Begin typing your search above and press return to search.

అతి పెద్ద సెక్షన్ మండుతోంది...నో షార్ట్ కట్స్...?

By:  Tupaki Desk   |   3 May 2022 11:30 AM GMT
అతి పెద్ద సెక్షన్ మండుతోంది...నో షార్ట్ కట్స్...?
X
ఏపీలో వైసీపీకి మూడవ ఏడాది రాజకీయం అసలు బాలేదు. ముచ్చెమటలు పట్టిస్తోంది. తొలి రెండేళ్ళూ కరోనా ఉన్నా మరో మహమ్మారి విలయతాండవం చేసినా ఏపీలో జగన్ ఏలుబడి సాఫీగానే సాగిపోయింది. కావాల్సినన్ని అప్పులు పుట్టేశాయి. హ్యాపీగా తాడేపల్లిలో కూర్చుని బటన్ నొక్కేస్తూ సంక్షేమ సారధిగా పేరు తెచ్చేసుకున్నారు. ఇక ఎన్నికలు కూడా ఏవైనా భారీ విజయాలు దక్కాయి.

కానీ మూడవ ఏడు ఎంటర్ అయిన నాటి నుంచే కష్టాలు కలసికట్టుగా వచ్చిపడుతున్నాయి. అసలు గత ఆర్ధిక సంవత్సరం ఎలా గడిచిందీ అంటే అది ఒక్క ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డికే తెలుసు అనుకోవాలి. ఇక 2021-22 ఫైనాన్షియల్ ఇయర్ ముగుస్తూనే కేంద్రం కూడా ఆర్ధిక ఆంక్షలు అంటూ కొరడా ఝళిపిస్తోంది. చేతిలో ఇంకా రెండేళ్ళు ఉన్నాయి. ఎలా గడవాలో అసలు తెలియని స్థితి.

ఇక 2022లోన ప్రభుత్వ ఉద్యోగులు డైరెక్ట్ గా రోడ్డు మీదకు వచ్చేశారు. వారికి ఇవ్వాల్సిన పీయార్సీ విషయంలో ప్రభుత్వం అలసత్వంతో పాటు అసమగ్రమైన ప్యాకేజీని ఇచ్చిందంటూ విజయవాడ రోడ్ల మీద కదం తొక్కారు. మొత్తానికి ఆ సమస్యను ఎలాగో సామరస్యంగా పరిష్కరించుకున్న ప్రభుత్వానికి అందులో అతి ముఖ్యమైనది మాత్రం అలాగే ఉండిపోయింది.

అదే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం. దీనే సీపీఎస్ అంటారు. దీని రద్దు కోసం చాలా ఏళ్ళుగా ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చేస్తూ వస్తున్నారు. సీపీఎస్ అమలుతో 2004 తరువాత ఉద్యోగాల్లో చేరిన వారికి పెన్షన్ అయితే ఉండదు. దాంతో వారంతా కలత చెందుతున్నారు. ఒక విధంగా వారికి ఇది పెద్ద అంశంగా మారింది.

ఈ నేపధ్యం నుంచి చూసినపుడు విభజన ఏపీలో చంద్రబాబు తొలి సీఎం అయ్యారు. ఆయన్ని సీపీఎస్ రద్దు చేయమని ఉద్యోగులు అడిగినా అన్నీ తెలిసిన చంద్రబాబు ఆ డిమాండ్ కి ఒప్పుకోలేదు. ఎందుకంటే దాని వల్ల ప్రభుత్వ ఖజానాకు ఆర్ధికంగా ఇబ్బందులు తప్పవని, అది మోయలేని భారమని ఆయనకు తెలుసు కాబట్టి.

అయితే నాడు ఏపీలో విపక్ష నేతగా ఉన్న జగన్ కి ఈ విషయం మీద కనీస అవగాహన లేదా అన్నదే ఒక ప్రశ్నగా ముందుకు వస్తోంది. ఎందుకంటే జగన్ తన పాదయాత్ర సందర్భగ్నా సీపీఎస్ ని తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తానని హామీ ఇవ్వడం. దాంతో ఉద్యోగ వర్గాలు అంతా కూడా జగన్ కి జై కొట్టారు.

తీరా చూస్తే అధికారంలోకి వచ్చి మూడేళ్ళు అయినా కూడా జగన్ దీన్ని ఏ మాత్రం అమలు చేయలేకపోయారు. దానికి కారణం తెలిసిందే. అది ఒక గుదిబండ లాంటిది. ఈ నేపధ్యంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి ద్వారా తాము చేయలేమని చెప్పించారు. అయితే ఉద్యోగులు మాత్రం పట్టుపడుతున్నారు.

ఈ మధ్య జరిగిన చర్చలలో గ్యారంటీ పెన్షన్ స్కీం, జీపీఎస్ ని అమలు చేస్తామని అంటున్నారు. అంటే మొత్తం పెన్షన్ లో డెబ్బై శాతం వరకూ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధపడుతుంది అన్న మాట. అయితే జీపీఎస్ వద్దు, తమకు పాత పెన్షనే ముద్దు అని ఉద్యోగులు అంటున్నారు. ఈ మేరకు వారు ఉద్యమాన్ని మరింత తీవ్రం చేశారు. కొన్ని జిల్లాలలో అయితే ఉద్యమం నేపధ్యంలో శిరోముండనం చేసుకుని సైతం నిరసన తెలిపారు.

రానున్న కాలంలో తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు స్పష్టం చేస్తున్నారు. ఇస్తే పాతపెన్షన్ ఇవ్వాల్సిందే, నో జీపీఎస్, నో షార్ట్ కట్స్ అని ఉద్యోగులు అంటున్న వేళ సర్కార్ పెద్దలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నిజంగా ఇది జగన్ కి కత్తి మీద సాముగా ఉందని కూడా అంటున్నారు. జీపీఎస్ ద్వారా మధ్యేమార్గాన్ని వెతుక్కోవాలని చూసిన ప్రభుత్వానికి ఉద్యోగులు అడ్డం తిరగడంతో అది మింగుడు పడని వ్యవహరాంగా మారింది.

ఈ పరిస్థితుల్లో కనుక ఆలోచిస్తే రేపటి ఎన్నికలను విపరీతంగా ప్రభావితం చేసే అతి పెద్ద సెక్షన్ గా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు కనుక ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటే అధికారంలోకి మళ్ళీ రావడం విషయంలో ఏ ఆశలు పెట్టుకోనవసరం లేదు. అలాగని వారి డిమాండ్లకు తలొగ్గితే మొత్తం ఆర్ధిక భారంతో సర్కార్ బండి తల్లకిందులు అవుతుంది. ఏం చేయాలీ అంటే ఏమీ తోచడంలేదనే అంటున్నారు.

ప్రభుత్వం మాత్రం ఇలా వీలు అయిన వరకూ బాగా నాన్చి ఎన్నికల వేళకు అయినా సీపీఎస్ రద్దుకు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే అంతవరకూ ఉద్యోగుల నిరసనలు తలనొప్పి భరించాల్సిందేనా అంటే అవుననే చెప్పాలి. అవి శృతి మించితే మాత్రం రాజకీయంగా కూడా కోలుకోలేని దెబ్బ పడిపోతుంది. అపుడు సీపీఎస్ రద్దు అన్నా కూడా ఉపయోగం లేదు.