Begin typing your search above and press return to search.

చాలెంజ్‌ కు ఉండ‌వ‌ల్లి రెడీ..టీడీపీ తేల్చుకోవాలి!!

By:  Tupaki Desk   |   11 July 2017 5:38 AM GMT
చాలెంజ్‌ కు ఉండ‌వ‌ల్లి రెడీ..టీడీపీ తేల్చుకోవాలి!!
X
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్ ఆస‌క్తిక‌ర‌మైన చాలెంజ్ విసిరి మ‌రోమారు తెర‌మీద‌కు వ‌చ్చారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన‌ ప‌ట్టిసీమ ప్రాజెక్టుపై ఇటీవ‌ల ఉండ‌వ‌ల్లి వ‌రుస‌గా ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అవినీతి - అక్ర‌మాలను నిరూపించేందుకు తాను సిద్ధ‌మ‌ని కూడా ఇటీవ‌ల ఉండ‌వ‌ల్లి ప్ర‌క‌టించారు. ఉండ‌వ‌ల్లి స‌వాల్‌ ను మాజీ మంత్రి - తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇటీవ‌లే స్వీక‌రించారు. 18వ తేదీన రైతుల సమక్షంలో చర్చకు సిద్ధమేనా అని ప్ర‌శ్నించారు. దీనిపై ఉండ‌వ‌ల్లి సైతం అదే రీతిలో రియాక్ట‌య్యారు. పట్టిసీమపై చర్చకు తాను సిద్ధమేనని ప్రకటిస్తూ... తన సవాల్‌ ను స్వీకరించి చర్చకు అంగీకరించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో విలేక‌రుల సమావేశంలో ఉండవల్లి అరుణ్‌ కుమార్ మాట్లాడుతూ గోరంట్ల చెప్పినట్టు 18వ తేదీన రైతుల సమక్షంలో చర్చకు తాను సిద్ధమేనన్నారు. అయితే చర్చ కృష్ణా బ్యారేజి పైనా, లేక కృష్ణా వద్ద అనేది గోరంట్ల పిలుపులో స్పష్టం కాలేదన్నారు. పట్టిసీమ ఒక నిరుపయోగ ప్రాజెక్టు అని నేటికీ నిరూపించగలనన్నారు. పోలవరం హెడ్ వర్క్సు నిర్మాణానికి రూ.4200 కోట్లు అంచనా అని - పట్టిసీమ - పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలకు సుమారు రూ.3200 కోట్లు ఖర్చతుందని, ఈ మొత్తం పోలవరం కోసం ఖర్చుచేసి వుంటే ఇప్పటికే హెడ్‌వర్క్సు 70 శాతం పూర్తయ్యేదన్నారు. పట్టిసీమపై ప్రభుత్వం విడుదల చేసిన జీవోలన్నీ పచ్చి అబద్ధాలేనని, కాగ్ నివేదికలో ఈ విషయం రూఢీ అయిందన్నారు. పట్టిసీమలో రూ.391 కోట్లు రాష్ట్ర ఖనాజాకు నష్టమని కాగ్ తేల్చిందన్నారు. కృష్ణా రైతులతో పట్టిసీమ గురించి గొప్పగా ప్రచారం చేయించి పోలవరం పక్కనబెట్టేందుకు ఒక కుట్ర జరుగుతోందని ఉండవల్లి ఆరోపించారు. కేవలం రూ.115 కోట్లు తెలంగాణ ప్రభుత్వానికి చెల్లిస్తే పులిచింతల పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉన్నప్పటికీ కావాలనే పట్టిసీమ పూర్తయ్యేంత వరకు డబ్బు చెల్లించకుండా నాటకమాడారని ఉండ‌వ‌ల్లి ఆరోపించారు. పట్టిసీమ పథకం కేవలం అవినీతి డ‌బ్బుల‌ కోసమేనని మరోసారి ఆరోపిస్తున్నానన్నారు.

పట్టిసీమ నదుల అనుసంధానం కాదని నేషనల్ వాటర్ డవలప్‌ మెంట్ అథారిటీ (ఎన్‌ డబ్ల్యుడిఎ) తేల్చిచెప్పడం సిగ్గుచేటని, ఈ విషయం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ రాసిన లేఖ ద్వారా ఎన్‌ డబ్ల్యుడిఎ నిగ్గు తేల్చిందని ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ అన్నారు. రిజర్వాయర్ లేకుండా నదుల అనుసంధానం ఎలా జరుగుతుందని, అసలు పట్టిసీమ అనేది తమ సమాచారంలో లేదని ఆ సంస్థ సమాధానం చెప్పిందని ఉండ‌వ‌ల్లి గుర్తు చేశారు. ఈ చర్చకు వచ్చేటపుడు గోరంట్ల పోలవరంపై కూడా స్టడీచేసి వస్తారని ఆశిస్తానని ఉండవల్లి ఎద్దేవా చేశారు. ప్రభుత్వం అనుమతితో, ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ఆదేశాల మేరకే గోరంట్ల చర్చకు వస్తున్నారని భావిస్తున్నాన‌ని ఉండ‌వ‌ల్లి వ్యాఖ్యానించారు.