Begin typing your search above and press return to search.

విద్యాసంవ‌త్స‌రం వాయిదా..సెప్టెంబ‌ర్ నుంచి ఉన్న‌త విద్య‌

By:  Tupaki Desk   |   25 April 2020 5:00 PM GMT
విద్యాసంవ‌త్స‌రం వాయిదా..సెప్టెంబ‌ర్ నుంచి ఉన్న‌త విద్య‌
X
కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు మూతపడ్డాయి. జాతీయ ప‌రీక్ష‌ల‌తో పాటు విశ్వ‌విద్యాల‌యాల ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ్డాయి. ప్రాథ‌మిక నుంచి ఉన్న‌త విద్యా సంవ‌త్స‌రం ప్రారంభం కావాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. అయితే దేశంలో నెల‌కొన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో విద్యాసంవత్సరం నిర్వహణ, ఆన్‌లైన్ విద్యపై ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో సిఫార్సు చేయాలంటూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇటీవల రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. విద్యా సంవ‌త్స‌రం న‌ష్టంతో పాటు ఆన్‌లైన్ విద్య గురించి ఆ క‌మిటీలు స్ట‌డీ చేశాయి. ఈ నేప‌థ్యంలో ఆ క‌మిటీలు శుక్రవారం తమ నివేదికలను అందజేశాయి.

ఏటా జులైలో ప్రారంభమయ్యే నూతన విద్యాసంవత్సరం ఈసారి మాత్రం సెప్టెంబర్‌కు జరపాలని హర్యానా విశ్వ‌విద్యాల‌య‌ వీసీ ఆర్సీ కుహాడ్ నేతృత్వంలోని మొదటి కమిటీ సూచించింది. సరైన వసతులు ఉంటే విశ్వవిద్యాలయాలు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించాలని, లేని పక్షంలో లాక్‌డౌన్ ముగిశాకే పరీక్షలు నిర్వహించాలని ఇగ్నో వీసీ నాగేశ్వరరావు సారథ్యంలోని రెండో కమిటీ తెలిపింది. ఆ రెండు క‌మిటీల నివేదిక‌ను మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. విద్యా సంవత్సరంపై పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

అయితే జేఈఈ, నీట్ పరీక్షలను జూన్‌లో నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఉన్నా క‌రోనా క‌ట్ట‌డి అయితేనే ప‌రీక్ష‌ల‌పై ముంద‌డుగు వేసే అవ‌కాశం ఉంది. ప్రస్తుతం కరోనా పరిస్థితిపై కూడా అధ్య‌య‌నం చేస్తున్నారు. దేశంలో కరోనా వ్యాప్తి త‌గ్గితేనే విద్యా సంవ‌త్స‌రంపై తుది నిర్ణ‌యం తీసుకోనున్నారు. ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. ఈ క్ర‌మంలో మే 3వ తేదీ వరకు విధించిన లాక్‌డౌన్ మ‌ళ్లీ పొడిగించే అంశం కూడా ఉంది. దీంతో మ‌రికొన్నాళ్లు ఈ ప‌రిస్థితి కొన‌సాగ‌నుంది. ఈ క్ర‌మంలో విద్యా సంవ‌త్స‌రాన్ని వాయిదా వేసి సెప్టెంబ‌ర్‌లో ప్రారంభించేందుకు మొగ్గు చూప‌న‌నున్న‌ట్లు స‌మాచారం.