Begin typing your search above and press return to search.

మన ఆర్మీ క్యాంపుపై ఉగ్రమూక ఆత్మాహుతి దాడి

By:  Tupaki Desk   |   3 Oct 2016 5:40 AM GMT
మన ఆర్మీ క్యాంపుపై ఉగ్రమూక ఆత్మాహుతి దాడి
X
సరిహద్దుల్లో మొదలైన ఉద్రిక్తత రోజురోజుకి మరింత పెరుగుతోంది. ఉరీ ఉగ్రఘటనతో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చెలరేగిపోవటం.. మన సైనికులు పెద్ద ఎత్తున వీర మరణం పొందటం తెలిసిందే. ఈ ఇష్యూతో రగిలిన భారతావనికి నిదర్శనంగా.. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత ఆర్మీ.. సర్జికల్ స్ట్రైక్స్ తో విరుచుకుప‌డింది. ఈ దాడుల్లో ఉగ్రవాద శిబిరాలు నేల‌మ‌ట్టం చేసిన సైన్యం... ఉగ్రవాదుల్ని పెద్ద ఎత్తున హతమార్చటం తెలిసిందే.

భారత్ జరిపిన సర్జికల్స్ దాడితో పాక్.. పాక్ తో అంటకాగే ఉగ్రవాదులు ఆవేశంతో రగిలిపోవటం తెలిసిందే. భారత్ జరిపిన సర్జికల్ దాడికి ప్రతిగా తాము సైతం దాడి చేయాలని ఫిక్స్ అయిన వారు.. పలు ప్రయత్నాలు చేశారు. తాజాగా బారాముల్లా జిల్లాలోని ఆర్మీ క్యాంపుపై ఆదివారం ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. రాత్రి 8.25 గంటల ప్రాంతంలో ఒక పబ్లిక్ పార్కు ద్వారా 46 రాష్ట్రీయ రైఫిల్స్ క్యాంపులోకి చొర‌బ‌డేందుకు విఫలయత్నం చేశారు. తుపాకులతో విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు.

ఈ సందర్భంగా ఉగ్రవాదులకు.. సైన్యానికి మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక జవాను మరణించగా.. మరో ఇద్దరు జవాన్లకు గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. మరోవైపు జమ్ములోని పల్లన్ వాలా సెక్టార్ లోనూ పాక్ సైనికులు నియంత్రణ రేఖ వద్ద కాల్పులకు.. పేలుళ్లకు తెగబడ్డారు. మరో వైపు.. దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేపేందుకు కుట్ర పన్నిన ఉగ్రవాదులు పెద్ద ఎత్తున భారత్ లోకి ప్రవేశించినట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పాక్ కు.. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు సర్జికల్ షాక్ సరిపోలేదని.. మరింత డోసు పెంచాలన్న విషయం తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/