Begin typing your search above and press return to search.

కరోనా: సూర్యపేట అష్టదిగ్బంధనం

By:  Tupaki Desk   |   22 April 2020 4:16 PM IST
కరోనా: సూర్యపేట అష్టదిగ్బంధనం
X
కరోనా కేసులు అకస్మాత్తుగా పెరగిన నేపథ్యంలో సూర్యపేట జిల్లాను తెలంగాణ ప్రభుత్వం ప్యాకప్ చేసింది. అక్కడ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఉన్నతాధికారులు మోహరించారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారుల బృందం బుధవారం సూర్యాపేట జిల్లాను సందర్శించింది.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ - డీజీపీ మహేందర్ రెడ్డి సహా వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక హెలిక్యాప్టర్ లో సూర్యపేటకు చేరుకొని అక్కడ కరోనా ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. పరిస్థితిని అడిగి తెలుసుకొని నివారణ చర్యలు చేపట్టారు. అనంతరం కలెక్టర్, ఎస్పీతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఇప్పటివరకు 83 కేసులు సూర్యాపేటలో నమోదయ్యాయయని.. కరోనా పెరుగుదలకు కారణాలు తెలుసుకునేందుకు వచ్చామని.. ఇక్కడ లాక్ డౌన్ కఠినంగా అమలు చేయాలని స్థానిక అధికారులను కోరామని సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. బాధితులను గుర్తించి నిర్బంధించామని చెప్పారు. కరోనా వ్యాధి ఎలా వ్యాపించింది.. నివారణ చర్యలపై సూచనలు చేశామన్నారు.

సూర్యపేటను సందర్శించిన తరువాత, అధికారుల బృందం జోగులంబ గద్వాల్ - వికారాబాద్ జిల్లాల సందర్శన కోసం బయలుదేరింది. ప్రధాన కార్యదర్శి ఇప్పటికే సూర్యపేటతోపాటు కరోనా ప్రబలుతున్న ఈ రెండు జిల్లాలకు ప్రత్యేక అధికారులను కూడా నియమించారు.

కరోనా తగ్గేవరకు సూర్యపేటను ప్యాకప్ చేస్తామని.. ఈగ కూడా బయటకు పోకుండా కట్టుదిట్టంగా చర్యలు చేపడుతామని సీఎస్ తెలిపారు. రాబోయే రోజుల్లో కరోనా తగ్గేవరకు సూర్యపేటలో కఠిన ఆంక్షలు అమలు చేస్తామని స్పష్టం చేశారు.