Begin typing your search above and press return to search.

పవన్ కి షుగర్ ఉందేమో అంటున్న వెంకయ్య?

By:  Tupaki Desk   |   11 Sep 2016 4:23 AM GMT
పవన్ కి షుగర్ ఉందేమో అంటున్న వెంకయ్య?
X
ఏపీ రాజకీయాలను, ఎన్నికల నాటి స్నేహాలను ఒక్కసారిగా కుదిపేసింది ప్రత్యేక హోదా అంశం. రాజకీయ గ్రాఫ్ ల ప్రకారం చూసుకున్నా.. విశ్లేషకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నా.. ఈ హోదా అనేది బీజేపీ - టీడీపీలకు ఏపీలో పెద్ద మైనస్ గా మారిందనేది కూడా వాస్తవమే. ఈ క్రమంలో సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ అని కాకినాడలో పవన్ కల్యాణ్ సభ పెట్టి.. బీజేపీ నేతలను, టీడీపీ ఎంపీలను ఏకిపారేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ నేత వెంకయ్య నాయుడిని నిలబెట్టి కడిగేసినంత పనిచేశారు. ఆయనపై గౌరవం ఉంది, గౌరవం ఉంది అంటూనే... చురకలు అంటించారు. అయితే ఈ వ్యాఖ్యలపై వెంకయ్య తాజాగా స్పందించారు.

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని కొందరు బదనాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వారికి తాము జవాబు చెప్పాల్సిన అవసరం లేదని అని మొదలుపెట్టిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు.. కేంద్రం ఏపీకి ఇప్పటి వరకు రూ.2.25 లక్షల కోట్ల నిధులు కేటాయించిందని, ఆ విషయాన్ని ఎవ్వరూ ప్రస్థావించడం లేదని మండిపడ్డారు. ఈ క్రమంలో పాచిపోయిన లడ్డూలు అనే అంశాన్ని లేవదీసిన పవన్ పై వెంకయ్య తనదైన శైలిలో స్పందించారు.

రెండు పాచిపోయిన లడ్డూలను కేంద్రం, చేతిలో పెట్టిందన్న పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. "షుగర్ ఉన్నవాళ్లు లడ్డూలు తినలేరు కాబట్టి వారికి ఎంతమంచి లడ్డూలు ఇచ్చినా... అవి వారికి పాచి లడ్డూలుగానే కనిపిస్తాయి" అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు, కేంద్ర సంస్థల ఏర్పాటు, తదితర అంశాలపైన కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని ఏమాత్రం శంకించాల్సిన అవసరం లేదని వెంకయ్య అన్నారు.