Begin typing your search above and press return to search.

పోల‌వ‌రం:ప్రతిపక్షాలకు దొరికిపోయిన బాబు

By:  Tupaki Desk   |   5 April 2016 6:47 AM GMT
పోల‌వ‌రం:ప్రతిపక్షాలకు దొరికిపోయిన బాబు
X
పోల‌వ‌రం....ఆంధ్రప్రదేశ్‌ లో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల్లో జ‌ల‌య‌జ్ఞం నుంచి నేటి వ‌ర‌కు చ‌ర్చ‌నీయాంశంగా మారిన అంశం. జాతీయ హోదా ద‌క్కిన ఈ ప్రాజెక్టును ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పూర్తిచేయాల‌ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్ర‌భుత్వం చూస్తుంటే.. కేంద్రం మాత్రం అర‌కొర‌గా నిధులు విడుద‌ల చేస్తోంది. దీనిపై ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తుండ‌గా 2018లోగా ప్రాజెక్టును పూర్తిచేయ‌నున్న‌ట్లు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టిస్తూ వ‌స్తోంది. అయితే తాజా ప‌రిణామాల్లో బాబును ఇరుకున పెట్టేందుకు కేంద్ర ప్ర‌భుత్వం అడుగులు వేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

కేంద్ర‌ జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతి విలేక‌రులతో మాట్లాడుతూ ఈ విష‌యాన్ని తెలిపారు. పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణ పనుల తీరును సమీక్షించేందుకు ఏపీ సీఎం చంద్ర‌బాబును ఢిల్లీకి ఆహ్వానించిన‌ట్లు తెలిపారు. నిర్ణీత గడువులోగా ప్రాజెక్టు పూర్తి చేయాలంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబుతో సమీక్ష జరిపిన అనంతరం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ గడువును పెంచే ప్రతిపాదనకు తుదిరూపం ఇస్తామని చెప్పారు. ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం 500 కోట్ల రూపాయలు ఇచ్చిందని, మరో 1,600 కోట్లు కేటాయించాలని కోరుతూ ‘నీతి ఆయోగ్’కు లేఖ రాసినట్లు ఉమాభారతి వివరించారు. ఈ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు తీరు అసంతృప్తికరంగానే ఉందని అంగీకరిస్తూ...ఇకపై నిధుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామన్నారు. అయితే పనుల తీరు చూస్తుంటే ప్రాజెక్టు నిర్మాణం గడువును పెంచకతప్పదని ఆమె అభిప్రాయపడ్డారు. ఇలా గడువు పెంచడం వ్యక్తిగతంగా తనకు ఇష్టం లేకున్నా, అనివార్య కారణాల వల్ల ‘డెడ్‌ లైన్’ను కొంతమేరకైనా పెంచక తప్పదన్నారు. పోలవరం ప్రాజెక్టు 2018లోగా పూర్తి కావల్సి ఉందని, అయితే ఎంతమేరకు గడువు ఇస్తామన్న విషయాన్ని ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేనని ఉమాభారతి అన్నారు.

‘పోలవరం ప్రాజెక్టు అథారిటీ’ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినప్ప‌టికీ పనుల బాధ్యతను ఏపీ ప్రభుత్వం చూస్తోంది గనుక ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడికి వచ్చినపుడు అన్ని విషయాలను స్వయంగా తెలుసుకుంటానని ఆమె చెప్పారు. ‘సాగునీటి ప్రాజెక్టులు సకాలంలో పూర్తిచేస్తే ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించిందని, నదుల అనుసంధానంతో పట్టిసీమ ప్రాజెక్టును పూర్తిచేసిన ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తారు?’ అని విలేక‌రులు ప్రశ్నించగా- ఆ ప్రాజెక్టు ప్రోత్సాహకాల పరిధిలోకి రాదని ఉమాభారతి బదులిచ్చారు! ‘ఆక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాం’కు సంబంధించిన సాగునీటి పథకాలను సకాలంలో పూర్తిచేస్తేనే ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. కేంద్రం కోణంలో ఈ నిర్ణయం సరైనదిగానే ఉన్నప్పటికీ... మిత్రపక్షంగా ఉండి కూడా జాతీయ హోదా పొందిన ప్రాజెక్టుకు నిధులు తెచ్చుకోలేక పోయారనే అపప్రద బాబు ఎదుర్కోవడం ఖాయమేనేమో.