Begin typing your search above and press return to search.

ఢిల్లీ మద్యం స్కామ్‌.. రిమాండ్‌ రిపోర్టులో కేసీఆర్‌ కూతురుతోపాటు ఉన్న మరో 35 మంది వీరే!

By:  Tupaki Desk   |   1 Dec 2022 5:24 AM GMT
ఢిల్లీ మద్యం స్కామ్‌.. రిమాండ్‌ రిపోర్టులో కేసీఆర్‌ కూతురుతోపాటు ఉన్న మరో 35 మంది వీరే!
X
ఢిల్లీ మద్యం కుంభకోణం సృష్టిస్తున్న ప్రకంపనలు ఇంకా ఆగడం లేదు. తవ్వేకొద్దీ కలుగులు బయటపడుతూనే ఉన్నాయి. వ్యాపారవేత్తలతోపాటు వివిధ రాష్ట్రాల రాజకీయ నేతలకు ఇందులో భాగస్వామ్యముందని స్పష్టమవుతోంది. తాజాగా అమిత్‌ అరోడా రిమాండ్‌ రిపోర్టులో ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధమున్న లేదా తమకు అనుమానమున్న 36 మంది పేర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) చేర్చింది.

ఈడీ రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్న పేర్లలో తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మల్సీ కల్వకుంట్ల కవిత ఉండటం కలకలం రేపుతోంది. అలాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గోరంట్ల బుచ్చిబాబు, బోయినపల్లి అభిషేక్, సృజన్‌రెడ్డి ఉన్నారని తెలుస్తోంది.

కాగా ఢిల్లీ మద్యం కేసుతో సంబంధముందన్న అనుమానంతో అమిత్‌ అరోడాను ఈడీ ఇప్పటికే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అతడిని నవంబర్‌ 30 డిల్లీ కోర్టులో హాజరుపర్చింది. ఈ సందర్భంగదా రిమాండ్‌ రిపోర్టును న్యాయస్థానానికి సమర్పించింది.

కాగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో భాగస్వామ్యం ఉన్న, తమకు అనుమానం ఉన్న 36 మంది గత ఏడాది కాలంలో 170 ఫోన్లను ధ్వంసం చేసినట్లు ఈడీ తన రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడించింది. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన అయిదుగురు 33 ఫోన్లను ధ్వంసం చేయడం లేదా మార్చినట్టు తెలిపింది.

ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూతురు కల్వకుంట్ల కవిత 10, వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్‌చంద్రా రెడ్డి 9, గోరంట్ల బుచ్చిబాబు 6, బోయినపల్లి అభిషేక్‌ 5, సృజన్‌రెడ్డి 3 ఫోన్లను ధ్వంసం చేయడం కానీ, మార్చడం కానీ చేశారని ఈడీ పేర్కొంది.

వీరంతా ఏయే నంబర్ల ఫోన్లు వాడారు? వాటి ఐఎంఈఐ నంబర్లు ఏంటి? ఏయే తేదీల్లో వాటిని ధ్వంసం చేశారు లేదా మార్చారన్న వివరాలను కూడా ఢిల్లీ కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో పేర్కొనడం గమనార్హం. వేల కోట్ల రూపాయలతో ముడిపడిన ఈ కేసుకు సంబంధించి విలువైన సాక్ష్యాధారాలు, ముడుపులకు సంబంధించిన వివరాలున్న డిజిటల్‌ డేటాను నిందితులంతా ధ్వంసం చేశారని ఈడీ ఆరోపించింది.

మద్యం కేసులో ఆప్‌ నేతలకు రూ.100 కోట్ల ముడుపులు ఇచ్చిన సౌత్‌ గ్రూప్‌.. వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్‌ చంద్రారెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూతురు కె.కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిల నియంత్రణలో ఉన్నట్లు ఈడీ న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో పేర్కొంది. ఇప్పటివరకు జరిపిన దర్యాప్తు ప్రకారం విజయ్‌ నాయర్‌ ఆప్‌ నాయకుల తరఫున కనీసం రూ.100 కోట్ల ముడుపులను సౌత్‌గ్రూప్‌ నుంచి అందుకున్నారని వెల్లడించింది.

కాగా ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన ముఖ్య సమాచారమంతా మొబైల్‌ ఫోన్లలో కానీ, ల్యాప్‌టాప్‌ల్లో కానీ నిక్షిప్తమై ఉందని ఈడీ అనుమానిస్తోంది. అయితే కుంభకోణం వెలుగులోకి రావడం, దర్యాప్తు సంస్థలు కేసు విచారణకు రంగంలోకి దిగడంతో కుంభకోణంలో భాగస్వాములు, అనుమానస్తులు 36 మంది 170 ఫోన్లను ధ్వంసం చేయడం లేదా మార్చుకోవడం చేశారని ఈడీ Ðð ల్లడించింది. ఇందులో 17 ఫోన్లను ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) రికవరీ చేసింది.

