Begin typing your search above and press return to search.

డీఎంకే పార్టీకి దెబ్బ‌మీద దెబ్బ 'గూగుల్ పే'లో ఓట‌ర్ల‌కు డ‌బ్బు పంపిణీ

By:  Tupaki Desk   |   5 April 2021 3:30 PM GMT
డీఎంకే పార్టీకి దెబ్బ‌మీద దెబ్బ గూగుల్ పేలో ఓట‌ర్ల‌కు డ‌బ్బు పంపిణీ
X
త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కాల‌ని భావిస్తున్న ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం, దివంగ‌త సీఎం క‌రుణానిధి కుమారుడి నేతృత్వంలో ద్ర‌విడ మున్నేట్ర క‌గ‌ళం... డీఎంకే పార్టీకి వ‌రుస దెబ్బ‌లు త‌గులుతున్నాయి. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసింది. అయితే.. ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఏకంగా డీఎంకే సార‌థిగా ఉన్న స్టాలిన్‌.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. దీంతో ఆయ‌న‌పై ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఇక‌, ఇదే పార్టీకి చెందిన కీల‌క నాయ‌కులు.. ప్ర‌స్తుత సీఎం, అన్నాడీఎంకే నేత‌.. ఎడ‌ప్పాడి ప‌ళ‌నిస్వామిపైనా విరుచుకుడి విప‌రీత వ్యాఖ్య‌లు సంధించారు.

ఎడ‌ప్పాడి నెల‌లు నిండ‌కుండానే పుట్టిన శిశువ‌ని.. కొన్నాళ్ల కింద‌ట ప్ర‌చారంలో డీఎంకే నేత వ్యాఖ్యానించారు. దీంతో ఆయ‌న‌పై ఏకంగా ఎఫ్ ఐఆర్ న‌మోదైంది. దీంతో డీఎంకే చుట్టూ ఎన్నిక‌ల కేసులు పెరుగుతున్నాయి. ఇదిలావుంటే.. ఇప్పుడు ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసిన త‌ర్వాత‌.. ఓట‌ర్ల‌కు డ‌బ్బులు పంచుతున్నార‌ని.. డీఎంకేపై మ‌రింత‌గా సెగ త‌గులుతోంది. ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనే క్ర‌మంలో ఓట‌ర్ల అకౌంట్ల‌కు నేరుగా గూగుల్ పే యాప్ నుంచి సొమ్ములు జ‌మ చేశార‌ని.. ప్ర‌త్య‌ర్థి పార్టీలు ఆరోపించాయి. దీనిలో స్టాలిన్ స‌హా.. ఆయ‌న కుమారుడు ఉద‌య‌నిధి కూడా ఉన్నార‌ని.. ఆరోపిస్తున్నారు.

స్టాలిన్, ఆయన కొడుకు సహా మరో ముగ్గురిని ఎన్నికల బరి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ అధికార ఏఐఏడీఎంకే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఓటర్లకు డబ్బులు పంచుతూ ప్రలోభాలకు పాల్పడ్డారని.. ఆ ఐదుగురిపై ఎన్నికల సంఘం అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేసింది. తండ్రీకొడుకులతో పాటు ఆ పార్టీ సీనియర్ నాయకులను పోటీ నుంచి తప్పించాలని కోరుతూ ఫిర్యాదు చేసింది. స్టాలిన్ పోటీ చేస్తున్న కొలత్తూర్, ఆయన కొడుకు ఉదయనిధి బరిలో నిలిచిన చెపాక్ ట్రిప్లికేన్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దురై మురుగన్ పోటీలో ఉన్న కాట్పాడి, తిరుచిరాపల్లిలో నెహ్రూ, తిరువణ్ణామలై నుంచి వేలు డీఎంకే అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.

డీఎంకే కీలక నేతలుగా ఉన్న ఈ ఐదుగురి నియోజకవర్గాల్లో ఓటర్లకు డబ్బులు పంచుతున్నట్లు అన్నాడీఎంకే ఆరోపించింది. ఎంకే స్టాలిన్ పోటీ చేస్తున్న కొలత్తూరులో ఏప్రిల్ 2 నుంచే నగదు పంపిణీ మొదలైందని.. ఒక్కొక్కరికి రూ.5 వేలు ఇస్తున్నట్లు అన్నాడీఎంకే న్యాయవాది విభాగం జాయింట్ సెక్రటరీ ఈసీకి ఫిర్యాదు చేశారు. స్టాలిన్ భార్య దుర్గ ఇప్పటికే నియోజకవర్గంలో తిష్టవేసి మహిళా గ్రూపులకు రూ.10 వేల చొప్పున పంపిణీ చేస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఎన్నిక‌ల సంఘం ఈ విష‌యాన్ని చాలా సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. దీనిపై కేసులు న‌మోదు చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇదే జ‌రిగితే.. విష‌యం క‌నుక రుజువైతే.. వీరి అభ్య‌ర్థిత్వాలు ర‌ద్ద‌య్యే ప్ర‌మాదం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.