Begin typing your search above and press return to search.

కేసీఆర్, ఎన్టీఆర్.. వెన్నుపోటు చరిత్ర చెప్పిన వెంకయ్య

By:  Tupaki Desk   |   25 Dec 2022 4:00 AM GMT
కేసీఆర్, ఎన్టీఆర్.. వెన్నుపోటు చరిత్ర చెప్పిన వెంకయ్య
X
ఒక రాజకీయ నాయకుడి లక్షణాలు ఎలా ఉండాలంటే..? కుళ్లు కుతంత్రాలు.. కుట్రలను తట్టుకొనే శక్తి ఉండాలి.  ప్రత్యర్థుల ఎత్తుగడలను తిప్పికొట్టే పదునైన మనస్తత్వం ఉండాలి. విమర్శలను తిప్పికొడుతూ.. ఆరోపణలపై చాకచక్య సమాధానం ఇస్తూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకునే స్వభావం కలిగి ఉండాలి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎందరో రాజకీయ నాయకులు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.  కొందరు ఈ రంగంలో ఆరితేరిన వారు సొంతంగా పార్టీ పెట్టి తమదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో పరిశీలిస్తే సొంతంగా పార్టీ పెట్టిన 8 నెలల కాలంలోనే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న ఘనత నందమూరి తారకరామారావుకే దక్కుతుంది. అలాగే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు పోయే వరకు పోరాడి.. ఆ తరువాత ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన రికార్డు  కేసీఆర్ సొంతమైంది. అయితే వీరిద్దరిని పోలుస్తూ ఇటీవల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలన కామెంట్స్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలను భట్టి చూస్తే ఎన్టీఆర్, కేసీఆర్ కు  ఉన్న తేడా అదే అని తెలుస్తోంది.

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెనాలిలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో ఎన్టీఆర్ భోళా మనిషి.. కుట్రలు కుతంత్రాలు గమనించలేకపోయారు.. అందుకే వెన్నుపోటుకు గురయ్యారు.. అని అన్నారు. కానీ ఎన్టీఆర్ రాజకీయాల్లో సైలెంట్ విప్లవాన్ని తెచ్చారని, పేదల సంక్షేమానికి అనేక పథకాలు తీసుకొచ్చారని అన్నారు.

ఎన్టీఆర్ వెన్నుపోటు కారణంగానే రాజకీయాల నుంచి తప్పుకున్నారనేది ఎప్పటి నుంచో ఉన్న ఆరోపణ. ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ ఎన్టీఆర్ ను ఆయన అల్లుడు చంద్రబాబే వెన్నుపోటు పొడిచారని అంటూ ఉంటారు. వాస్తవానికి ఎన్టీఆర్ అధికారంలో ఉండగా నాదెండ్ల భాస్కర్ రావు వేసిన స్కెచ్ లో కొందరు టీడీపీ నాయకులు ఎన్టీఆర్ కు ద్రోహం చేశారని చెప్పుకుంటారు. ఇందులో చంద్రబాబుకు భాగస్వామ్యం ఉందని ప్రధాన ఆరోపణ.

సినిమాల నుంచి నేరుగా సొంత పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ ను ప్రజలు చాలా తక్కువ సమయంలోనే ఆదరించారు. తనను ఆదరించి పేదల కోసం ఎన్టీఆర్  అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు.  వీటిలో ప్రధానమైంది పేదలకు రూ.2కే కిలో బియ్యం పథకం.  అలాగే మద్యపానం నిషేధం.   ఓ వైపు ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతూనే మరోవైపు తన పదవి కాపాడుకునేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేయడం రాజకీయ నాయకుడి లక్షణం. కానీ రాజకీయ ఓనమాలు నేర్చుకోకుండానే ఎన్టీఆర్ ఈ రంగంలో అడుగుపెట్టారు. దీంతో ఆయన వెనుక ఏం జరుగుతుందనే విషయాన్ని గ్రహించలేకపోయారు. అందుకే కట్రలకు బలయ్యారని ఆయన అభిమానులు వాపోతున్నారు.

వెంకయ్య మాటలు కేసీఆర్ గురించే అని పరోక్షంగా తెలుస్తోంది. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎన్టీఆర్ లా కాదని వెంకయ్యనాయుడు అభిప్రాయంగా చెప్పొచ్చు. ఆయన మాటల్లో నిజంగానే అర్థం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత ఓ వైపు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా.. మరోవైపు ప్రత్యర్థులను లేకుండా చూసుకున్నారు కేసీఆర్. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే నాటికి బలంగా ఉన్న కాంగ్రెస్ ను కుంగదీశారు. ఆ పార్టీలోని నాయకులందరినీ తమ పార్టీలో చేర్చుకున్నారు. ఇక తాజాగా అధికార పార్టీకి ప్రత్యామ్నాంగా ఎదుగుతున్న బీజేపీపై పోరు మొదలుపెట్టారు. ఢిల్లీ వేదికగా యుద్ధం చేస్తానని ఏకంగా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టారు. తన చాకచక్య మాటలతో ఇంటా, బయట  వ్యతిరేకత రాకుండా ఎప్పటికప్పుడు పదునైన వ్యూహాలు రచించే కేసీఆర్ అసలు సిసలైన రాజకీయ నాయకుడని చెప్పుకుంటున్నారు.

ఎన్టీఆర్ కు ఈ లక్షణాలు ఉంటే ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ కొనసాగేదని అనుకుంటున్నారు. అయితే రాజకీయాలు అందరికీ అచ్చుబాటు కావు. ఈ కాలంలో మాత్రం కేసీఆర్ సిసలైన రాజకీయ నాయకుడిగా మారి ముందుకు సాగుతున్నారు. అందుకే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచే అవకాశం లేకుండా పోతుంది. కానీ అప్పట్లో ఎన్టీఆర్ ఈ విషయాన్ని గ్రహించకపోవడంతో చివరి వరకు రాజకీయాల్లో కొనసాగలేకపోయారు. ఏదీ ఏమైనా కేసీఆర్ తన కుర్చీ కిందకు నీళ్లు రాకముందే ఆనకట్ట వేసే రకం అని కొందరు అంటూ ఉంటారు.