Begin typing your search above and press return to search.

ఇవి జాతీయ ప్రాజెక్టులే.. కానీ, విశాఖ‌కు ఇస్తున్న‌ట్టు క‌ల‌ర్‌.. మోడీ అంటే మోడీనే బ్రో

By:  Tupaki Desk   |   12 Nov 2022 8:55 AM GMT
ఇవి జాతీయ ప్రాజెక్టులే.. కానీ, విశాఖ‌కు ఇస్తున్న‌ట్టు క‌ల‌ర్‌.. మోడీ అంటే మోడీనే బ్రో
X
తన ఆంధ్రప్రదేశ్‌ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ దాదాపు రూ.15 వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టు పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. విశాఖపట్నం పర్యటనలో భాగంగా ఏయూ ప్రాంగణంలోని ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాదాపు రూ.15వేల కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులను వర్చువల్‌ విధానంలో మోడీ ప్రారంభించారు.

రూ.2,658 కోట్లతో శ్రీకాకుళం–అంగుల్‌ నేచురల్‌ గ్యాస్‌ పైపులైన్‌ (745 కి.మీ.), రూ. 3,778 కోట్లతో రాయపూర్‌–విశాఖ ఎకనామిక్‌ కారిడార్‌లో 6 లేన్ల గ్రీన్‌ ఫీల్డ్‌ రహదారి, విశాఖ ఎన్‌హెచ్‌–516సిపై కాన్వెంట్‌ జంక్షన్‌–షీలానగర్‌ జంక్షన్‌ వరకు 6 లేన్లు, రూ. 566 కోట్లతో విశాఖ పోర్టు కనెక్టివిటీ కోసం అదనంగా 4 లేన్ల డెడికేటెడ్‌ పోర్టు రోడ్డు, రూ.152 కోట్లతో విశాఖ ఫిషింగ్‌ హర్బర్‌ ఆధునికీకరణ, రూ.460 కోట్లతో విశాఖ రైల్వే స్టేషన్‌ పునరాభివృద్ధికి ప్రధాని మోడీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా రూ.2917 కోట్లతో నిర్మించిన ఓఎన్‌జీసీ–యుఫీల్డ్‌ ఆన్‌షోర్‌ సదుపాయాలను ప్రధాని జాతికి అంకితం ఇచ్చారు. అదేవిధంగా రూ.211 కోట్లతో అభివృద్ధి చేసిన పాతపట్నం–నరసన్నపేట రహదారి అభివృద్ధి పనులను జాతికి అంకితం చేశారు.

అనంతరం ప్రధాని మోడీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. విశాఖకు ఇవాళ మరుపురాని రోజు అని చెప్పారు. భారత్‌కు విశాఖ ప్రత్యేకమైన నగరమని తెలిపారు. ప్రాచీన భారతంలో విశాఖ ప్రముఖ ఓడరేవు అని గుర్తు చేశారు. ప్రాచీన కాలం నుంచి విశాఖ పోర్టుకు ఘన చరిత్ర ఉందన్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రముఖ వ్యాపార కేంద్రంగా విశాఖ విరాజిల్లుతోందని వివరించారు. వెయ్యేళ్ల క్రితమే పశ్చిమాసియా, రోమ్‌కు విశాఖ నుంచి వ్యాపారం జరిగేదని గుర్తు చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తనను కలిసినప్పుడల్లా ఏపీ అభివృద్ధి గురించే అడిగేవారని కొనియాడారు.

వికసించిన భారత్‌ అనే అభివృద్ధి అనే మంత్రంతో భారత్‌ ముందుకెళ్తోందని ప్రధాని మోడీ తెలిపారు. సమ్మిళిత అభివృద్ధే తన ఆలోచన అని చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి ద్వారా ఆధునిక భారత్‌ను ఆవిష్కరిస్తున్నామని తెలిపారు. రైల్వే, రోడ్లు, పోర్టుల అభివృద్ధి విషయంలో ముందుంటున్నామని పేర్కొన్నారు. విశాఖ రైల్వే స్టేషన్‌తో పాటు పోర్టును కూడా ఆధునికీకరిస్తున్నామని చెప్పారు.

బహుముఖ రవాణా వ్యవస్థ దిశగా విశాఖ ముందడుగు వేస్తోందని ప్రధాని మోడీ తెలిపారు. ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్‌ వైపు చూస్తున్నాయని గుర్తు చేశారు. సామాన్య మానవుడి జీవితం మెరుగుపరచడమే తమ ప్రధాన లక్ష్యమని వివరించారు. పేదవాళ్లకు సైతం ఆధునిక సాంకేతికత ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో అప్పడే వికసించిన భారత్‌ కల సాకారమవుతుందన్నారు. సముద్ర తీరాలు మన సమృద్ధికి ముఖ్య ద్వారాలుగా మారాయన్నారు. భారత్‌ను అభివృద్ద్ధి పథంలోకి తీసుకెళ్లడంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య భూమిక పోషిస్తుందని చెప్పారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.