Begin typing your search above and press return to search.

ఆ విద్యా సంస్థల చైర్మన్‌పై రెండు పార్టీల గురి!

By:  Tupaki Desk   |   27 Nov 2022 7:33 AM GMT
ఆ విద్యా సంస్థల చైర్మన్‌పై రెండు పార్టీల గురి!
X
కేశవరెడ్డి విద్యా సంస్థలు.. పరిచయం అక్కర్లేని పేరు. శ్రీ చైతన్య, నారాయణ విద్యా సంస్థలకు ధీటుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తన విద్యా సంస్థల ద్వారా సంచలనం సృష్టించారు.. కేశవరెడ్డి. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన ఈయన గతంలో ఆర్‌ఎస్‌ఎస్‌ (రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌) ఆధ్వర్యంలో నడిచే శిశు మందిర్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేశారు.

ఆ తర్వాత తన పేరుతోనే కేశవరెడ్డి విద్యా సంస్థలను స్థాపించి రెండు తెలుగు రాష్ట్రాల్లో స్కూల్స్‌ విభాగంలో సంచలనం సృష్టించారు. కొన్నేళ్లపాటు వరుసగా కేశవరెడ్డి విద్యార్థులు పదో తరగతిలో స్టేట్‌ టాపర్స్‌గా నిలిచారు.

అయితే విద్యా సంస్థలను నడపడానికి తల్లిదండ్రుల వద్ద డిపాజిట్లు సేకరించారని.. ఇలా డిపాజిట్లు ఇచ్చినవారికి వడ్డీతోపాటు, వారి పిల్లలకు తన విద్యా సంస్థల్లో ఉచిత విద్యను అందించేవారని విమర్శలు వచ్చాయి. ఇలా విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద వేల కోట్ల రూపాయలు వసూలు చేశారని తీవ్ర అభియోగాలు వచ్చాయి. దీంతో తీవ్ర సమస్యల్లో కేశవరెడ్డి కూరుకుపోయారు.

మరోవైపు కేశవరెడ్డికి రాజకీయ బంధుగణం కూడా ఉంది. బనగానపల్లి వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి కేశవరెడ్డి వియ్యంకుడు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో గత టీడీపీ ప్రభుత్వం కేశవరెడ్డి విద్యా సంస్థలను దెబ్బతీయడానికి ప్రయత్నించిందనే విమర్శలు ఉన్నాయి. అందులోనూ చైతన్య, నారాయణ విద్యా సంస్థల అధినేతలు ఇద్దరూ టీడీపీ అధినేత చంద్రబాబుకు కావాల్సినవారు కావడంతో ఉద్దేశపూర్వకంగానే కేశవరెడ్డి విద్యా సంస్థలపై కుట్ర జరిగిందనే వారూ ఉన్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక మళ్లీ తిరిగి కేశవరెడ్డి విద్యా సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించాయి. మళ్లీ పూర్వ వైభవం సాధించడానికి కేశవరెడ్డి ప్రయత్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆయనపై రెండు పార్టీలు దృష్టి సారించాయని టాక్‌ నడుస్తోంది. కేశవరెడ్డిని కర్నూలు నుంచి వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేయించాలని వైసీపీ అధినేత జగన్‌ యోచిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం కర్నూలు ఎంపీగా సంజీవ్‌ కుమార్‌ ఉన్నారు. అయితే ఆయన పొలిటికల్‌గా అంత యాక్టివ్‌గా ఉండటం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో మంచి పరిచయాలు, విద్యా సంస్థలు, ఆర్థిక దన్ను ఉన్న కేశవరెడ్డిని కర్నూలు ఎంపీ బరిలో దించాలని వైసీపీ యోచిస్తోందని టాక్‌.

అలాగే బీజేపీ కూడా కేశవరెడ్డిపై దృష్టి సారించిందని చెబుతున్నారు. కేశవరెడ్డి పూర్వాశ్రమంలో ఆర్‌ఆర్‌ఎస్‌ పరిధిలోని శిశుమందిర్‌లో ఉపాధ్యాయుడిగా చేసి ఉండటం కలసి వస్తుందని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనను హైదరాబాద్‌ అవుట్‌కట్స్‌ పరిధిలోకి వచ్చే మల్కాజిగిరి ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దించాలని చూస్తోందని అంటున్నారు.

మల్కాజ్‌గిరిలో అటు ఆంధ్రా వాళ్లు, ఇటు ఉత్తరాది వాళ్లు, మరోవైపు తెలంగాణ వాసులు భారీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కేశవరెడ్డి సులువుగా విజయం సాధించగలరని బీజేపీ భావిస్తోంది.

ప్రస్తుతం మల్కాజ్‌గిరి నుంచి తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ ఎంపీగా ఉన్నారు.

అయితే ఈసారి రేవంత్‌ అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేశవరెడ్డిని బీజేపీ నుంచి బరిలోకి దించితే ఆయన గెలుపు ఖాయమనే అంచనాల్లో బీజేపీ ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మరి కేశవరెడ్డి ఏ పార్టీలో చేరతారో వేచిచూడాల్సిందే.