Begin typing your search above and press return to search.

ఫేస్ బుక్.. ఎయిర్ టెల్ కు ట్రాయ్ షాకులు

By:  Tupaki Desk   |   30 Jan 2016 9:48 AM GMT
ఫేస్ బుక్.. ఎయిర్ టెల్ కు ట్రాయ్ షాకులు
X
వ్యాపార ప్రయోజనం లేనిదే వ్యాపారి ఏపని చేయడు. వ్యాపారస్తుడికి సంబంధించి ఇది ప్రాధమిక సూత్రం. చాలా సందర్భాల్లో ఇలాంటి సూత్రాల్ని మర్చిపోయేలా చేస్తాయి భావోద్వేగాలు. ఆ మధ్యన భారత్ కు వచ్చిన ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్ చాలానే సందడి చేశారు. ప్రధానమంత్రిని కలిశారు.. కాలేజీ విద్యార్థుల్ని కలిశారు. పనిలో పనిగా భారత్ అంటే తనకు ఎంత ప్రేమ అన్న విషయాన్ని చాలానే చెప్పేశాడు. ఢిల్లీలాంటి కాలుష్య కాసారం లాంటి సిటీలో పొద్దుపొద్దునే ట్రాక్ సూట్ వేసుకొని.. తన బ్యాచ్ తో కలిసి జాగింగ్ చేసేసి ఫేస్ బుక్ లో పోస్టింగ్ పెట్టేశాడు.

దీంతోపాటు.. తాజ్ మహాల్ కు వెళ్లిన ఫోటోల దగ్గర నుంచి చాలానే ఫోటోల్ని పోస్ట్ చేశారు. ఆయన వెళ్లిన కొద్ది రోజులకే ఫేస్ బుక్ ఫ్రీ బేసిక్స్ కు సంబంధించి భారత్ లోని మీడియా సంస్థలకు భారీ యాడ్స్ ఇచ్చేశాడు. రోజూ రెండు పేజీల యాడ్స్ ఇచ్చేసిన ఫేస్ బుక్ ప్రీ బేసిక్స్ యవ్వారం చూసి చాలామంది నోటి నుంచి మాట రాని పరిస్థితి.

ఇదిలా ఉండగానే పెద్ద పెద్ద హోర్డింగ్స్ వచ్చేశాయి. ఫ్రీ బేసిక్స్ విషయంలో తమ వాదనను చెప్పటమే కాదు.. తమ గొంతుకు జనాల గొంతు కలపాలన్న అభ్యర్థన వ్యక్తమైంది. ఒక వ్యాపారస్తుడి పూర్తి సేవా భావంతో వ్యవహరిస్తాడా? అలానే వ్యవహరిస్తే.. వేలాది కోట్ల ఆస్తుల మేట వేసుకోకూడదు. కానీ.. జుకర్ బర్గ్ లక్షల కోట్ల రూపాయిలు సంపాదించేశాడు. అదీ.. వ్యాపారంతోనే అన్న విషయాన్ని మర్చిపోకూడదు.

అలాంటి వ్యక్తి ప్రజలకు సేవ చేస్తున్నట్లు ఫోజుకొడితే నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రీబేసిక్స్ పేరుతో జుకర్ చెబుతున్న మాటల్ని ఫాలో అయితే.. ఇంటర్నెట్ యూజర్లను తన చెప్పు చేతుల్లోకి తీసుకున్నట్లే. ఫేస్ బుక్ ఐడియాలాంటిదే కాకున్నా.. కాస్త అటూఇటూగా ఎయిర్ టెల్ సైతం ఎయిర్ టెల్ జీరో పేరిట మరో ప్రతిపాదన చేసింది. ఈ రెండింటితో ఇంటర్నెట్ యూజర్లను తమ బుట్టలో వేసుకోవాలన్న ఐడియా ఎదుర్కొనేవారే లేరా? అన్నది ప్రశ్న. దీనికి ట్రాయ్ ఉందన్న సమాధానం వచ్చినా.. ప్రభుత్వం డబ్బున్న పెద్దోళ్లకే తప్ప జనం గురించి ఆలోచిస్తుందా? అన్న సందేహం కలిగినోళ్లు చాలామందే ఉన్నారు. కానీ.. ఇలాంటి వాదన తప్పని తేలుస్తూ మోడీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఫేస్ బుక్ ప్రీ బేసిక్స్.. ఎయిర్ టెల్ జీరోకు రెడ్ సిగ్నల్ వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం బయటకు వచ్చింది. ఒకవేళ అదే నిజమైతే.. అంతకుమించి కావాల్సిందేముంది?