Begin typing your search above and press return to search.

ఉగ్రవాదుల గుప్పిట్లో యూనివర్సిటీలు

By:  Tupaki Desk   |   18 Feb 2016 5:30 PM GMT
ఉగ్రవాదుల గుప్పిట్లో యూనివర్సిటీలు
X
దేశంలోని యూనివర్సిటీలు పూర్తిగా ఉగ్రవాదుల గుప్పిట్లోకి వెళ్లిపోతున్నాయి... తాజా పరిణామాలు ఆ విషయాన్ని బలపరుస్తున్నాయి... ఇప్పటికే ఆ ప్రభావం తగ్గించేందుకు చర్యలు చేపట్టకపోతే దేశంలో అంతర్గత కల్లోలం రావడానికి ఎన్నో రోజులు పట్టదు. హైదరబాద్ సెంట్రల్ యూనివర్సటీలో - డిల్లీలోని జేఎన్ యూలో విద్యార్థులు ఉగ్రవాది అప్ఝల్ గురు సంస్మరణ సభలు నిర్వహిస్తుండడం దేనికి సంకేతం అన్నది తెలుసుకోవాలి. దేశంలోని విద్యార్ధి సంఘాలకు ఉగ్రవాదులు బహిరంగంగా మద్దతు ప్రకటిస్తూ ప్రకటనలు చేయడం తీవ్రంగా ఆందోళన కలిగిస్తోంది.

లష్కర్‌ ఎ తోయిబా వ్యవస్థాపకుడైన హఫీజ్‌ సయీద్‌ ని గృహనిర్బంధంలో ఉంచినట్టు పాక్‌ నుంచి వార్తలు రాగానే, ఇరుదేశాల ప్రధానమంత్రులు నరేంద్రమోడీ - నవాజ్‌ షరీఫ్‌ ల మధ్య వెల్లివిరుస్తున్న మైత్రి సత్ఫలితాలను ఇస్తోందని ఆశపడ్డాం. హఫీజ్‌ ప్రమేయానికి సంబంధించి బలమైన ఆధారాలు ఉన్నప్పటికీ, పాక్‌ ప్రభుత్వం అతడిపై మొక్కుబడిగా కేసు నమోదు చేయడం, పాక్‌ కోర్టు అతడిని విడుదల చేయడం తెలిసిందే. అయితే హఫీజ్ మన దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై స్పందిస్తున్నాడు. ఆందోళన సాగిస్తున్న వర్గాలకు మద్దతు ప్రకటిస్తున్నాడు.ఢిల్లిలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ(జెఎన్‌ యూ)లో ఆందోళన సాగిస్తున్న విద్యార్ధులకు అతడు మద్దతు ప్రకటించడం మన ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే. పార్లమెంటు మీద దాడి కేసులో ఉరిశిక్షకు గురైన అఫ్జల్‌ గురు వర్దంతి సందర్భంగా ఆ యూనివర్శిటీలో కొందరు విద్యార్ధులు ర్యాలీ నిర్వహించారు. ఉరిశిక్షలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఆ ర్యాలీ నిర్వహించిన విద్యార్ధి నాయకుడు కన్హయ్‌ కుమార్‌ని అధికారులు సస్పెండ్‌ చేశారు. దాంతో విద్యార్ధులు ఆందోళన ప్రారంభించడం,వారికి సయీద్‌ మద్దతు ప్రకటించడం వెనుక ఎంతో వ్యూహం, నెట్ వర్క్ ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కొద్ది నెలల క్రితం ఉత్తరప్రదేశ్‌ లోని దాద్రిలో అఖ్‌ లఖ్‌ అనే వ్యక్తి గొడ్డు మాంసం తిన్నాడన్న కారణంగా కొందరు వ్యక్తులు అతడిని కొట్టి చంపిన సంఘటనను పురస్కరించుకుని దేశంలో అసహన ధోరణులు పెరిగిపోతున్నాయంటూ కొందరు బాలీవుడ్‌ కళాకారులు ఆందోళన వ్యక్తం చేశారు. వారిలో సూపర్‌ స్టార్‌ షారూఖ్‌ ఖాన్‌ కూడా ఉన్నారు.ఆయన ప్రకటన వెలువడిన వెంటనే సయీద్‌ స్పందించాడు. భారత్‌ లో ఉండలేకపోతే పాక్‌ వచ్చేయండి, మీకు తగిన రక్షణ కల్పిస్తామంటూ ప్రకటన జారీ చేశాడు.దీనిపై మన ప్రభుత్వం పాక్‌ ప్రభుత్వానికి తీవ్ర నిరసన తెలియజేసింది. సయీద్‌ పై చర్యలు తీసుకోకపోవడం వల్లనే అతడు రెచ్చిపోతున్నాడని పాక్‌ కి పంపిన నిరసన ప్రకటనలో పేర్కొంది.అయితే,దానిని పాక్‌ ప్రభుత్వం పట్టించుకోలేదు.అలాగే, పఠాన్‌ కోట్‌ వైమానిక స్థావరంపై దాడికి పథక రచన చేసిన జైష్‌ ఎ మహ్మద్‌ అజర్‌ పై చర్య తీసుకోవాలని మన ప్రభుత్వం పట్టు పట్టినప్పుడు అతడిని కూడా గృహనిర్బంధంలో ఉంచినట్టు లీక్‌ లు విడుదల చేసింది. ఆ వెంటనే వాటిని ఖండించింది.అజర్‌ కి ఎటువంటి సంబంధం లేదని బుకాయించింది. మన దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న మూకలకు నేతృత్వం వహిస్తున్న సయీద్‌, అజర్‌ వంటివారు ఇప్పుడు యూనివర్సిటీల విద్యార్థులను తమ భావజాల ప్రభావానికి లోనుచేస్తూ భారతదేశంలో కల్లోలం రేపడానికి వ్యూహరచన చేస్తున్నట్లుగా ఉంది.

