Begin typing your search above and press return to search.

అత్యధిక చమురు దిగుమతి చేసుకున్న అగ్రరాజ్యం.. ఎక్కడి నుంచంటే?

By:  Tupaki Desk   |   1 May 2022 1:30 AM GMT
అత్యధిక చమురు దిగుమతి చేసుకున్న అగ్రరాజ్యం.. ఎక్కడి నుంచంటే?
X
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర ప్రారంభించిన వెంటనే ఆగమేఘాలపై స్పందించింది అగ్ర రాజ్యం అమెరికానే. ప్రపంచంలో ఏ దేశం మరో దేశం పై విధించిన అత్యంత కఠిన ఆంక్షలను ప్రకటించింది. ఉక్రెయిన్ కు ఆర్థిక, ఆయుధ సాయంతో మద్దతుగా నిలిచి రష్యాను బలగాలను నిలువరించడంలో కీవ్ సేవలకు తోడ్పాటు అందిస్తోంది. అయితే రష్యా-అమెరికా వాణిజ్య దిగుమతులకు సంబంధించి అత్యంత ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది.

ఉక్రెయిన్ పై సైనిక చర్య మొదలు పెట్టిన తర్వాత రష్యా నుంచి అత్యధిక స్థాయిలో ఆయిల్ ను భారత్ దిగుమతి చేసుకుంటోందని అందరూ భావించారు. మాస్కో, న్యూ డిల్లీకి దశాబ్దాలుగా బలమైన సంబంధాలు ఉండటం, చిరకాల మిత్రదేశం కాబట్టి ఇరు దేశాల మధ్య చమురు వాణిజ్యంపై యుద్ధ ప్రభావం పడలేదని భావించవచ్చు.

కానీ ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే... గత కొద్ది నెలల కాలంలో రష్యా నుంచి శిలాజ ఇంధనాన్ని భారత్ కంటే అమెరికానే అత్యధిక మొత్తంలో దిగుమతి చేసుకుంది. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ సంస్థ వెల్లడించింది. యుద్ధం మొదలైన తర్వాత రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకున్న దేశాల జాబితాలో జర్మనీ అగ్ర స్థానంలో నిలవడం గమనార్హం. రెండో స్థానంలో ఇటలీ, మూడో స్థానంలో చైనా నిలిచాయి.

టాప్ టెన్ లో నెదర్లాండ్, టర్కీ, ఫ్రాన్స్, బెల్జియం, స్పెయిన్, దక్షిణ కొరియా, పోలెండ్ సహా అత్యధికంగా ఈయూ దేశాయి ఉన్నాయి. ఓ వైపు ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ.. ఇతర దేశాల అవసరాలను, తన వాణిజ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రష్యా భారీగా ఎగుమతులు చేపట్టింది. ఒక్క ఇంధన రంగం లోనే 63 బిలియన్ యూరోల మేర చమురు ఎగుమతి చేసింది. ఇందులో 71 శాతం ఐరోపా దేశాలకు ఎగుమతి చేయడం విశేషం.

రాయితీ పై వస్తుండటంతో భారత్ భారీగానే రష్యా ముడి చమురు కొనుగోలు చేసినా... అమెరికా దిగుమతి చేసుకున్న మొత్తం తో పోల్చితే చాలా తక్కువే. భారీగా రాయితీ వస్తుందని భారతీయ అధికారులు చెబుతున్నా...పలు పశ్చిమ నివేదికలను బట్టి బ్యారెల్ కు 30 డాలర్ల కంటే ఎక్కువ లభించడం లేదు. అంతేకాదు రవాణా ఖర్చులు, బీమా, వార్ ప్రీమియం కూడా చెల్లించాల్సి రావడంతో ప్రయోజనం పెద్దగా ఉండదని ప్రభుత్వం భావిస్తున్నట్లు అభిజ్ఞాన వర్గాలు పేర్కొన్నాయి.

ఇంధనం, ఆహారం, ఫార్మా ఉత్పత్తులకు ఆంక్షలు వర్తించనందున ముడి చమురును రాయితీ అందించడానికి సిద్ధంగా ఉన్నామని రష్యా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. భారత్, ఈజిప్ట్ ఇతర అసాధారణ గమ్య స్థానాలకు రష్యా చమురు ఎగుమతులు అందరి దృష్టిని ఆకర్షించాయి. అయితే ఐరోపాకు ఎగుమతుల్లో స్వల్పంగా తగ్గినా కొత్త గమయ్ స్థానాలు దీన్ని భర్తీ చేయలేవని సీఆర్ఈఏ పేర్కొంది. భారత్ విషయానికి వస్తే జనవరి-ఫిబ్రవరి తో పోలిస్తే... ఏప్రిల్ మొదటి మూడు వారాల్లో బొగ్గు 130 శాతం ముడి చమురు 340 శాతం మేర రవాణా పెరిగింది.