ఈ 170 ఫోన్లు అన్నీ దొరికి ఉంటే ఢిల్లీ మద్యం కుంభకోణంలో చేతులుమారిన ముడుపులు మరిన్ని వెలుగులోకి వచ్చేవని అంటున్నారు. ఈ ఫోన్లలో మద్యం విధానం ఖరారు నుంచి అమలు వరకు సమస్త సమాచారం ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే అందులోని సమాచారాన్ని తీసుకోలేని విధంగా ఆ ఫోన్లను నిందితులు ధ్వంసం చేశారని ఈడీ ఆరోపిస్తోంది. ఇందులో ప్రధాన అనుమానితులు, మద్యం వ్యాపారులు, సీనియర్‌ ప్రభుత్వ అధికారులు, ఢిల్లీ ఎక్సైజ్‌ మంత్రి మనీష్‌ సిసోడియా ఉన్నారని ఈడీ చెబుతోంది.

ఇక అమిత్‌ అరోడా 11 ఫోన్లను వాడటం/మార్చడం/ధ్వంసం చేయడాన్ని బట్టి సాక్ష్యాల చెరిపివేతకు ప్రయత్నించారని ఈడీ పేర్కొంది.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత మనీష్‌ సిసోడియా 14 ఫోన్లు ద్వారా నాలుగు నంబర్లను వినియోగించినట్టు ఈడీ గుర్తించింది. వీటిని ఆయన ధ్వంసం చేసినట్టు పేర్కొంది. వీరితోపాటు కైలాస్‌ గహ్లోత్‌ (ఢిల్లీ రవాణా శాఖ మంత్రి), సన్నీ మార్వా, కుల్విందర్‌ మార్వా, విజయ్‌నాయర్, బృందాపాల్‌ సింగ్, అమన్‌ధల్, సమీర్‌ మహేంద్రు, నితిన్‌ కపూర్, గీతిక మహేంద్రు, విభూతి శర్మ, వినోద్‌ చౌహాన్, అమిత్‌ అరోడా, సాహిల్‌ అరోడా, దీప్‌ మల్హోత్రా, రాజీందర్‌ చద్దా, అపర్ణ సూద్, దీపా చద్దా, రిషి బాలి, దినేష్‌ అరోడా, దీపేందర్‌ షెహ్రావత్, అరుణ్‌ పిళ్లై, అర్జున్‌పాండే, వైడంట్‌ చద్దా, బైభవ్‌కుమార్‌ (ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల పీఏ), కర్మజిత్‌ లాంబా, ఉమేష్‌ పరాశర్, హరిందర్‌పాల్‌సింగ్, హర్జిత్‌ సింగ్, గౌతం ఎం, రోహిత్‌ చందరణ్‌ కూడా ఫోన్లను ధ్వంసం చేయడం లేదా మార్పు చేయడం చేశారని ఈడీ పేర్కొంది.

కుంభకోణం వల్ల ఢిల్లీ ప్రభుత్వం రూ.581 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని ఈడీ న్యాయస్థానానికి తెలిపింది. లైసెన్సు ఫీజులు సహా అన్నింటి రూపేణా రూ.2,873 కోట్ల రెవెన్యూను నష్టపోయింది అని అమిత్‌ అరోడా రిమాండు రిపోర్టులో పేర్కొంది. మరిన్ని అంశాలను విచారించాల్సి ఉందని.. అమిత్‌ అరోడాను తమ కస్టడీకి అప్పగించాలని కోరింది. దీంతో న్యాయస్థానం డిసెంబరు 7 వరకు అరోడాను ఈడీ కస్టడీకి అప్పగిస్తున్నట్లు న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది.

కాగా మరోవైపు ఈడీ ఆరోపించిన సౌత్‌గ్రూపుతో తనకెలాంటి సంబంధం లేదని ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ఉత్తర భారత లిక్కర్‌ వ్యాపారులపై దక్షిణ భారతదేశ వ్యాపారులపై కుట్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అమిత్‌ అరోడాతో తానెప్పుడూ కలవలేదని.. మాట్లాడలేదని తెలిపారు. అతడి రిమాండ్‌ రిపోర్టులో తన పేరును ఈడీ ఎందుకు చేర్చిందో తెలియదన్నారు. ఢిల్లీ మద్యం విధానంతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.