Begin typing your search above and press return to search.

ఆ సినీ న‌టులిద్ద‌రికి ప‌ద‌వులు ఖాయ‌మేనా?

By:  Tupaki Desk   |   5 Sep 2022 7:11 AM GMT
ఆ సినీ న‌టులిద్ద‌రికి ప‌ద‌వులు ఖాయ‌మేనా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో వైఎస్సార్సీపీకి ప‌లువురు సినీ న‌టులు మ‌ద్దతుగా నిలిచారు. ఎన్నిక‌ల్లో పార్టీ అభ్య‌ర్థుల త‌ర‌ఫున ప్ర‌చారం చేశారు కూడా. సినీ న‌టులు అలీ, పోసాని కృష్ణ‌ముర‌ళి, జీవిత, రాజ‌శేఖ‌ర్, మంచు మోహ‌న్ బాబు, పృథ్వీరాజ్, విజ‌య‌చంద‌ర్, మంచు విష్ణు, క‌థా ర‌చ‌యిత చిన్నికృష్ణ‌ త‌దిత‌రులు వీరిలో ఉన్నారు. వీరిలో కొంత‌మంది పార్టీలో చేర‌గా, మ‌రికొంత‌మంది పార్టీలో చేర‌క‌పోయినా వైఎస్సార్సీపీ మ‌ద్ద‌తుగా ప్ర‌చారం నిర్వ‌హించారు.

ఈ క్ర‌మంలో ఒక్క పృథ్వీరాజ్‌, విజ‌య‌చంద‌ర్‌కు త‌ప్ప మ‌రెవ‌రికీ ప‌ద‌వులు ద‌క్క‌లేదు. అయితే పృథ్వీరాజ్ ప‌ద‌వి మూన్నాళ్ల ముచ్చ‌ట‌గానే మిగిలిన సంగ‌తి తెలిసిందే. శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి చాన‌ల్ చైర్మ‌న్‌గా పృథ్వీరాజ్, ఆంధ్ర‌ప్ర‌దేశ్ చ‌ల‌న‌చిత్ర‌, నాట‌క రంగ అభివృద్ధి సంస్థ (ఏపీఎఫ్‌డీసీ) చైర్మ‌న్‌గా ప‌ద‌వులు ద‌క్కించుకున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాదిన్న‌ర స‌మ‌యం మాత్ర‌మే ఉంది. ఈ నేప‌థ్యంలో మరోమారు వైఎస్సార్సీపీకి సినీ గ్లామ‌ర్‌ను అద్ద‌డానికి ఆ పార్టీ అధిష్టానం చ‌ర్య‌లు ప్రారంభించింద‌ని టాక్ న‌డుస్తోంది. ఈ క్ర‌మంలో సినీ న‌టుడు అలీకి వ‌క్ఫ్ బోర్డు చైర్మ‌న్‌గా లేదా ఏపీ ఎల‌క్ట్రానిక్ మీడియా స‌ల‌హాదారుగా చాన్స్ ఇస్తారని టాక్ వినిపిస్తోంది.

అలీకి రాజ్య‌స‌భ స‌భ్యుడిగా, వ‌క్ఫ్ బోర్డు చైర్మ‌న్‌గా లేదంటే ఏదైనా కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా చాన్స్ ఇస్తున్నార‌ని పెద్ద ఎత్తున వార్త‌లు వినిపించాయి. రెండు మూడుసార్లు సీఎం వైఎస్ జ‌గ‌న్ పిలిపించుకుని అలీతో మాట్లాడ‌టంతో అలీకి ప‌ద‌వి ఖాయ‌మ‌నే అనుకున్నారు. అయితే ఏ ప‌ద‌వీ ద‌క్క‌లేదు.

ఇక పోసాని కృష్ణ‌ముర‌ళి క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వాడు. క‌థా ర‌చ‌యిత‌గా, న‌టుడిగా, డైరెక్ట‌ర్‌గా ఉన్న ఆయ‌న టీడీపీ, జ‌న‌సేనపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ముఖ్యంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మాతృమూర్తి, స‌తీమ‌ణి, పిల్ల‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని బూతులు తిట్ట‌డంతో సినిమా రంగంలో పోసానిని ప‌ట్టించుకున్న‌వారు క‌రువ‌య్యారు. అలాగే అలీకి కూడా అంత‌కుముందులా సినిమా చాన్సులు రావ‌డం లేదు. ఏదో ఒక‌టి అరా చిత్రాల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నారు. అది కూడా చిన్న సినిమాలే వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో వైఎస్సార్సీపీ అధినేత అలీ, పోసాని కృష్ణ‌ముర‌ళిల‌కు ప‌ద‌వులు ఇవ్వాల‌ని సంక‌ల్పించార‌ని నెటిజ‌న్ల‌లో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. అలీకి వ‌క్ఫ్ బోర్డు చైర్మ‌న్ లేదా ఎల‌క్ట్రానిక్ మీడియా స‌ల‌హాదారు, పోసాని కృష్ణ‌ముర‌ళికి ఏపీ చ‌ల‌న‌చిత్రాభివృద్ధి సంస్థ చైర్మ‌న్ ప‌ద‌విని ఇస్తార‌ని టాక్ న‌డుస్తోంది. అయితే అంతా అనుకున్న‌ట్టు వీరు ప‌ద‌వులు ద‌క్కించుకున్నా ఏడాదిన్న‌ర మాత్ర‌మే ఉండ‌టానికి వీల‌వుతుంది. ఒక‌టి రెండు రోజుల్లోనే వీరికి ప‌ద‌వుల‌పైన స్ప‌ష్ట‌త రానుంద‌ని తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.