Begin typing your search above and press return to search.

సంచలనంగా మారిన ట్రైనీ ఐపీఎస్ తింగరి చేష్ట

By:  Tupaki Desk   |   30 Oct 2019 5:27 AM GMT
సంచలనంగా మారిన ట్రైనీ ఐపీఎస్ తింగరి చేష్ట
X
సంచలనంగా మారింది ట్రైనీ ఐపీఎస్ అధికారి వ్యవహారం. ప్రేమించి పెళ్లాడిన అమ్మాయిని.. ఐపీఎస్ సాధించిన తర్వాత నుంచి పక్కన పెట్టేయటమే కాదు.. ఆమె నుంచి దూరం జరగటానికి అతగాడు వేస్తున్న ఎత్తుల వైనం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ లలో హాట్ టాపిక్ గా మారింది. ప్రేమించిన అమ్మాయిని తల్లిదండ్రులకు తెలీకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్న అతడు.. ఐపీఎస్ సాధించినంతనే ఆమెకు.. ఆమె ప్రేమకు చెల్లుచీటి ఇస్తున్న వైనంపై గళం విప్పిన భావన వైనం పెను దుమారంగా మారుతోంది.

కడప జిల్లాలోని లక్కిరెడ్డి పల్లె మండలం పందికళ్లపల్లెకు చెందిన 29 ఏళ్ల మహేశ్వర్ రెడ్డికి మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడకు చెందిన 28 ఏళ్ల భావనకు 2009లో ఉస్మానియా వర్సిటీలో పరిచయమైంది. వారిద్దరి స్నేహం ప్రేమగా మారింది. అబ్బాయి రెడ్డి అయితే.. అమ్మాయి మాదిగ. ప్రేమ వేళ కులాల పట్టింపులేమీ అడ్డురాలేదు. గుట్టుగా ప్రేమించుకున్న ఈ ఇద్దరి వ్యవహారం అమ్మాయి ఇంట్లో తెలిసింది. నిలదీయటంతో గత ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. సమయం వచ్చినప్పుడు తమ పెళ్లి విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెబుతానన్న సదరు వ్యక్తి ఈ మధ్య విడుదలైన సివిల్స్ సాధించాడు.

ప్రస్తుతం ఐపీఎస్ ట్రైనీగా వ్యవహరిస్తున్న అతడు.. భార్య భావనను విడాకులు ఇవ్వాలని కోరుతున్నాడు. తమ కులాలు వేరైనందన.. తమ ఇంట్లో ఒప్పుకోరని.. తమ కులం కాని అమ్మాయి దేశ ప్రధాని కూతురైనా ఒప్పుకోరంటూ ఆమె మనసును గాయపరిచేలా మాట్లాడినట్లుగా భావన వరుస ట్వీట్లతో వెల్లడించారు.

తనకు పెద్ద పెద్ద సంబంధాలు వస్తున్నాయని.. విడాకులు ఇవ్వాలని బలవంతం చేస్తున్నాడట. లేదంటే చంపేస్తానని.. ఆచూకీ కూడా లభించదని చెప్పటమే కాదు.. పనిలో పనిగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేరును అతగాడు ప్రస్తావిస్తున్నాడట. దీంతో తనకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు పట్టించుకోకపోవటంతో ఆమె సోషల్ మీడియాను ఆశ్రయించింది.

సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న వేళ తన కెరీర్ పక్కన పెట్టేసి.. భర్తకు చేదోడువాదోడుగా నిలవటమే కాదు.. ఆర్థికంగానూ ఎంతో సాయం చేసినట్లు భావన చెబుతోంది. తానిచ్చిన సహకారంతో సివిల్స్ లో 126వ ర్యాంక్ సాధించిన మహేశ్వర్ రెడ్డి.. తీరా ట్రైనీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి అతడి స్వరంలో తేడా రావటమే కాదు.. దళితుల అమ్మాయిని తమ ఇంట్లో ఒప్పుకోరంటూ అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నట్లు భావన వాపోతోంది.

తనకున్న పలుకుబడి ఉపయోగించి తనను వదులుకోవాలనుకుంటున్నాడని.. అతడి మీద చర్యలు తీసుకోవాలని కోరుతోంది. భారీగా కట్నం ఇవ్వాలంటే తాము నో చెప్పటంతో అతడి తీరు మారినట్లు భావన చెబుతోంది. సోషల్ మీడియాలో వీరి ఉదంతం సంచలనంగా మారిన వేళ.. రాచకొండ సీపీ రియాక్ట్ అయ్యారు. ట్రైనీ ఐపీఎస్ మీద కేసు నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో కేసు రిజిస్టర్ చేశారు. ప్రేమించినప్పుడు అడ్డురాని కులం.. పెళ్లాడిన తర్వాత.. అందునా ట్రైనీ ఐపీఎస్ అయ్యాక రావటం చూస్తే.. అతగాడి తింగరి చేష్ట అతని కెరీర్ ను భారీ డ్యామేజ్ చేయటం ఖాయమంటున్నారు.