అయితే... ఉగ్రవాదులకు మద్దతు పలుకుతున్న విద్యార్థులను రాజకీయ పార్టీలు వెనకేసుకొస్తుండడం మరింత ఆందోళనకర పరిస్థితులకు కారణమవుతోంది. కేవలం మోడీ పట్ల ఉన్న వ్యతిరేకతతో ఆయన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్న కాంక్షతో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిని వెనకేసుకొస్తున్నాయి కాంగ్రెస్ వంటి పార్టీ, ఆయా పార్టీల నేతలు. అఫ్జల్‌ గురుకు అనుకూలంగా ప్రదర్శనలు జరిపిన విద్యార్ధులకు కాంగ్రెస్‌,వామపక్షాలు మద్దతు ప్రకటించడం ఏమాత్రం సమర్థనీయం కాదన్న విమర్శలు వస్తున్నాయి. తాజా పరిణామాలు దేశ యవత, మేధావులుగా సేవలందించాల్సిన విద్యార్థులను ఉగ్రవాదం చెరబడుతోందన్న అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. హైదరాబాద్ యూనివర్సిటీ, జేఎన్ యూలే కాకుండా తాజాగా బెంగాల్ లోని జాదవ్ పూర్ యూనివర్సిటీలోనూ మణిపూర్, నాగాలాండ్ లను ప్రత్యేక దేశాలుగా గుర్తించి స్వాతంత్ర్యం ఇవ్వాలంటూ కొత్త ఆందోళనలకు బీజం వేస్తున్నారు. ఇలా యూనివర్సిటీలపై తీవ్రవాద, ఉగ్రవాద గ్రూపులు కన్నేస్తున్నాయి. అయితే.. పార్టీలు, నాయకులు మాత్రం రాజకీయాల కోసం ఉగ్రవాద భావజాలానికి అండగా నిలుస్తుండడం అత్యంత ప్రమాదకరంగా మారుతోంది.