Begin typing your search above and press return to search.

సొంత పార్టీ నేతలపై బీజేపీ నిఘా.. హైకమాండ్ సీరియస్

By:  Tupaki Desk   |   7 Jan 2023 2:30 PM GMT
సొంత పార్టీ నేతలపై బీజేపీ నిఘా.. హైకమాండ్ సీరియస్
X
గత కొన్ని నెలలుగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు మారుతాడన్న ప్రచారం జోరుగా సాగింది. ఆ తరువాత పార్టీలోని కొందరు సీనియర్లు ప్రస్తుతానికి అలాంటి మార్పులు ఏవి ఉండవని క్లారిటీ ఇచ్చారు. దీంతో కేడర్లో ఉన్న అయోమయం తొలిగిపోయింది. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కూడా మారుస్తున్నారని అంటున్నారు.. కానీ అలాంటి మార్పు ఏమి ఉండదని బీజేపీ నాయకులు అంటున్నారు.. అయితే ఈ ప్రచారంపై హైకమాండ్ సీరియస్ అయింది. ఇలాంటి ప్రచారం చేస్తున్నదెవరు..? సొంత పార్టీ నేతలా..? లేక ఇతర పార్టీకి చెందినవారా..? అనే కోణంలో నిఘా పెట్టారు. అయితే ముందుగా సొంత పార్టీలో ఇలాంటి ప్రచారాన్ని ఎవరు మొదలు పెట్టారో తెలుసుకోనున్నారు. అవసరమైతే వారిని పార్టీ నుంచి బయటకు పంపించనున్నారు.

వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ ముందుకు వెళ్తోంది. సభలు, సమవేశాలు నిర్వహిస్తూ ప్రజలను తమ వైపు తిప్పుకుంటోంది. ఈ తరుణంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు మారుతాడన్న ప్రచారం జోరుగా సాగింది. ప్రస్తుతం ఉన్న బండి సంజయ్ స్థానంలో ఈటల రాజేందర్ ను నియమిస్తారని అన్నారు. అంతేకాకుండా పార్టీ కమిటీ కూడా పూర్తిగా మారుతుందని కొందరు తీవ్రంగా ప్రచారం చేశారు. దీంతో అప్రమత్తమైన పార్టీ హైకమాండ్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. వెంటనే రాష్ట్రంలోని సీనియర్ నేతలతో పార్టీ కమిటీలో ఎలాంటి మార్పు ఉండదని చెప్పించింది.

అయితే అంతటితో ఆగకుండా అసలు ఈ ప్రచారం ఎవరు చేశారన్న దానిపై నిఘా ఉంచింది. ఒకవేళ సొంత పార్టీ నేతలైతే వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పార్టీలో ఉంటూ తిన్నింటి వాసాలు లెక్కబెట్టేవారిని బయటకు పంపడమే బెటరని ఆలోచిస్తోంది. ఈ ప్రచారాన్ని మొదలుపెట్టింది ఎంతటి వారైనా సరే వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని కమలనాథులు అంటున్నారు.

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ను నియమించిన తరువాత పార్టీ ఊపందుకుంది. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు చెమటలు పట్టిస్తోంది. హైకమాండ్ సైతం దక్షిణాదిలోని మిగతా రాష్ట్రాల కంటే ఇప్పుడు తెలంగాణపైనే ఫోకస్ పెట్టింది. వచ్చేఎన్నికల్లో ఎలాగైన అధికారంలోకి రావాలని లక్ష్యం పెట్టుకుంది. ఈ తరుణంలో రాష్ట్ర అధ్యక్షుడిని మారిస్తే ఇబ్బందులు తప్పవు. కొత్త అధ్యక్షుడిని నియమించినా సెట్ అయ్యే వరకు కనీసం 6 నెలలు పట్టే అవకాశం ఉంది. అందువల్ల పార్టీ అధ్యక్షుడిని ఎలాంటి పరిస్థితుల్లో మార్చబోమని స్పష్టం చేసింది.

ఢిల్లీలో ఈనెల 16,17 తేదీల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. అయితే ఈ సమావేశాల్లోపు పార్టీ గురించి దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కొందరు రాష్ట్రనేతలకు ఆ టాస్క్ ను అప్పగించి జాతీయ కార్యవర్గ సమావేశాల్లోపు వారిని గుర్తించాలని తెలిపింది. ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తే వచ్చే ఎన్నికల్లో బ్యాడ్ ఇంప్రెషన్ పడే ప్రమాదం ఉందని పార్టీ నాయకులు భావిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.