Begin typing your search above and press return to search.

భారత ఉద్యోగులపై ఆ కంపెనీ కత్తిగట్టిందా?

By:  Tupaki Desk   |   6 Nov 2022 10:00 AM IST
భారత ఉద్యోగులపై ఆ కంపెనీ కత్తిగట్టిందా?
X
ఎట్టకేలకు ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన ఎలాన్‌ మస్క్‌ అందులో పనిచేసే ఉద్యోగులకు షాక్‌ల మీద షాకులు ఇస్తున్నారు. ముఖ్యంగా భారతీయ ఉద్యోగులపైన ఎలాన్‌ మస్క్‌ కత్తిగట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ట్విట్టర్‌ సీఈవోగా ఉన్న పరాగ్‌ అగర్వాల్‌ను, లీగల్‌ ఎగ్జిక్యూటివ్‌ విజయ గద్దెలను ఎలాన్‌ మస్క్‌ తొలగించిన సంగతి తెలిసిందే. తాజాగా భారతీయ ఉద్యోగులకు ట్విటర్‌ భారీ షాక్‌ ఇచ్చింది. కమ్యూనికేషన్, మార్కెటింగ్‌ టీమ్‌లను తొలగించింది. ఇప్పటికే ట్విటర్‌ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న ప్రధాన ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపిన ఎలన్‌ మస్క్‌ ఇప్పుడు భారత ఉద్యోగుల్ని తొలగించే పనిలో ఉన్నారు.

44 బిలియన్‌ డాలర్లతో (భారత కరెన్సీలో దాదాపు 3,50,000 లక్షల కోట్లు) ట్విటర్‌ను కొనుగోలు చేసిన ఎలాన్‌ మస్క్‌ సిబ్బందిని తగ్గించేందుకు కఠిన చర్యలు చేపడుతున్నారు. ట్విట్టర్‌లో మొత్తం పనిచేస్తున్న 7500 ఉద్యోగుల్లో సగం మందికి పైగా సాగనంపే ఎలాన్‌ మస్క్‌ ఉన్నారని చెబుతున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా తొలగించగా తాజాగా భారత ఉద్యోగులను తొలగించారు.

‘ట్విట్టర్‌లో లే ఆఫ్‌ ప్రారంభమైంది. నాతో పాటు మిగిలిన నా సహచర ఉద్యోగులకు దీనికి సంబంధించిన ఈమెయిల్స్‌ అందాయి’ అని పేరు చెప్పేందుకు ఇష్టపడని భారత ట్విటర్‌ ఉద్యోగి ఒకరు తెలిపారు.

కాగా ట్విటర్‌ అంతకుముందు ఉద్యోగులకు ఇంటర్నల్‌ మెయిల్స్‌ పంపిందని తెలుస్తోంది. ఆ మెయిల్స్‌లో.. ట్విట్టర్‌ను ఆరోగ్యకరమైన వాతావరణంలో కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ ప్రయత్నంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులను తగ్గిస్తాం’ అని పేర్కొంది.

అదేవిధంగా ఉద్యోగుల తొలగింపుతో పాటు ట్విట్టర్‌ సిస్టమ్‌లు, కస్టమర్‌ డేటా కోసం నిర్వహిస్తున్న సంస్థకు చెందిన అన్ని కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నామని ప్రకటించింది. కాబట్టి ఉద్యోగులు ఆఫీస్‌లో ఉన్నా.. లేదంటే ఆఫీస్‌కు బయలుదేరుతున్నా ఇంటికి వెళ్లిపోండి అని ట్విటర్‌ తన ఉద్యోగులకు పంపిన మెయిల్స్‌లో తెలిపింది.

కాగా ట్విట్టర్‌ కొనుగోలు సమయంలో ఉద్యోగులను తొలగించే ప్రసక్తే లేదని చెప్పిన ఎలాన్‌ మస్క్‌ ఇప్పడు వరుసగా ఉద్యోగులను తొలగిస్తుండటంపై ఉద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉద్యోగులు వారంతట వారే వెళ్లిపోయేలా వర్క్‌ ఫ్రమ్‌ విధానం రద్దు చేయడం, ఎక్కువ పనిగంటలు, టైట్‌ షెడ్యూల్‌ ఎలాన్‌ మస్క్‌ ఇచ్చారు.

దీంతో చాలామంది ట్విట్టర్‌ నుంచి తప్పుకున్నారు. మరికొంతమంది అలాగే పనిచేస్తుండటంతో ఎలాన్‌ మస్క్‌ వారిని తొలగించారు. మరోవైపు ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్‌ కొనుగోలు చేయడం ఇష్టం లేని చాలామంది తమ ట్విట్టర్‌ ఖాతాలను డీయాక్టివేట్‌ చేసుకున్నారు. అక్టోబర్‌ 27 నుంచి నవంబర్‌ 1 మధ్య కాలంలో 8,75,000 మంది డీయాక్టివేట్‌ చేసుకున్నారని సమాచారం.

కాగా ఎలాన్‌ మస్క్‌ ఉద్యోగులను తొలగింపుతో ఎక్కువ మంది భారతీయ ఉద్యోగులే ప్రభావితమయ్యారని కథనాలు వచ్చాయి.