Begin typing your search above and press return to search.

నిన్నటి వీరవనిత కాంగ్రెస్ మహిళే

By:  Tupaki Desk   |   5 July 2022 2:28 AM GMT
నిన్నటి వీరవనిత కాంగ్రెస్ మహిళే
X
పోరాడితే పోయేదం లేదంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో పోరాడితే నిజంగానే ఏమీ పోదు. ఏపీ కాంగ్రెస్ కి అయితే పోయేదేం లేకపోగా లాభం కూడా ఉండొచ్చు. హక్కులు దక్కాలి అంటే పోట్లాడాల్సినంత పోట్లాడాలి. నిన్న‌టి వేళ మోడీ స‌భ సంద‌ర్భంగా ఒకే ఒక్క మ‌హిళా నేత రోడ్డెక్కి మాట్లాడారు. నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

ఏపీకి జరుగుతున్న అన్యాయంపై పిడికిలి బిగించారు. ధ‌ర్మాగ్ర‌హాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఆమే ఏపీ కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ. ఏపీ కాంగ్రెస్ కు ఓ విధంగా ఇది ఒక అరుదైన సంద‌ర్భమే! ఇప్ప‌టికే చాలా మంది కాంగ్రెస్ నాయ‌కులు హౌస్ అరెస్టు అయ్యారు. విప‌క్ష, వామ‌ప‌క్ష పార్టీలు కూడా నిన్నటి వేళ సైలెంట్ అయిపోయింది.

ఇలాంటి సంద‌ర్భంలో ఆమె చూపిన తెగువ నిజంగానే అభినంద‌నీయం. అలాంటి సంద‌ర్భం ఓ శుభ ప‌రిణామం.

కాంగ్రెస్ మ‌హిళా నాయ‌కురాలు సుంక‌ర ప‌ద్మ‌శ్రీ నిన్న‌టి వేళ మోడీకి నిర‌స‌న‌లు తెలిపేందుకు వెళ్లారు.

ఒక్క‌రంటే ఒకే ఒక్క మ‌హిళ డౌన్ డౌన్ మోడీ.. ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్కు అని నిన‌దించారు. పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. విచ‌క్షణార‌హితంగా ప్ర‌వ‌ర్తించారు. స‌భ‌కు వెళ్ల‌కుండా అడ్డుకున్నారు. న‌ల్ల‌బెలూన్ల‌ను లాక్కుని పేల్చేశారు. ఇంకా ఆమెను నియంత్రిస్తూ ఇద్ద‌రు మ‌హిళా పోలీసులు, న‌లుగురు మ‌గ పోలీసులు క‌లిసి ఆటోలో విసిరేశారు. ఇదీ ఆమెకు మోడీ ఇచ్చిన కానుక.. ఇదీ ఆమెకు జగ‌న‌న్న ఇచ్చిన కానుక అంటూ మండి ప‌డుతోంది ఏపీ కాంగ్రెస్.. అస్స‌లు ఎవ్వ‌రూ గొంతెత్తేందుకు కూడా సాహ‌సించ‌లేని స్థితిలో ప‌ద్మజ సుంక‌ర చేసిన ప్ర‌య‌త్నం నిజంగానే అభినంద‌నీయం. కానీ పోలీసుల అతి కార‌ణంగా ఆమె నిర‌స‌ల‌ను అర‌ణ్య రోద‌న‌లే అయ్యాయి. అయితే ఆమె పోరాటానికి నెటిజ‌న్ల నుంచి స్పంద‌న అపూర్వంగా ఉంది. ఆమెకు చాలా మంది జేజేలు ప‌లుకుతున్నారు.

ఆంధ్రుల‌కు ఇస్తామ‌న్న‌వి ఏవీ ఇవ్వ‌లేద‌ని., ప్ర‌త్యేక హోదా వెనుక ఆవ‌శ్య‌క‌త‌ను మ‌రిచి ఎనిమిదేళ్లు అవుతోంద‌ని, ఇప్ప‌టికైనా త‌మ‌కు న్యాయం చేయాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు ఇక్క‌డి ప్ర‌జ‌లు.

ముఖ్యంగా పార్ల‌మెంట్ వేదిక‌గా ఇచ్చిన హామీకి కూడా దిక్కు లేకుండా పోయింద‌ని, విభ‌జ‌న చట్టం అమ‌లుకు తూట్లు పొడుస్తున్నార‌ని పేర్కొంటూ ప‌లువురు నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. ఈ ద‌శ‌లో న‌ల్ల బెలూన్ల ఎగుర‌వేత అన్న‌ది నిర‌స‌న‌లో భాగ‌మేన‌ని, ఇందులో త‌ప్పేం లేద‌ని, ఎవ్వ‌రూ మాట్లాడ‌కుండా ఉంటే స‌మ‌స్య‌లు ఎలా వెలుగులోకి వ‌స్తాయ‌ని వారు అంటున్నారు. ఇప్పటికైనా ఆంధ్రాకు న్యాయం చేయాల‌ని కోరుతున్నారు.