Begin typing your search above and press return to search.

జనాదరణలో తెలుగు సీఎంల ర్యాంకులివే

By:  Tupaki Desk   |   13 July 2022 8:30 AM GMT
జనాదరణలో తెలుగు సీఎంల ర్యాంకులివే
X
తెలంగాణను బంగారు తెలంగాణ చేయటమే తన లక్ష్యమని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇటీవల కాలంలో జాతీయ రాజకీయాల్ని టార్గెట్ చేయటమే కాదు.. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై అవకాశం వచ్చిన ప్రతిసారీ విరుచుకుపడటం తెలిసిందే. మూడు రోజుల క్రితం ఆదివారం సాయంత్రం నిర్వహించిన ప్రెస్ మీట్ లోనూ మోడీ నాయకత్వంలోని కేంద్రం వైఫల్యాలపై పెద్ద ఎత్తున విరుచుకుపడటం.. ప్రధాని మోడీ మీద తీవ్ర వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.

జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని ఊవ్విళ్లూరుతున్న కేసీఆర్ కు.. సొంత రాష్ట్రంలో ప్రజాదరణ ఎలా ఉంది? దేశంలోని ముఖ్యమంత్రుల విషయంలో ప్రజాదరణ విషయంలో ఆయన ర్యాంక్ మాటేమిటి? అన్న విషయాల్ని లెక్క తేలుస్తూ.. సెంటర్ ఫర్ నేషనల్ ఒపినియన్ సర్వే సంస్థ తాజాగా రిపోర్టును విడుదల చేసింది.

దీని ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రజాదరణ గొప్పగా లేదనే చెప్పాలి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మెరుగైన స్థానంలో ఉన్నట్లుగా చెప్పాలి. ఆయన నాయకత్వంపై 49 శాతం మంది ప్రజలు సంత్రప్తితో ఉండగా.. 19 శాతం మంది అసంత్రప్తితో ఉన్నట్లుగా వెల్లడైంది. 24 శాతం మంది తటస్థంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు 25 రాష్ట్రాల ముఖ్యమంత్రుల ర్యాంకింగ్ లను వెల్లడించారు.

జనాదరణ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ 11వ స్థానంలో ఉండగా.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాబితాలో కింది నుంచి ఆరో స్థానంలో ఉండటం గమనార్హం. ఆయన తర్వాతి ర్యాంకుల్లో ఉన్న ముఖ్యమంత్రుల్లో హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్.. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మయ్.. నాగాలాండ్ ముఖ్యమంత్రి నీపూ రియో.. గోవా సీఎం ప్రమాద్ సావంత్.. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహాలు ఉన్నారు.

మొదటి ఐదు స్థానాల విషయానికి వస్తే.. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయిక్ మొదటి స్థానంలో నిలవగా.. రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. మూడో స్థానంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే (ఇటీవల ఆయన తన పదవికి రాజీనామా చేశారు).. నాలుగో స్థానంలో అసోం సీఎం హిమంత బివ్వ శర్మ.. ఐదో స్థానంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ నిలిచారు.

ప్రధాని నరేంద్ర మోడీ విషయానికి వస్తే.. తాజా సర్వే నిర్వహించే నాటికి ఆయన ప్రజాదరణ స్వల్పంగా పెరిగినట్లుగా తేలింది. గతంలో పోలిస్తే నికర ఆమోద రేటింగ్ 36 పాయింట్లకు చేరినట్లుగా పేర్కొన్నారు. దేశంలో 54 శాతం మంది ఆయన నాయకత్వాన్ని ఆమోదిస్తే.. 18 శాతం మంది అసంత్రప్తితో ఉన్నట్లుగా వెల్లడైంది. తాజా రిపోర్టు చెప్పిన విషయాలు సీఎం కేసీఆర్ కు నిరుత్సాహాన్ని కలిగించేలా ఉన్నాయని చెప్పక తప్పదు.