Begin typing your search above and press return to search.

రోడ్ల కోసం చందాలేసుకుంటున్నారు.. స‌ర్కారుకు సిగ్గుందా?! చంద్ర‌బాబు ఫైర్‌

By:  Tupaki Desk   |   24 Aug 2022 11:34 AM GMT
రోడ్ల కోసం చందాలేసుకుంటున్నారు.. స‌ర్కారుకు సిగ్గుందా?!  చంద్ర‌బాబు ఫైర్‌
X
వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయి లో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉందని విమర్శించారు. అనంత పురం జిల్లా, గుత్తిలో ఆటో డ్రైవర్లు రూ. 2 వేల చొప్పున..

చందాలు వేసుకుని గుంతలను పూడ్చారని.. ఇది జగన్ పాలన తెచ్చిన ప్రజా చైతన్యమా?.. లేక ప్రజలకు అనివార్యమా?.. అని ప్ర‌శ్నించారు. ఇది ప్రజలకు అనివార్యం అనుకుంటే మీకు అధికారం ఎందుకని చంద్రబాబు నిల‌దీశారు. రోడ్ల కోసం చందాలు వేసుకునే ప‌రిస్థితిని క‌ల్పించిన ప్ర‌భుత్వానికి సిగ్గుందా? అని ప్ర‌శ్నించారు.

మ‌రోవైపు.. చంద్రబాబు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. మూడు రోజులపాటు ఆయన కుప్పంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా రామకుప్పం మండలంలో రోడ్‌ షో నిర్వహించను న్నారు. అలాగే బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. కొద్ది సేప‌టి కింద‌టే రామకుప్పం మండలానికి చేరుకున్న‌ చంద్రబాబుకు ఆ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం ప‌లికారు.

రామకుప్పం మండలం కొంగనపల్లెకు చేరుకుని కొళ్లుపల్లె, చెల్దిగానిపల్లె, రాజుపేట మీదుగా రామకుప్పం పట్టణానికి చేరుకుని బహిరంగసభలో ప్రసంగిస్తారు. పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మునస్వామి, మండల అధ్యక్షుడు ఆనందరెడ్డి, ప్రధానకార్యదర్శి నరసింహులు, ఆంజనేయరెడ్డి, తెలుగుయువత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏర్పాటు చేశారు. రామ కుప్పం పట్టణంలోని ఆటోస్టాండ్‌ సర్కిల్‌ నుంచి బహిరంగసభ జరిగే పోలీసుస్టేషను సర్కిల్‌ వరకు తోరణాలతో అలంకరించారు.

రామకుప్పం పట్టణంలో స్వాగత ఏర్పాట్లను పార్టీ కుప్పం ఇన్‌చార్జి మునిరత్నం, ఏఎంసీ మాజీ చైర్మన్‌ సత్యేంద్రశేఖర్‌, మాజీ ఎంపీపీ వెంకటేష్‌ పర్యవేక్షించారు. చంద్ర బాబు పర్యటన జయప్రదం చేయాలని ఆటోల ద్వారా మండలంలో ప్రచారం నిర్వహించారు. కుప్పం ప‌ర్య‌ట‌న ద్వారా.. నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న స‌మ‌స్య‌ల‌ను,నేత‌ల మ‌ధ్య ఉన్న అసంతృప్తుల‌ను చంద్ర‌బాబు ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేయ‌నున్నార‌ని.. పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.