Begin typing your search above and press return to search.

షాద్ నగర్ లో అసలేం జరుగుతోంది?

By:  Tupaki Desk   |   8 Aug 2016 11:45 AM IST
షాద్ నగర్ లో అసలేం జరుగుతోంది?
X
అప్పటివరకూ ప్రశాంతంగా ఉన్న మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ పట్టణం ఒక్కసారి ఉలిక్కిపడింది. స్థానికంగా ఉన్న మిలీనియం టౌన్ షిప్ లోని ఒక ఇంటి చుట్టూ పెద్ద ఎత్తున పోలీసులు చుట్టుముట్టటం.. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో షాక్ తిన్న పరిస్థితి. ఇదిలా ఉంటే.. ఆ ఇంట్లో దాదాపు పది మంది ఉగ్రవాదులు.. పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రి ఉందన్న సమాచారం స్థానికుల్ని ఆందోళనకుగురి చేసింది. అంతలోనే.. ఇంట్లో నుంచి పోలీసుల మీద కాల్పులుజరగటం.. దీనికిప్రతిగా పోలీసులు కాల్పులు షురూ చేయటంతో ఒక్కసారి వాతావరణం యుద్ధరంగంలా మారిపోయింది.

స్థానికుల సమాచారం ప్రకారం భాషా అనే వ్యక్తి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారని.. లోపల ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం పోలీసులకు అందినట్లుగా చెబుతున్నారు. పోలీసులు చుట్టిముట్టినంతలో లోపలి నుంచి కాల్పులు మొదలుకావటంతో.. పోలీసులు.. బీఎస్ ఎఫ్ దళాలు.. ఎన్ ఐఏ దళ సభ్యులు ప్రతికాల్పులు చేపట్టారు. దీంతో.. లోపలున్న ఇద్దరు మరణించినట్లుగా చెబుతున్నారు.

అయితే.. అందరూ అనుకున్నట్లుగా అది ఉగ్రకలకలం కాదని.. గ్యాంగస్టర్ నయిం.. అతని అనుచరుడు మరణించినట్లుగా చెబుతున్నారు. తాజాగా పోలీసుల కాల్పుల్లో మరణించిన నయిం నేర చరిత్ర చాలా పెద్దదే. పోలీసు అధికారి వ్యాస్ హత్య కేసుతో పాటు.. పటోళ్ల గోవర్ధన్ రెడ్డి.. మావో నేతలు సాంబశివుడు.. రాములు హత్య కేసుల్లో నయాం కీలక నిందితుడు. భూదందాలు.. సెటిల్ మెంట్లతో ఆరాచకం సృష్టిస్తున్న నయింను వేటాడేందుకు.. అతన్ని టార్గెట్ చేసిన పోలీసులు ముందస్తు సమాచారంతో అతడ్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారని.. అంతలోనే కాల్పులు చోటు చేసుకోవటంతో పోలసులు కాల్పులు జరపక తప్పలేదని అంటున్నారు. దాదాపు 20 హత్య కేసుల్లో భాగస్వామ్యం ఉన్న నయిం మీద వందకు పైగా కేసులు ఉండటం గమనార్హం.