Begin typing your search above and press return to search.

పాత పార్టీకి కొత్త ఐడియా ఇచ్చిన టీజీ

By:  Tupaki Desk   |   22 July 2016 9:01 AM GMT
పాత పార్టీకి కొత్త ఐడియా ఇచ్చిన టీజీ
X
పార్లమెంటు సమావేశాల్లో ఏపీ ప్రత్యేక హోదాయే కీలక అంశంగా మారిన తరుణంలో ప్రతి ఒక్కరూ దీనిపై స్పందిస్తున్నారు. ప్రయివేటు మెంబర్ బిల్లు పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఏపీ ప్రత్యేక హోదా విషయంలో తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటూ టీడీపీ రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేశ్ సరికొత్త సూచన చేశారు. నిజంగా కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే ఏపీ ప్రత్యేక హోదా విషయంలో గట్టి పట్టుపట్టాలని... ప్రత్యేక హోదాకు జీఎస్టీ బిల్లుకు ముడిపెట్టి కేంద్రంతో హోదా ఇప్పించాలని డిమాండ్ చేశారు.

కేవీపీ బిల్లు ఓటింగ్‌ కు వ‌చ్చే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో టీజీ వెంకటేశ్ చేసిన ఈ ప్రతిపాదన చర్చనీయాంశమైంది. ఏపీకి హోదా ఇస్తే జీఎస్టీ బిల్లుకి మద్ద‌తు తెలుపుతామ‌ని కాంగ్రెస్‌ ప్రకటించాల‌ని టీజీ అన్నారు. తాము ఏపీ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాలను కాపాడుకునే క్ర‌మంలో వెన‌క‌డుగు వేయ‌బోమ‌ని ఆయ‌న తెలిపారు. కేవీపీ బిల్లుకి మ‌ద్ద‌తు తెలపాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌మ‌ను ఆదేశించిన‌ట్లు ఆయ‌న స్పష్టం చేశారు. అయితే.. టీజీ చేసిన ప్రతిపాదన ఎవరి కోసమన్న వాదన వినిపిస్తోంది. ప్రత్యేక హోదా బిల్లును అడ్డం పెట్టుకుని బీజేపీకి జీఎస్టీ బిల్లు విషయంలో కాంగ్రెస్ మద్దతు సాధించేందుకు టీజీ ప్రయత్నించారా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక హోదా అంశాన్ని విడిగా చూడకుండా జీఎస్టీ బిల్లు తదితర అంశాలతో ముడిపెట్టరాదని అంటున్నారు. నిజంగా టీడీపీకి కూడా చిత్తశుద్ధి ఉంటే ఆ పార్టీ కూడా జీఎస్టీ బిల్లుకు ప్రత్యేక హోదా బిల్లుకు ముడిపెట్టి హోదా సాధించుకోవాలన్న వాదనా వినిపిస్తోంది.

మరోవైపు బిల్లు నేపథ్యంలో రాజ్యసభ సభ్యులకు తెదేపా - భాజపా విప్‌ జారీ చేసాయి. ఈరోజంతా సభలోనే ఉండాలని అధిష్ఠానాలు సభ్యులకు సూచించాయి. రాజ్యసభలో ఓటింగ్‌ జరిగే అవకాశముండటంతో తెదేపా - భాజపా ఆ పార్టీ సభ్యులకు విప్‌ జారీ చేశాయి. కాంగ్రెస్‌ సభ్యులకు ఆపార్టీ ఇటీవలే విప్‌ జారీ చేసిన విషయం తెలిసిందే.