Begin typing your search above and press return to search.

ఆయన ఫ్యామిలీకి రెండు! ఇతరులకు నో!!

By:  Tupaki Desk   |   4 Nov 2017 6:24 AM GMT
ఆయన ఫ్యామిలీకి రెండు! ఇతరులకు నో!!
X
కాంగ్రెసు పార్టీలో ఒకే కుటుంబంనుంచి ఇద్దరు నాయకులు ఎన్నికల్లో టికెట్లు దక్కించుకోవడం అనేది చాలా సర్వసాధారణమైన విషయం. గతంలో రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా ఎన్నో దశాబ్దాలుగా అలాంటి దాఖలాలు అనేకం ఉన్నాయి. తెలంగాణలో కూడా అలాంటివి పునరావృతం అయ్యాయి. అయితే గత 2014 ఎన్నికల సమయంలో అప్పటికి మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకు, తన భార్యకు కూడా టికెట్లు ఇప్పించుకోవడం అనేది అప్పటికి సంచలనంగానే నిలిచింది. అయితే వారిద్దరూ కూడా ఎన్నికల్లో గెలిచి పార్టీకి అంతో ఇంతో పరువు నిలబెట్టారు. కానీ తమాషా ఏంటంటే.. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎన్నికల సమయంలోనూ ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అనే ప్రకటన చేస్తూ ఉంటుంది. కానీ ప్రతిసారీ ఆ నిబంధనను యథేచ్ఛగా అతిక్రమిస్తూ కూడా ఉంటుంది.

ఈ ఉపోద్ఘాతం మొత్తం ఎందుకు చెప్పవలసి వచ్చినదంటే.. తన భార్యకు టికెట్ ఇప్పించుకునే విషయంలో అప్పట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈ నిబంధనలేమీ గుర్తుకు రాలేదు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా విజయం మీద గట్టి ఆశలతోనే రంగంలోకి దిగింది. ఆ సమయంలో కూడా పార్టీలో ఎమ్మెల్యే టికెట్లకు చాలా పోటీ నడిచింది. ఒక్కో కుటుంబంలో రెండేసి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం దాదాపు అసాధ్యం అనిపించే పరిస్థితి. అయినా సరే.. అప్పటికి కేవలం మంత్రిగా మాత్రమే ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.. అప్పటి పీసీసీ అభీష్టాన్ని కూడా కాదని.. డైరక్టుగా హైకమాండ్ తో తనకు ఉన్న రిలేషన్స్ ద్వారా తన భార్యకు కూడా టికెట్ ఇప్పించుకోగలిగారు. అంతో ఇంతో ఎడ్వాంటేజీ ఏంటంటే.. వీరిద్దరూ కూడా ఎన్నికల్లో గెలిచారు. అప్పట్లో ఆయనకు తన భార్యకు టికెట్ తీసుకోవడానికి పార్టీలో ఉన్న నిబంధన అడ్డు రాలేదు. ఈసారి ఎన్నికలు వచ్చినా సిటింగుల కోటాలో దంపతులిద్దరూ బరిలోకి దిగుతారు.

అయితే తనకు అడ్డురాని నిబంధనను ఆయన కొండా సురేఖ- మురళి దంపతులకు మాత్రం అడ్డు చెప్పినట్లు తెలుస్తోంది. వారు ప్రస్తుతం గులాబీ పార్టీలో ఉన్నారు. ఆ పార్టీలో ఇమడలేకపోతున్నారు. తమ దంపతులిద్దరికీ ఎమ్మెల్యే టికెట్ల హామీ ఇస్తే.. తిరిగి కాంగ్రెసులోకి వస్తాం అని బేరం పెడుతున్నారట. అయితే ఇద్దరికీ ఇవ్వడం సాధ్యం కాదని ఉత్తమ్ తెగేసి చెప్పేశారుట. ఉత్తమ్ దృష్టిలో పార్టీ నిబంధనలు అనేవి తనకు ఒక తీరుగా.. ఇతరులకు మరో తీరుగా ఉండేలా కనిపిస్తున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.