఏమిటి.. రాజకీయాలు తప్ప. మా న్యాయమైన హక్కునే డిమాండ్ చేస్తున్నాం. నదీ జాలాలు సముద్రం పాలు కావొద్దు. స్వచ్ఛమైన పంటలు పండాలి. తెలంగాణ పథకాలు దేశమంతా అమలు కావాలి. గిరిజన ప్రాంతాలు, తండాల్లో మిషన్ భగీరథ నీరు అందుతోంది. గిరిజన విద్యాసంస్థలు పెంచుతున్నాం'' అని కేసీఆర్‌ ప్రకటించారు.

గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ఆదివాసీ, బంజారా భవన్‌లు వేదికలు కావాలని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి శాస్త్రీయ దృక్పథంతో మేథోమధనం జరగాలని సూచించారు. భారతజాతి ప్రతినిధులుగా గిరిజన బిడ్డలు ఎదగాలని ఆకాంక్షించిన సీఎం.. గిరిజనుల జీవనశైలి, సంప్రదాయాలను కాపాడుతున్నామని వ్యాఖ్యానించారు. ఈ మేరకు హైదరాబాద్ లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో జరిగిన ఆదివాసీ, బంజారా ఆత్మీయ సభలో కేసీఆర్‌ మాట్లాడారు.

ఈ క్రమంలోనే గతంలో గిరిజనులకు 5-6 శాతం రిజర్వేషన్లు ఉండేవని గుర్తు చేసిన సీఎం.. రిజర్వేషన్లు 10 శాతానికి పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసినట్లు వెల్లడించారు. రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామన్నారు. రాష్ట్రపతి ఆమోదిస్తే రాష్ట్రంలో రిజర్వేషన్లు అమలు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఆమోదానికి బిల్లును పంపాలని ప్రధానిని కోరుతున్నానన్న కేసీఆర్‌.. తమకు రావాల్సిన న్యాయమైన హక్కునే కోరుతున్నామన్నారు. మోడీ.. ఆ జీవో అమలు చేస్తారా? దాన్నే ఉరితాడు చేసుకుంటారా అని నిప్పులు చెరిగారు.

వారం రోజుల్లో 10 శాతం రిజర్వేషన్ల జీవో విడుదల చేస్తామన్నారు. 10 శాతం రిజర్వేషన్లు రాష్ట్రమే అమలు చేసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే త్వరలోనే గిరిజన బంధు అమలు చేస్తామన్న కేసీఆర్‌.. తన చేతుల మీదుగా పథకాన్ని ప్రారంభిస్తానన్నారు. భూములు లేని గిరిజనులకు పోడు భూములు పంచుతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎనిమిదేళ్ల పాలనలో కేంద్రం ఒక్క మంచి పనైనా చేసిందా అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. అనేక కష్టనష్టాలకు ఓర్చి సాధించుకున్న తెలంగాణ.. మరో కల్లోలానికి గురికావద్దని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. తెలంగాణ సమాజం అంతా ఐకమత్యంగా ఉండాలని ఆయన కోరారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.