Begin typing your search above and press return to search.

భూమిపై గ్రహాంతరవాసుల కదలికలపై అమెరికా సైన్యం కీలక ప్రకటన..!

By:  Tupaki Desk   |   18 Dec 2022 5:30 AM GMT
భూమిపై గ్రహాంతరవాసుల కదలికలపై అమెరికా సైన్యం కీలక ప్రకటన..!
X
విశ్వంలో మనిషి లాంటి జీవులు ఎక్కడైనా ఉన్నారా? అనే ప్రశ్నకు ఇప్పటివరకు సైంటిస్టులు సమాధానాన్ని కనుక్కోలేక పోయారు. భూమి తప్ప మరే గ్రహం లేదా విశ్వంలో జీవుల మనుగడ కనిపించడం లేదని ఇప్పటివరకు కొనసాగిన పరిశోధనల్లో వెల్లడైంది. అంతరిక్ష ప్రయోగాలకు కేరాఫ్ గా నిలిచే అమెరికా.. చైనా.. భారత్ లాంటి దేశాలు చంద్రుడు.. అంగారక గ్రహంపై నీటి ఆనవాళ్లు ఉన్నాయని.. అక్కడ మనుషులు జీవించడానికి పరిస్థితులు అనుకూలిస్తామంటూ పేర్కొంటున్నాయి.

ఈ నేపథ్యంలోనే అంగారక.. చంద్రుడిపై ఇటీవల కాలంలో ప్రపంచ దేశాలు దృష్టి సారిస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలైతే అంగారకుడు.. చంద్రుడిపై ఏకంగా కాలనీ నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మనిషి మరో గ్రహం మీద జీవిస్తే అప్పుడు అతడే భూమిపై ఉన్న మనిషికి గ్రహంతర వాసిగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదంతా ఫన్నీగా అనిపిస్తున్న అది త్వరలో నిజం కాబోతుందని ప్రస్తుత పరిశోధనలు చూస్తే అర్థమవుతుంది.

ఇక భూమిపై గ్రహంతర వాసుల కదిలికలపై భిన్నమైన వాదనలు తరుచూ విన్పిస్తున్నాయి. ఆకాశంలో యూఎఫ్ఓ(అన్ డిఫైన్డ్ ఫ్లైయింగ్ అబ్జెక్ట్) తిరగడం చూశామని పలువురు చెబుతున్నారు. అయితే వీటిపై ఇప్పటికీ సరైన ఆధారాలు లేకపోవడంతో గ్రహాంతర వాసులు అనేవారు ఉన్నారా? లేదా అనే చర్చ దశాబ్ధాలుగా నడుస్తూనే ఉంది. ఇదే విషయంపై అమెరికా సైనికా అధికారులు తాజాగా మాట్లాడుతూ గ్రహాంతర వాసులకు సంబంధించిన జాడ ఇప్పటికైతే లభించలేదని స్పష్టం చేశారు.

అయితే గ్రహాంతర వాసులు లేరని మాత్రం కొట్టిపారేయలేమని చెబుతున్నారు. గ్రహంతర వాసుల వ్యోమ నౌకలుగా భావిస్తున్న ఫ్లయింగ్ సాసర్లో ఏలియన్స్ తరుచూ భూమిపై వస్తున్నారని చెప్పడానికి తమ వద్ద ఇప్పటివరకు సరైన ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. అదేవిధంగా యూఎఫ్ఓ లకు సంబంధించిన వందలాది ఘటనలపై నివేదికలు తయారు చేస్తున్నామని అమెరికా రక్షణ శాఖ అండర్ సెక్రెటరీ రోనాల్డ్ మౌల్ట్రీ స్పష్టం చేశారు.

మరోవైపు ఏలియన్స్ జాడ కనుగొనేందుకు శాస్త్రీయ పరిశోధనలు చేస్తున్నట్లు పెంటాగాన్ కొత్తగా ఆల్ డొమైన్ అనోమలీ రిజల్యూషన్ ఆఫీస్ డైరెక్టర్ సీన్ కిర్క్ ప్యాట్రిక్ తెలిపారు. అమెరికాలోని నిషేధిత గగన స్థలం.. ఇతరత్ర పదేశాల్లో అసాధారణ గుర్తు తెలియని వస్తువుల కార్యకలాపాలపై ఈ సంస్థ దృష్టి సారిస్తుందన్నారు. తద్వారా సైన్యానికి.. జాతీయ భద్రత ముప్పు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తుందని తెలిపారు.

140కి పైగా యూఎఫ్ఓ సంబంధిత ఘటనలపై ప్రభుత్వం గతేడాది నివేదికలను తయారు చేసిందని పేర్కొన్నారు. ఆ తర్వాత ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని వెల్లడించారు. ఈ సంఖ్య మే నాటికి 400లకు చేరుకోవచ్చని నేవీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వీటన్నింటిని పరిశోధించి గ్రహాంతర వాసుల జాడపై త్వరలోనే ఒక నిర్ణయానికి రానున్నట్లు పెంటగాన్ అధికారులు తాజాగా ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.