Begin typing your search above and press return to search.

హ‌రీశ్ న‌డిపిస్తున్న టీం కేసీఆర్‌ పై దుమ్మెత్తిపోసింది

By:  Tupaki Desk   |   8 May 2018 4:26 AM GMT
హ‌రీశ్ న‌డిపిస్తున్న టీం కేసీఆర్‌ పై దుమ్మెత్తిపోసింది
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మేన‌ల్లుడు - రాష్ట్ర మంత్రి టీ హరీష్‌ రావు గౌరవాధ్యక్షులుగా టీఎస్ ఆర్టీసీలో ఉన్న గుర్తింపు కార్మిక సంఘం తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ (టీఎమ్‌ యూ) ప్రభుత్వానికి సంచ‌ల‌న హెచ్చ‌రిక చేసింది.ఆర్టీసీ కార్మికులకు వేతన సవరణ చేయాలనే ప్రధాన డిమాండ్‌ తో పాటు 32 అంశాలపై ప్రభుత్వం - యాజమాన్యం స్పందించాలని కోరుతూ 'చలో బస్‌ భవన్‌' ఆందోళనా కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల నుంచి పెద్ద సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు హాజరయ్యారు. టీఎమ్‌ యూ అధ్యక్షులు తిరుపతి - కార్యనిర్వాహక అధ్యక్షులు థామస్‌ రెడ్డి - ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి కార్మికులనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు ఆర్టీసీ యాజమాన్యం - ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బస్‌ భవన్‌ ముట్టడిని..ప్రగతి భవన్‌ ముట్టడిగా మార్చొద్దు...ఆ పరిస్థితి వస్తే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని స్పష్టం చేశారు. బడ్జెట్‌ లో పెట్టిన నిధుల్ని ఆర్టీసీకి ఎందుకివ్వట్లేదని ప్రశ్నించారు. ''ఇది శాంపిల్‌ మాత్రమే. చీటికి మాటికి మా ఉద్యోగాలు పోతున్నాయి. ఇప్పటివరకు శాంతియుతంగా ఆందోళనలు చేశాం. ప్రభుత్వంతో పెట్టుకోవద్దని మాకు ఓ మంత్రి హెచ్చరిక చేశారు. అసలు మిమ్మల్ని ఆ సీట్లలో కూర్చోబెట్టిందే మేము. మీ అవసరం మాకెంత ఉందో...మా అవసరం కూడా మీకంతే ఉందన్న విషయాన్ని మర్చిపోకండి` అని హెచ్చ‌రించింది.

జీహెచ్ ఎంసీ నుంచి రెండేండ్లుగా రావల్సిన నిధుల్ని ఎందుకు నిలిపివేశారో ప్రభుత్వం - ఆర్టీసీ యాజమాన్యం సమాధానం చెప్పాలని ఈ సంఘం సార‌థ్యంలోని నేత‌లు డిమాండ్‌ చేశారు. 'మాకు కార్మికుల ఆకలి బాధలే ముఖ్యం. వారికోసం ఎంతకైనా తెగిస్తాం. పోరాడి సాధించుకున్న తెలంగాణ ఫలాలు మాకిప్పటికీ దక్కలేదు. దీనికి ప్రభుత్వం - ఆర్టీసీ యాజమాన్యం బాధ్యత వహించాలి' అంటూ టీఎమ్‌ యూ నేతలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అక్రమ రవాణా గురించి మాట్లాడే హక్కు - అధికారం మాకెందుకు లేవని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆరెంజ్‌ ట్రావెల్స్‌ పేరుతో 150 ఓల్వో బస్సులు ఎవరి అండదండలతో నడుస్తున్నాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు. సీసీఎస్‌ - పీఎఫ్‌ సొమ్ములు కూడా యాజమాన్యం వద్దే ఉన్నాయని, అయినా సంస్థ నష్టాల్లో ఉందని ఎందుకు ప్రచారం చేస్తున్నారని నిలదీశారు. ఆర్టీసీ కార్మికుల రేయింబవళ్లు పనిచేసి రోజుకు రూ.13 కోట్ల ఆదాయాన్ని సంస్థకు ఇస్తుంటే..ఆ సొమ్మంతా ఎక్కడికి పోతుందని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం సకల జనుల సమ్మెలో ఆర్టీసీకార్మికులు సత్తా చూపితే శెభాష్‌ అని మెచ్చుకున్న నేతలు...ఇప్పటి వరకు వారికి వేతనంతో కూడిన సెలవుల్ని ఎందుకివ్వలేదో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం, యాజమాన్యంపై ఉన్నదని స్పష్టంచేశారు. ఆర్టీసీ కార్మికులకు పోరాడి సాధించుకున్న తెలంగాణ ఫలాలు నేటికీ దక్కకపోవడం విచారకరమని చెప్పారు. ఆర్టీసీ కార్మికులకు 2017 ఏప్రిల్‌ 1 నుంచి వేతన సవరణ జరగాల్సి ఉంటే...ఇప్పటి వరకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని, తాము కూడా సహనంతో వేచి చూశామని, ఇప్పుడా పరిస్థితి లేదని స్పష్టం చేశారు.

ఈనెల 21 తర్వాత ఎప్పుడైనా సమ్మెలోకి వెళ్తామని హెచ్చరిస్తూ యాజమాన్యానికి నోటీసు ఇస్తున్నామని ప్రకటించారు. ఆ సమ్మెను నిలువరిస్తారో...కొనసాగనిస్తారో ప్రభుత్వం, యాజమాన్యమే తేల్చుకోవాలని తెగేసి చెప్పారు. కార్మికులపై పనిభారాలు పెంచారని, నాలుగేళ్లుగా యూనిఫారాలు కూడా ఇవ్వట్లేదని, 6,800 మంది ఉద్యోగులు రిటైర్డ్‌ అయితే ఒక్క పోస్టును కూడా భర్తీచేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. 2020 నాటికి ఆర్టీసీలో 18వేల మంది కార్మికులు రిటైర్డ్‌ అవుతున్నారని, ఖాళీ పోస్టులు భర్తీ చేయకుండా, సంస్థను నిర్వీర్యం చేస్తూ తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. చలో బస్‌ భవన్‌ పిలుపునిస్తే 'డైరెక్టర్‌' పోస్టులు ఇస్తామని ప్రలోభాలకు గురి చేస్తున్నారని, ఇలాంటి వాటికి లొంగేది లేదని తేల్చి చెప్పారు.తక్షణం ఆర్టీసీ కార్మికులకు వేతన సవరణ చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యమ నాయకుడు సీఎంగా ఉంటే ఉద్యమాలకు ఎందుకు అనుమతులు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. కండక్టర్లు, డ్రైవర్లకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని, పనిభారాలు పెరిగి అన్ని విభాగాల కార్మికుల నానా అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగులుగా తాము కష్టపడితేనే ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందనే విస్మరించవద్దని హెచ్చరించారు.