Begin typing your search above and press return to search.

మూడు మ‌ర్డ‌ర్లు చేయించిన స‌హ‌జీవ‌నం!

By:  Tupaki Desk   |   30 Jan 2018 5:23 AM GMT
మూడు మ‌ర్డ‌ర్లు చేయించిన స‌హ‌జీవ‌నం!
X
మ‌నిషిని బ‌తికించాల్సిన ప్రేమ.. ఇప్పుడు చంపేస్తోంది. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో వెలుగు చూసిన మూడు హ‌త్య‌ల ఉదంతం ఒక్క‌సారి ఉలిక్కిప‌డేలా చేసింది. మాన‌వ సంబంధాల మీద సందేహాలు తలెత్తేలా ఇటీవ‌ల కాలంలో ప‌లు ఉదంతాలు తెర మీద‌కు వ‌స్తున్నాయి. ప్రేమ పేరుతో మొద‌ల‌య్యే ఈ సంబంధాలు.. అనుమానం పిశాచితోనో.. ఆర్థిక ప‌ర‌మైన అంశాల‌తోనో.. ఇత‌ర కార‌ణాల‌తోనో మ‌ర‌ణ‌శాస‌నాలుగా మారుతున్నాయి. అలాంటి ఉదంత‌మే తాజాగా చందాన‌గ‌ర్ లో చోటు చేసుకుంది.

సోమ‌వారం ఉద‌యం. చందాన‌గ‌ర్ లోని ఒక అపార్ట్ మెంట్. పాలు పోసే వ్య‌క్తి త‌లుపు త‌ట్టాడు. స‌మాధానం రాలేదు. త‌లుపు ద‌గ్గ‌ర దుర్వాస‌నం రావటంతో అనుమానించిన అత‌డు.. అక్క‌డి వారికి ఆ విష‌యాన్ని చెప్పాడు. కాసేప‌టికే ఈ స‌మాచారం ఆ ఇంటి య‌జ‌మానికి వెళ్లింది. నాలుగున్న‌ర నెల‌ల కింద‌ట అద్దెకు ఇచ్చిన ఇంట్లో నుంచి దుర్వాస‌న‌.. ఎంత త‌లుపు కొట్టినా స‌మాధానం రాక‌పోవ‌టంతో కంగారుగా కింద‌నున్న ఫ్లాట్ వ‌ద్ద‌కు చేరుకున్నాడు. కిటికీల్లో నుంచి చూస్తే.. కాళ్లు క‌నిపించాయి. ఎంత పిలిచినా స్పంద‌న లేదు.ఆ స‌మాచారాన్ని పోలీసుల‌కు అంద‌జేశారు. హుటాహుటిగా వ‌చ్చిన పోలీసులు.. త‌లుపులు బ‌ద్ధ‌లు కొట్టి ఇంట్లోకి వెళ్లిన వారంద‌రికి షాక్ మీద షాక్. ఎందుకంటే.. ఇంట్లో ఒక‌టి కాదు.. మూడు మృత‌దేహాలు. దారుణంగా చంపేసిన వైనాన్ని చూసి నిర్ఘాంత‌పోయే ప‌రిస్థితి. హ‌త్య‌కు గురైన వారిలో ఒక పెద్దావిడ‌.. మ‌ధ్య వ‌య‌సు యువ‌తి.. ఐదేళ్ల చిన్నారి. ముగ్గురిని దారుణంగా హ‌త్య చేసిందెవ‌రు? కార‌ణం ఏమిటి? అన్న‌ది చూస్తే..

