Begin typing your search above and press return to search.

మీ తమ్ముడు బీజేపీలోకి వెళ్లొచ్చు.. కాంగ్రెస్లోకి టీడీపీ వాళ్లు చేరితే తప్పా..?

By:  Tupaki Desk   |   6 Aug 2022 6:29 AM GMT
మీ తమ్ముడు బీజేపీలోకి వెళ్లొచ్చు.. కాంగ్రెస్లోకి టీడీపీ వాళ్లు చేరితే తప్పా..?
X
తెలంగాణలో కోమరెడ్డి బ్రదర్స్ చేస్తున్న రాజకీయం కాకరేపుతోంది. ముందుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. అయన వెనుకే అన్న కూడా కమలం గూటికి వెళ్తున్నారని ప్రచారం జరిగింది. అయితే తాను 34 ఏళ్లుగా కాంగ్రెస్లోనే ఉన్నానని.. ఇకనుంచి ఉంటానని చెబుతూనే.. కొన్ని గంటల కిందట అమిత్ షాతో భేటీ అయ్యారు. దీంతో వెంకటరెడ్డి కూడా బీజేపీలోకి చేరుతారా..? అన్న ప్రచారం సాగుతోంది. అయితే ఇటు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వలసలు కొనసాగుతుండగా.. అటు ఇంటి తెలంగాణ పార్టీ నేత చెరుకు సుధాకర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

మరికొంత మంది కూడా ఆయనబాటలోనే వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో పార్టీలో ఇతర వ్యక్తులను ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. అయితే మీ తమ్ముడు ఎవరికీ తెలియకుండా బీజేపీలోకి చేరొచ్చు.. కానీ ఇతరులు మీ పార్టీలోకి రావొద్దా..? అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

మునుగోడు నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో బీజేపీ కండువా కప్పుకోనున్నారు. అయితే పార్టీ నుంచి వెళ్లిపోయిన ఆయన ఎమ్మెల్యే పదవికి చెందిన రాజీనామా పెండింగులో ఉంది. స్పీకర్ ఆమోదిస్తే మునుగోడులో ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం కాంగ్రెస్ మునుగోడులో బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభలో ఇంటి తెలంగాణ పార్టీ నాయకుడు చెరుకు సుధాకర్ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నానని ప్రకటించారు. ఆ తరువాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఒకవేళ మునుగోడు ఉప ఎన్నిక జరగితే టికెట్ ఆయనకేనన్న ప్రచారం సాగుతోంది.

ఈనేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు తెలియకుండా చెరుకు సుధాకర్ ను పార్టీలో చేర్చుకున్నారని అన్నారు. కనీస సమాచారం లేకుండా సభ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. తనను ఓడించడానికి పనిచేసిన చెరుకు సుధాకర్ ను పార్టీలో ఎలా చేర్చుకుంటారని నిలదీశారు. అంటి వ్యక్తితో నేను సభలో పాల్గొనలా..? అని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ తన అసంబద్ధ చర్యలతో ఇబ్బంది పెడుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా ఇక రేవంత్ మోహం చూసేది లేదని అన్నారు.

కోమటిరెడ్డి వ్యాఖ్యలు మునుగోడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆసక్తి చర్చను లేపాయి. మీ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఎవరికి చెప్పి బీజేపీలో చేరుతున్నారని ప్రశ్నిస్తున్నారు. మీరెవరిని అడిగి అమిత్ షా ను కలిశారని అంటున్నారు. నష్ట పరిహారం కోసమే అమిత్ షాను కలిశానని చెబుతున్నారు..ఇన్నాళ్లు లేని నష్టపరిహారం ఇప్పుడే గుర్తుకొచ్చిందా..? అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ‘34 ఇండస్ట్రీ’ అని చెబుతున్న వెంకటరెడ్డి పిల్ల రాజకీయాలు చేస్తున్నాని అంటున్నారు. కాంగ్రెస్ లో ఉన్న మీరు బీజేపీలోకి మారవచ్చు.. కానీ టీడీపీ, ఇతర పార్టీలోని వారు కాంగ్రెస్ లోకి రాకూడదని రూలేమైనా ఉందా..? అని అడుగుతున్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొమటిరెడ్డి బ్రదర్స్ కు బ్రాండ్ ఉందని మొన్నటి వరకు చెప్పికున్న అన్నదమ్ముల మధ్య విభేదాలున్నాయని జోరుగా ప్రచారం సాగింది. కానీ తాజాగా ఇద్దరు గంటల తేడాతో అమిత్ షాను కలవడం చర్చనీయాంశంగా మారింది. అయితే బ్రదర్స్ బీజేపీలోకి వెళ్లడం ఖాయమైతే నల్గొండ జిల్లాలో రాజకీయం మరింత రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఎంపీ సమావేశాల సందర్భంగా ఢిల్లీలోనే ఉన్న వెంకటరెడ్డి బ్రదర్ రాజగోపాల్ రెడ్డితో కలివడం బీజేపీలో చేరేందుకే అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే వెంకరెడ్డి మాత్రం తనకు క్లారిటీ వచ్చేదాకా ఆ విషయం బయటపెట్టే అవకాశం లేదని తెలుస్తోంది.