Begin typing your search above and press return to search.

కొవిడ్ తో దారుణ స్థితిలో ఐపీఎల్ ఫౌండర్.. దిగ్గజ క్రికెటర్ రిప్లై ఇదే

By:  Tupaki Desk   |   14 Jan 2023 1:53 PM GMT
కొవిడ్ తో దారుణ స్థితిలో ఐపీఎల్ ఫౌండర్.. దిగ్గజ క్రికెటర్ రిప్లై ఇదే
X
అది 2007.. వన్డే ప్రపంచ కప్ లో రాహుల్ ద్రవిడ్ సారథ్యంలోని టీమిండియా మొదటి రౌండ్ లోనే నిష్క్రమించింది. సచిన్, గంగూలీ, సెహ్వాగ్, యువరాజ్, ధోనీ వంటి దిగ్గజాలున్న జట్టు ఇలా ఉత్త చేతులతో రావడం క్రికెట్ అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. క్రికెటర్ల ఇంటిపై దాడికి దిగేంతగా ప్రేరేపించింది. ఇక జీ టీవీ అధినేత సుభాష్ చంద్ర సౌజన్యంతో దిగ్గజ క్రికెటర్ కపిల్ ముందుండి.. ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్)ను ఏర్పాటు చేశారు. దీనికి బీసీసీఐ అనుమతివ్వలేదు. పరిస్థితి చూస్తుంటే కొంపలు మునిగేలా ఉన్నాయని భావించింది. వెంటనే తేరుకుని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను ప్రారంభించింది. 2008లో తొలి సీజన్ లోనే ఐసీఎల్ తేలిపోగా.. ఐపీఎల్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందో చూస్తున్నాం. కాగా, ఐపీఎల్ ఆలోచనతో పాటు దానిని పెంచి పెద్ద చేసిన వ్యక్తి ఒకరున్నారు. ఐపీఎల్ చైర్మన్ గా లీగ్ ను శాసించాడు. సంపన్న కుటుంబంలో పుట్టి, అత్యంత విలాసవంతమైన జీవితం గడిపిన అతడు.. చివరకు అవినీతి ఆరోపణల కారణంగా లీగ్ కు దూరమయ్యాడు. ఏకంగా దేశం విడిచివెళ్లి ప్రవాసంలో జీవితం గడుపుతున్నాడు.

నాడు అలా.. నేడు ఇలా.. ఆటగాళ్లు కాకుండా 2008-2013 మధ్య భారత క్రికెట్ లో మార్మోగిన పేరు లలిత్ మోదీ. రాజస్థాన్ కు చెందిన లలిత్ డబ్బున్న కుటుంబంలో పుట్టాడు. అంతే గొప్పగా బతికాడు. ఆ రాష్ట్ర క్రికెట్ సంఘం నుంచి జాతీయ స్థాయికి ఎదిగాడు. ఐపీఎల్ ఏర్పాటు, విజయవంతం వెనుక ఉన్న మాస్టర్ బుర్ర లలిత్ మోదీదే.

లీగ్ ను అంతటి విజయవంతం చేసిన అతడు 2010లో పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొన్నాడు. మనీ ల్యాండరిగ్, ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్ లో పరోక్ష భాగస్వామ్యం వంటి అభియోగాలూ అతడి మీద వచ్చాయి. అంటే లీగ్ మొదలైన మూడేళ్లకే లలిత్ మోదీ చరిత్ర మసకబారింది. కాగా, 2010లోనే అతడు భారత దేశాన్ని వీడాడు. అదే ఏడాది బీసీసీఐ బహిష్కరించింది. ఆర్థిక అవకతవకల కారణంగా 2013లోనే జీవిత కాల నిషేధం విధించింది.

పుష్కర కాలంగా ప్రవాసంలో దాదాపు 12 ఏళ్లుగా లలిత్ మోదీ విదేశాల్లోనే ఉంటున్నాడు. అతడు లండన్ లో తలదాచుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం అతడు కొవిడ్ బారిన పడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడికి 24 గంటల పాటు ఆక్సిజన్ అవసరం అయ్యేంత స్థితిలో ఉన్నాడు. ఇన్ ఫ్లుయోంజా, తీవ్ర న్యుమోనియాతోనూ బాధపడుతున్నాడు.

దీంత ఆక్సిజన్ అందేలా ప్రత్యేకంగా ముక్కు వద్ద ఏర్పాట్లు చేశారు. ఈ విషయాన్ని లలిత్ మోదీ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు. కాగా, లలిత్ మోదీకి 2 వారాల్లో రెండుసార్లు కొవిడ్ సోకినట్లు తెలుస్తోంది. పరిస్థితి క్లిష్టంగా ఉండడంతో అతడిని ఎయిర్ అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. కాగా, లలిత్ మోదీ అనారోగ్యం సంగతి తెలుసుకుని టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. త్వరగా కోలుకోవాలంటూ కాంక్షించాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.