మ‌ర‌ణించిన ముగ్గురు ఎవ‌రంటే.. 50 ఏళ్ల జ‌య‌ల‌క్ష్మీ.. ఆమె కుమార్తె 30 ఏళ్ల అప‌ర్ణ‌.. ఆమె కుమార్తె నాలుగేళ్ల కార్తికేయి. అంటే.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఒకే చోట హ‌త్య‌కు గుర‌య్యారు. తాళం వేసిన ఇంటిని చూస్తే.. బాగా తెలిసిన వ్య‌క్తి వాళ్ల‌ను చంపేసి.. తాళం వేసుకొని వెళ్లిపోయిన‌ట్లుగా తెలుస్తుంది. పోలీసుల ప్రాధ‌మిక విచార‌ణ‌లో విస్తుగొలిపే విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పాల‌కొల్లుకు చెందిన జ‌య‌ల‌క్ష్మి (50).. ముర‌ళి భార్య‌భ‌ర్త‌లు. కొన్నేళ్ల క్రితం వారు హైద‌రాబాద్‌కు వ‌చ్చేశారు. వారి కుమార్త అప‌ర్ణ‌.. కొడుకు వంశీ. కొడుకు తాడేప‌ల్లిగూడెంలో ఉండిపోగా.. కుమార్తె అప‌ర్ణ బ‌జాజ్ షోరూంలో ప‌ని చేస్తోంది. 30 ఏళ్ల అప‌ర్ణ‌కు త‌మ ప్రాంతానికి చెందిన మ‌ధు అనే వ్య‌క్తితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. వారి మ‌ధ్య ప‌రిచ‌యం కాస్తా ప్రేమ‌గా మారింది. అయితే ఇంట్లో పెద్ద‌వాళ్లు వారి పెళ్లికి నో చెప్పేశారు. కొంత‌కాలానికి అనారోగ్యంతో భ‌ర్త ముర‌ళి చ‌నిపోయారు.

త‌ర్వాతి ప‌రిస్థితుల్లో త‌న కుమార్తె అప‌ర్ణ ప్రేమించి మ‌ధుతో పెళ్లికి జ‌య‌ల‌క్ష్మి ఓకే చెప్పింది. అయితే.. దుర్మార్గ‌మైన విష‌యం ఏమిటంటే.. మ‌ధుకి అప్ప‌టికే యామిని అనే మ‌హిళ‌తో పెళ్లి అయ్యింది. ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు. వారు కేపీహెచ్ బీ నాలుగో ఫేజ్ లో ఉంటారు. ఈ విష‌యాల్ని దాచి అపర్ణ‌ను పెళ్లి చేసుకున్నాడు (మ‌ధు మాత్రం పెళ్లి చేసుకోలేదు.. స‌హ‌జీవ‌నం చేస్తున్నామ‌ని చెబుతున్నాడు) కొద్దికాలం మ‌ధు వ్య‌వ‌హారం గుట్టుగా సాగినా.. త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో.. ఇద్ద‌రి నుంచి ఒత్తిళ్లు మొద‌ల‌య్యాయి. అవి పెరిగి గొడ‌వ‌లుగా మారాయి.

ఇవి ఎంత‌వ‌ర‌కు వెళ్లాయంటే.. ఇద్ద‌రు భార్య‌లు వేర్వేరు పోలీస్ స్టేష‌న్ల‌లో మ‌ధు మీద ఫిర్యాదు ఇచ్చారు. ఇదే స‌మ‌యంలో అప‌ర్ణ వేరే వ్య‌క్తితో స‌న్నిహితంగా ఉండ‌టం మ‌ధుకు న‌చ్చ‌లేదు. అదే స‌మ‌యంలో మొద‌టి భార్య యామిని.. అప‌ర్ణ‌కు ఫోన్ చేసి గొడ‌వ ప‌డింది. దీంతో ఆగ్ర‌హం చెందిన మ‌ధు.. అప‌ర్ణ ఇంటికి వ‌చ్చి అత్త‌.. భార్య‌.. కుమార్తెను దారుణంగా చంపేశాడు. పోలీసుల అంచ‌నా ప్ర‌కారం అప‌ర్ణ‌ను బ‌ల‌మైన వ‌స్తువుతో త‌ల మీద మోది హ‌త్య చేయ‌గా.. మిగిలిన ఇద్ద‌రిని గొంతు పిసికి చంపేసిన‌ట్లుగా అనుమానిస్తున్నారు. సోమ‌వారం ఈ హ‌త్య‌ల గురించి బ‌య‌ట‌కు రావ‌టంతో చందాన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్లో లొంగిపోయాడు. తాను అప‌ర్ణ‌ను పెళ్లి చేసుకోలేద‌ని.. స‌హ‌జీవ‌నం మాత్ర‌మే చేస్తున్న‌ట్లు చెబుతున్నాడు. ఒక‌డి దుర్మార్గానికి.. అనుమానానికి మూడు ప్రాణాలు పోవ‌టం ప‌లువురిని క‌లిచివేస్తోంది.