Begin typing your search above and press return to search.

ఇటు బయోమెట్రిక్ బాణం...అటు రౌండ్ టేబిల్ తో రెడీ... ?

By:  Tupaki Desk   |   9 Feb 2022 11:30 AM GMT
ఇటు బయోమెట్రిక్ బాణం...అటు రౌండ్ టేబిల్ తో రెడీ... ?
X
ఏపీలో ఉపాధ్యాయులు కొత్త పాఠాలు చెబుతామని అంటున్నారు. తమకు జరిగిన అన్యాయం మీద గుణపాఠాలే చెబుతామని గర్జిస్తున్నారు. కొత్త పీయార్సీ అంటే రివర్స్ పీయార్సీగా వారు పేర్కొంటున్నారు. హెచ్ ఆర్ ఏ లో భారీగా కోతలు కోశారు, ఇక ఫిట్ మెంట్ ని దారుణంగా తగ్గించేశారు. ఆశుతోష్ కమిటీ నివేదికను కూడా బయట పెట్టకుండానే జేఏసీ నేతలు సమ్మెని విరమించుకోవడాన్ని వారు తప్పుపడుతున్నారు. కొత్త జేఏసీ ఏర్పాటు చేసి దాని ద్వారా మళ్లీ ఉద్యమ శంఖారావాన్ని పూరించడానికి సిద్ధమని ప్రకటిస్తున్నారు.

ఈ నేపధ్యంలో టీచర్ల మీదకు ప్రభుత్వం బయోమెట్రిక్ బాణాన్ని వదిలింది. తప్పనిసరిగా బయోమెట్రిక్ ద్వారా హాజ‌రు వేయించుకోవాలని ఆదేశాలను పాఠశాల విద్యా శాఖ కమిషనర్ జారీ చేశారు. అది కూడా సర్కార్ సడెన్ గానే తీసుకున్న నిర్ణయం. దాని మీద గురువులు గుస్సా అవుతున్నారు. ఒక విధంగా ప్రభుత్వం ఉద్యోగుల నిరసనను కట్టడి చేయడానికే ఇలా చేసింది అంటున్నారు.

క్లాస్ రూమ్స్ లో ఉద్యోగులు తప్పనిసరిగా ఉండాలని, ఒకవేళ వారు హాజరు కాకుండా ఉంటే దాని మీద యాక్షన్ తీసుకోవడానికే బయోమెట్రికి విధానాన్ని తెచ్చారని అంటున్నారు. ఇక జగన్ సైతం ఉపాధ్యాయుల ఆందోళనల మీద మాట్లాడుతూ వారి వెనక ఎర్ర జెండా ఉందని, ఆ వెనకాల పచ్చ అజెండా ఉందని కూడా హాట్ హాట్ కామెంట్స్ చేశారు.

ఒక విధంగా జగన్ అన్న మాటలు తీసుకుంటే ఉపాధ్యాయుల ఆందోళన విషయంలో కఠినంగానే ఉంటానని సంకేతాలు ఇచ్చారనుకోవాలి. దానికి తగినట్లుగా అకస్మాత్తుగా బయోమెట్రిక్ హాజరుని తప్పనిసరి చేయడంతో టీచర్లు భగ్గుమంటున్నారు. మాకు జరిగిన అన్యాయన్ని నిలదీస్తామని, కలసి వచ్చే వారందరితో కలసి తాము ఆందోళనకు దిగుతామని స్పష్టం చేస్తున్నారు.

మరో వైపు చూస్తే ఈ నెల 12న రౌండ్ టేబిల్ సమావేశం జరగనుంది. ఉపాధ్యాయ సంఘాలకు చెందిన నేతలు అంతా దానికి హాజరవుతారు. ఆ రోజున వారు కీలకమైన నిర్ణయం తీసుకుంటారు అని తెలుస్తోంది. తమతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులు, ఇతర వర్గాలను కూడా కలుపుని సమ్మె లాంటి భారీ ఆందోళనలే రెడీ అవుతారని చెబుతున్నారు. అదే కనుక జరిగితే ప్రభుత్వానికి అది పెద్ద తలనొప్పి అనే చెప్పాలి.

ఇక ప్రభుత్వం కూడా ఉద్యోగుల ఆందోళనలవిషయంలో సీరియస్ గానే ఉంది అంటున్నారు. కచ్చితంగా దీన్ని అడ్డుకోవాలని ఎటూ చూస్తారు. మరి అటూ ఇటూ పట్టుదలకు పోతే మాత్రం ఏం జరుగుతుంది అన్నదే చర్చగా ఉంది. ఏపీలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు ఉన్నారు. పైగా ఇపుడు పరీక్షల సీజన్ కూడా. దాంతో చదువులు చెప్పే మాస్టర్లు బయట ఉద్యమాలకు సిద్ధమైతే అది అన్ని విధాలుగా ఇబ్బందిగానే ఉంటుంది. మరి ప్రభుత్వం స్మూత్ గా డీల్ చేయకుండా జోరు చేస్తే మాత్రం వ్యవహారం ముదిరి పాకాన పడడం ఖాయమే అంటున్నారు.