Begin typing your search above and press return to search.

అమెరికా స్కూల్‌ లో 'భారత ఫారెస్ట్‌ మ్యాన్' పాఠం ...కారణం అదే !

By:  Tupaki Desk   |   2 Nov 2020 6:25 PM GMT
అమెరికా స్కూల్‌ లో భారత ఫారెస్ట్‌ మ్యాన్ పాఠం ...కారణం అదే !
X
భారత్ ఫారెస్ట్‌ మ్యాన్‌ గా అందరికి సుపరిచితమైన అస్సాంకు చెందిన జాదవ్ పాయెంగ్ కు అరుదైన గౌరవం దక్కింది. గత నాలుగు దశాబ్ధాల కాలం పాటు ఒంటి చేత్తో కొన్ని వేల మొక్కలను నాటి 550 ఎకరాల అడవిని సృష్టించాడు జాదవ్ పాయెంగ్. ఆ విశేషమైన సేవని గుర్తించి భారత ప్రభుత్వం జాదవ్ ను పద్మశ్రీతో సత్కరించింది. ఓ సందర్భంలో గ్రామస్తులు చెట్లను నరకబోతుంటే ప్రాణాలు అడ్డుపెట్టి మరీ ఆ చెట్లను కాపాడారు. ఇక ఇప్పుడు జాదవ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని బిస్టల్‌ గ్రీన్‌ హిల్స్‌ స్కూల్‌లో ఆరవ తరగతి విద్యార్ధులకు బోధించే పాఠ్యాంశాలలో జాదవ్‌ గురించి తెలియజేస్తున్నారు.

దీని గురించి టీచర్‌ నవామీ శర్మ మాట్లాడుతూ, ఎకాలజీ పాఠాలలో భాగంగా జాదవ్‌ చేసిన పనులను వివరిస్తున్నారు. ఒక వ్యక్తి ఏవిధంగా సమాజం మీద పాజిటివ్‌ ప్రభావాన్ని చూపగలడో భవిష్యత్‌ తరాలకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో జాదవ్‌ గురించి పాఠ్యాంశాలలో చెబుతున్నామని నవామీ తెలిపారు. అస్సాంకు చెందిన జాదవ్‌ పాయెంగ్‌ మజులి నది ప్రాంతంలో ఉండే ద్వీపంలోని బీడు భూమిలో 40 సంవత్సారాల నుంచి ఒక్కొక్క మొక్క నాటడం మొదలుపెట్టాడు. అలా ఆయన ఏకంగా 550ఎకరాల అడవినే తయారు చేశారు.

ఆ అడవిలో ఏనుగులు, పులులు, జింకలు ఇంకా ఎన్నో జంతువులు ఉన్నాయి. ఒక్కడిగా జాదవ్‌ మొదలు పెట్టిన పనివలన ప్రస్తుతం ఉంటున్న వారితో పాటు వచ్చే తరాల వారికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. అందుకే జాదవ్‌ గురించి అమెరికా పాఠ్య పుస్తకాలలో కూడా వివరిస్తున్నారు.