Begin typing your search above and press return to search.

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ ను డిసైడ్ చేసిన సీజేఐ.. ఆయన ఎవరంటే?

By:  Tupaki Desk   |   4 Aug 2022 10:30 AM GMT
సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ ను డిసైడ్ చేసిన సీజేఐ.. ఆయన ఎవరంటే?
X
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఉదయ్ ఉమేశ్ లలిత్ ను ఎంపిక చేశారు. ప్రస్తుతం సీజేఐగా వ్యవహరిస్తున్న జస్టిన్ ఎన్వీ రమణను తదుపరి సీజేఐ ఎవరన్న దానిపై సిఫార్సు చేయాలని కేంద్రం ఆయన్ను కోరింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సీనియారిటీ జాబితాలో ఉన్న జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ ను ఎంపిక చేస్తూ.. జస్టిస్ ఎన్వీ రమణ నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం సీజేఐ వ్యవహరిస్తున్న జస్టిస్ ఎన్వీ రమణ పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఈ నెల (ఆగస్టు) 26న జస్టిస్ ఎన్వీ రమణ తన సీజేఐ పదవికి పదవీ విరమణ చేయనున్నారు.ఆయన స్థానంలో జస్టిస్ లలిత్ సీజేఐ గా ఆగస్టు 27న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

75 సంవత్సరాల స్వాతంత్య్ర భారతంలో జస్టిస్ ఎన్వీ రమణ 48వ సీజేఐ కాగా.. 49వ సీజేఐగా జస్టిస్ లలిత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించిన నియామకంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేయనున్నారు. అనంతరం గజెట్ జారీ కానుంది.

జస్టిస్ లలిత్ విషయానికి వస్తే ఒక ప్రత్యేకత ఉంది. సుప్రీంకోర్టుకు నేరుగా పదోన్నతి పొందిన ఆరో సీనియర్ న్యాయవాదిగా జస్టిస్ లలిత్ నిలవనున్నారు. ప్రస్తుతం ఆయన సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. న్యాయమూర్తి కావటానికి ముందు ఆయన సుప్రీంకోర్టు న్యాయవాదిగా వ్యవహరించేవారు.

జస్టిస్ లలిత్ విషయానికి వస్తే ఆయన నవంబరు 9, 1957లో జన్మించారు. 1983లో ఆయన న్యాయవాదిగా తన పేరును నమోదు చేసుకున్నారు. 1985 డిసెంబరు వరకు బొంబాయి హైకోర్టులో ప్రాక్టీసు చేసి.. 1986లో ఆయన తన ప్రాక్టీస్ ను సుప్రీంకోర్టుకు మార్చారు. 2014 ఆగస్టు 13న ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. దేశంలో సంచలనానికి కారణమైన ట్రిపుల్ తలాక్ తో సహా అనేక కీలక తీర్పులు వెలువరించిన ధర్మాసనాల్లో జస్టిస్ యు.యు.లలిత్ సభ్యులుగా ఉన్నారు.

తలాక్ విధానంలో విడాకులు చెల్లుబాటు కావని.. అది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్న ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యంగ ధర్మాసనంలో సభ్యుడిగా వ్యవహరించారు. సీజేఐగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న జస్టిన్ లలిత్ కేవలం ఆ పదవిలో మూడు నెలల పాటు మాత్రమే ఉండనున్నారు. ఎందుకంటే.. నవంబరు ఎనిమిదిన ఆయన పదవీ విరమణ చేస్తారు. సీజేఐగా అతి తక్కువ కాలం వ్యవహరించిన వారిలో లలిత్ ఒకరుగా ఉండనున్నారు.