Begin typing your search above and press return to search.

కాపు నేతల ఐక్యతా రాగం... వరస మీటింగులతో హల్ చల్ 

By:  Tupaki Desk   |   15 Dec 2022 8:30 AM GMT
కాపు నేతల ఐక్యతా రాగం... వరస మీటింగులతో హల్ చల్ 
X
ఏపీలో ఎన్నికల సీజన్ దగ్గరపడుతోంది. దాంతో పాటుగా రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఏపీలో రాజకీయం అంటే పక్కా కులాల లెక్కలే. ఏపీలో సామాజిక సమీకరణలు తీసుకుంటే కాపులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కాపుల మద్దతు అత్యవసరం. వారు తలచుకుంటేనే ముఖ్యమంత్రి పీఠం మీద ఎవరైనా కూర్చోనేది.

ఇంకో వైపు చూస్తే కాపులకు చిరకాల కోరికగా సీఎం పదవి ఉంది. ఇపుడు కాలం కలసివస్తోంది. జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ స్థాపించారు. నిజానికి 2019 ఎన్నికల నాటికే కాపులు పోలరైజ్ కావాలి కానీ అప్పటికి వైసీపీ వేవ్ బలంగా ఉంది, జగన్ కి ఒక్క చాన్స్ ఇవ్వాలన్న ఆలోచన ప్రజలలో ఉంది. దాంతో జనసేనకు కాపులు అంతా గుత్తమొత్తంగా మద్దతు ఇవ్వలేకపోయారు.

ఇపుడు చూస్తే ఏపీలో టీడీపీ వైసీపీ పాలన రెండూ చూశారు. దాంతో మూడవ ఆల్టర్నేషన్ గా జనసేన ఉంది. పైగా కాపులకు ఆశదీపంగా ఈ పార్టీ ఉంది. ప్రజారాజ్యం నాటి పొరపాట్లను తిరిగి చేయకుండా అంతా కలసి ఒక్కటిగా ఉంటే ఏపీలో కాపులకు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయగలమన్న కొత్త ఆలోచనలు వస్తున్నాయి. ఆనాడు ప్రజారాజ్యం పార్టీ కర్త కర్మ అన్నీ తానే అయి వ్యవహరించిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇపుడు కాపు నేతల వరస మీటింగుల వెనక ఉన్నారు.

ఈ మీటింగులు హైదరాబాద్, విశాఖలలో జరిగాయి, ఇపుడు విజయవాడలో జరిగింది. అది కూడా గంటా ఇంట్లో ఒక వైపు కాపునాడు మీటింగ్ ని రంగా వర్ధంతి రోజైన 26న విశాఖలో నిర్వహించడానికి గంటా తెర వెనక అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు. తాజాగా పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇక ఆ పోస్టర్ మీద రంగాతో పాటు పవన్ చిరంజీవి బొమ్మలు ఉండడం కాపులకు సరికొత్త సంకేతంగా కనిపిస్తోంది.

ఆనాడు రంగా ఆశించిన రాజ్యాధికారాన్ని సాధించుకోవడానికి ఈనాటికి దారి దొరికింది అన్నట్లుగా కాపునాడు సభ ఈ నెల 26న విశాఖలో చెప్పబోతోంది అని అంటున్నారు. ఇక విజయవాడలో గంటా ఇంట్లో జరిగిన కాపు నేతల మీటింగుకు మరో టీడీపీ నేత బోండా ఉమా, బీజేపీ లీడర్ కన్నా లక్ష్మీనారాయణతో పాటు ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన ఎడం బాలాజీ కూడా హాజరయ్యారు.

ఈ మీటింగులో అనేక కీలక విషయాలు చర్చించారు అని అంటున్నారు. ఈ నెల 26న జరిగే కాపునాడు కోసం కూడా ఈ మీటింగ్ జరిగింది అని చెబుతున్నారు. అంతే కాదు వచ్చే ఎన్నికల్లో జనసేనకు మద్దతు ఇచ్చేలా కూడా కాపు నాయకులు టర్న్ అవుతున్నారు అని చెబుతున్నారు. పార్టీలకు అతీతంగా కాపు నాయకులు అంతా జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు అని అంటున్నారు. ఇక ఈ నెల 26న జరిగే కాపునాడు సభ ఏపీ రాజకీయాలను కీలకమైన మలుపు తిప్పుతుంది అని అంటున్నారు.

ఈ సభ ద్వారా ఏపీలో కాపులు కొత్త డిమాండ్లు ముందుకు తెస్తారని, రాజకీయంగా ఇప్పటికే కీలకంగా ఉంటున్న అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీకి మింగుడు పడని విధంగానే కాపునాడు సభ తీర్మానాలు ఉండబోతున్నాయని అంటున్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటి అంటే తాజాగా కన్నా లక్ష్మీనారాయణను జనసేన నేత నాదెండ్ల మనోహర్ కలుసుకుని చర్చలు జరిపారు. దాంతో కాపు నేతలు చాలా మంది జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం మొదలైంది.

ఇపుడు చూస్తే కాపునాడు సభను గంటా కనుసన్ననలో నిర్వహించడం ద్వారా కాపులను ఏకం చేసి జనసేన వైపు నడిపించాలి అన్న ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు. దానికి నాందిగానే ఈ సభ అంటున్నారు. దానికి వంగవీటి మోహన రంగా కుమారుడు రాధా హాజరవుతారని కూడా తెలుస్తోంది. మొత్తానికి ఏపీలో కాపులు ఏదో సంచలనానికి తెరె తీసేలా ఉన్నారని అంటున్నారు. అవేంటి అన్నది చూడాలీ అంటే ఈ నెల 26 వరకూ ఆగాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.