Begin typing your search above and press return to search.

1.25 లక్షల మంది మునుగోడు యువత.. ఓటెటో? డిసైడ్ చేసేది వీరే..

By:  Tupaki Desk   |   20 Oct 2022 4:30 PM GMT
1.25 లక్షల మంది మునుగోడు యువత.. ఓటెటో? డిసైడ్ చేసేది వీరే..
X
ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా.. యువ ఓటర్ల పాత్ర ఎంతో కీలకం.. వారి ఎటు మొగ్గితే అటే విజయం. ఇంట్లోని వారిపై, సమాజంలోని వారిపై ప్రభావం చూపి ఓటింగ్ సరళినీ వీరు
మార్చేయగలరు. సహజంగానే దూకుడు చూపించే ఈ వర్గం.. వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తుంటుంది. కొన్ని రాజకీయేతర అంశాలూ వీరి ఆలోచనా ధోరణిని నిర్దేశిస్తాయి.
అందుకనే ఈ వయసు వారి ఊహను పట్టుకోవడం కూడా కష్టం అంటారు. తాజాగా చూస్తే ఉప ఎన్నిక జరుగనున్న మునుగోడులో ఈ వయసు వారే కీలకంగా మారారు.

39 ఏళ్లలోపు 1.25 లక్షల మంది మునుగోడులో మొత్తం ఓట్లలో 1.25 లక్షల మందిపైగా ఓటర్లు 39 ఏళ్లలోపు వారే. అంటే సగం ఓటర్లు వీరే ఉన్నారు. వయసుల వారీగా చూస్తే... 18-19 ఏళ్ల మధ్య వారు 8,432 మంది ఉండగా, 20-29 ఏళ్ల మధ్య వారు 51,131 మంది ఉన్నారు. 30 నుంచి 39 ఏళ్ల వారు 66,105 మంది ఉన్నారు. అయితే, వీరి తర్వాతి స్థానంలో 40 నుంచి 49 ఏళ్ల మధ్యవారు 45,865 మంది ఉన్నారు. అంటే.. 39 ఏళ్ల లోపు వారు ఎటు మొగ్గితే ఆ అభ్యర్థి లేదా పార్టీదే విజయం.

నిరుద్యోగంపై బీజేపీ, కాంగ్రెస్, ఉద్యోగాల భర్తీపై టీఆర్ఎస్ చిత్రమేమంటే 39 ఏళ్ల వయసు లోపు వారు ఎక్కువగా కోరుకునేది ఉద్యోగాల భర్తీనే. వీరిలో చాలామంది ఉద్యోగ వేటలో ఉంటుండడమే దీనికి కారణం. చదువుకోని వారైతే ఉపాధి అవకాశాలను కోరుకుంటారు.

ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ పార్టీలకు వీరందరి అవసరం ఉండడంతో తమ అస్త్రాలకు పదును పెట్టాయి. అధికార టీఆర్ఎస్ అయితే.. ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన 80 వేల పైగా ఉద్యోగాల భర్తీని సాధనంగా మలుచుకుంది. ఇక ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్.. నిరుద్యోగాన్ని ప్రస్తావిస్తున్నాయి. ఎన్నికల ముంగిట నోటిఫికేషన్లు ఇచ్చిన సంగతిని గుర్తుచేస్తున్నాయి.

అనుబంధ విభాగాలను రంగంలోకి దింపి యుక్త వయసు వారిని ఆకట్టుకుంటే మునుగోడులో గెలుపు సులభమైన నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ యువజన, విద్యార్థి విభాగాలను రంగంలోకి దింపాయి. టీఆర్ఎస్ తరపున టీఆర్ఎస్వీ, బీజేపీ యువ మెర్చా, యువజన కాంగ్రెస్ ఆ బాధ్యతలను చేపట్టాయి.

అధికార టీఆర్ఎస్ అయితే, మునుగోడులోని ఏడు మండలాలకు గాను మండలానికి ఒక టీమ్ ను పంపింది. బీజేపీ యువ నాయకులు బూత్ స్థాయి ప్రచారంలో పాల్గొంటుండగా, కాంగ్రెస్ వారు ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆధర్వంలో లక్ష మంది ఓటర్లకు పాదాభివందనం కార్యక్రమం చేపట్టారు. ప్రజాస్వామ్యానికి పాదాభివందనం పేరిట పెద్దవాళ్లకు పాద నమస్కారాలతో పాటు యువతతో చర్చలు జరపడం కాంగ్రెస్ వ్యూహంగా తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.