Begin typing your search above and press return to search.

చెరుకువాడ ఇలాకాలో వైసీపీ బోల్తా.. ఏం జ‌రిగింది?

By:  Tupaki Desk   |   20 Sep 2021 9:34 AM GMT
చెరుకువాడ ఇలాకాలో వైసీపీ బోల్తా.. ఏం జ‌రిగింది?
X
ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో త‌న‌కు ఎదురు లేద‌ని.. పార్టీని, నాయకుల‌ను ఏక‌తాటిపై న‌డిపిస్తున్నాన‌ని.. ప‌దే ప‌దే చెప్పుకొనే మంత్రి చెరుకువాడ శ్రీరంగ‌నాథ‌రాజుకు భారీ ఎదురు దెబ్బ‌త‌గిలింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో ప్ర‌భంజ‌నం సృష్టిస్తే.. మంత్రి రంగ‌నాథ‌రాజు సొంత నియోజ‌క‌వ‌ర్గం ఆచంట‌లో మాత్రం.. పార్టీ ఇరుకున‌ప‌డింది. ఆచంట మండలంలో వైసీపీ పరాజయం పాలైంది. అక్కడ జడ్పీటీసీతోపాటు ఎంపీపీ పీఠాన్ని ప్రతిపక్షాలు దక్కించుకున్నాయి. జడ్పీటీసీ పోరులో అధికార వైసీపీ అభ్యర్థి కడలి రామగోవిందరాజుపై టీడీపీ అభ్యర్థి ఉప్పలపాటి సురేష్‌బాబు విజయం సాధించారు.

మంత్రి ప‌ట్టు కోల్పోయారా?

ఆచంట మండలంలోని 17 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా టీడీపీ-జనసేన కలిసి పోటీ చేసి మండల పరిషత్‌ అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నాయి. ఈ మండలంలో వైసీపీ 6 చోట్ల, టీడీపీ 7, జనసేన 4 చోట్ల విజయం సాధించాయి. నియోజకవర్గ పరిధిలోని మిగిలిన మూడు మండలాల్లో మాత్రం అధికార పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. పోడూరు, పెనుమంట్ర జడ్పీటీసీ స్థానాలను అధికార పార్టీ అభ్యర్థులే దక్కించుకున్నారు. పెనుగొండ మండలంలో మాత్రం టీడీపీ అభ్యర్థి మృతి చెందడంతో అక్కడ ఎన్నికలు జరగలేదు. ఏదేమైనా.. సొంత నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి ప‌ట్టు కోల్పోవ‌డం చ‌ర్చ‌కు దారితీసింది.

అక్క‌డ ఫ‌లితం రివ‌ర్స్‌!

వీరవాసరం మండలంలో ఫ‌లితం రివ‌ర్స్ అయింది. గ‌త 2014లో జరిగిన పరిషత్తు ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో టీడీపీ హవా కొనసాగగా.. వీరవాసరం ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలను మాత్రం అప్ప‌టి వైసీపీ అభ్యర్థులు సొంతం చేసుకున్నారు. అయితే.. ఈ సారి ఈ ఫ‌లితం రివ‌ర్స్ అయింది. ప్రస్తుత ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక స్థానాల్లో వైసీపీ హవా కొనసాగగా ఈ మండలంలో మాత్రం జనసేన, టీడీపీ కలిసి జడ్పీటీసీతో పాటు ఎక్కువ ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకున్నాయి. 2014లో ఇక్కడ ఎంపీపీగా గెలుపొందిన కవురు శ్రీనివాస్‌ ప్రస్తుతం యలమంచిలి జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు.

జిల్లా ప‌రిస్థితి ఇదీ..

ప‌శ్చిమ గోదావరి జిల్లాలో పరిషత్తు ఎన్నికల లెక్కింపు ఆదివారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా అధికార పార్టీ వైసీపీ జోరు కొన‌సాగింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ రెండింటా ఆ పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధించింది. జడ్పీ పీఠాన్ని ఆ పార్టీ కైవశం చేసుకోనుంది. మొత్తం 777 ఎంపీటీసీ స్థానాలకు 608, 45 జడ్పీటీసీలకు 42 స్థానాలతో విజయ దుందుబి మోగించింది. టీడీపీ 99 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ, జనసేన 60 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ స్థానాలను కైవ‌సం చేసుకున్నాయి.