Begin typing your search above and press return to search.

టోక్యో పారాలింపిక్స్: భారత అథ్లెట్ పతకం వెనక్కి తీసుకున్న నిర్వాహకులు

By:  Tupaki Desk   |   30 Aug 2021 4:30 PM GMT
టోక్యో పారాలింపిక్స్: భారత అథ్లెట్ పతకం వెనక్కి తీసుకున్న నిర్వాహకులు
X
టోక్యో పారాలింపిక్స్ లో భారత్ కు నిరాశాజనక పరిణామం ఎదురైంది. డిస్కస్ త్రో క్రీడాంశంలో కాంస్యం గెలిచిన వినోద్ కుమార్ పై పారాలింపిక్స్ నిర్వాహకులు అనర్హత వేటు వేశారు. అతడి నుంచి పతకం వెనక్కి తీసుకున్నారు. వినోద్ కుమార్ ఏ విధమైన అంగ వైక్యలం కలిగి ఉన్నాడన్న దానిపై స్పష్టత లేకపోవడంతో పారాలింపిక్స్ కాంపిటీషన్ ప్యానెల్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 41 ఏళ్ల వినోద్ కుమార్ డిస్కస్ త్రో ఫైనల్ ఈవెంట్ లో 19.91 మీటర్లు విసిరి మూడో స్థానంలో నిలిచాడు.

అయితే ఈ ఫలితాన్ని కొందరు పోటీదారులు కాంపిటీషన్ ప్యానెల్ వద్ద సవాల్ చేశారు. దాంతో విచారణ జరిపిన ప్యానెల్, వినోద్ కుమార్ ఏ విధమైన వైకల్యం కలిగి ఉన్నాడో గుర్తించే ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉందని, అతడిని ఎఫ్ 52 కేటగిరీలో పోటీపడేందుకు అర్హుడిగా భావించలేమని వెల్లడించింది. కొన్ని ప్రత్యేకమైన వైకల్యాలు కలిగివున్న వారిని ఎఫ్52 కేటగిరీలో పోటీపడేందుకు అనుమతిస్తారు. అయితే, ఎఫ్52 కేటగిరీలో పేర్కొన్న వైకల్యాల్లో దేన్ని వినోద్ కుమార్ కలిగివున్నాడో వర్గీకరించే ప్రక్రియ ఇంకా పూర్తికాలేదని ప్యానెల్ అభిప్రాయపడింది. దాంతో ఈ కేటగిరీలో వినోద్ కుమార్ కు లభించిన మూడోస్థానాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.

ఈ విషయాన్ని టోక్యో పారాలింపిక్స్‌ నిర్వహకులు అధికారికంగా ప్రకటించారు. కండరాల బలహీనత, కదలికల్లో లోపం, అవయవ లోపం ఉన్న వారు మాత్రమే F52 కేటగిరీ పరిధిలోకి వస్తారని, వినోద్‌ కుమార్‌ ఈ కేటగిరీ పరిధిలోకి రాడని వారు తేల్చారు. కాగా, ఇదే నిర్వహకులు ఈ నెల 22న వినోద్‌ కుమార్‌ F52 కేటగిరీలో పోటీపడవచ్చని అనుమతివ్వడం చర్చనీయాంశంగా మారింది. పోటీల్లో పోలాండ్‌కు చెందిన పియోటర్ కోసెవిచ్ 20.02 మీటర్ల ప్రయత్నంతో స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా, క్రొయేషియాకు చెందిన వెలిమిర్ సాండర్ 19.98 మీటర్ల దూరం విసిరి రజతం సాధించాడు. వినోద్ 17.46 మీటర్ల ప్రయత్నంతో ఫైనల్ ప్రారంభించి తన ఆటకు మెరుగులద్దాడు. ఐదవ, చివరి ప్రయత్నంలో 19.91 మీటర్ల దూరం డిస్కస్‌ విసిరి కాంస్య పతకం సాధించే మార్కును అందుకోగలిగాడు.