Begin typing your search above and press return to search.

వెంక‌య్య మాటఃప్యాకేజీ తీసుకోమ‌న్న‌ది నేనే

By:  Tupaki Desk   |   18 Sep 2016 11:30 AM GMT
వెంక‌య్య మాటఃప్యాకేజీ తీసుకోమ‌న్న‌ది నేనే
X
కేంద్ర సమాచార - ప్రసారశాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఆంధ్ర‌ప్రదేశ్‌ కు ప్ర‌త్యేక ప్యాకేజీ ఎపిసోడ్‌ లో కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ప్యాకేజీపై ఇప్ప‌టికీ నిర‌స‌న‌లు కొన‌సాగుతుండ‌గా... రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్ర‌బాబుకు తానే చెప్పానని వెంక‌య్య ప్ర‌క‌టించారు. 'ప్రత్యేక ప్యాకేజీపై అవగాహన' పేరుతో విజయవాడలో బీజేపీ ఏర్పాటు చేసిన సదస్సుకు వెంకయ్య ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సంద‌ర్భంగా ఈ కొత్త విష‌యం వెల్ల‌డించారు. న‌వ్యాంధ్ర‌ప్రదేశ్ రాజ‌ధానిని విజయవాడ - గుంటూరు మధ్య నిర్మాణం చేయాలని కూడా సీఎం చంద్రబాబుకు తానే సలహా ఇచ్చానని వెంకయ్యనాయుడు ఈ సంద‌ర్భంగా కొత్త విష‌యం చెప్పారు.

రాష్ట్ర విభ‌జ‌న సంద‌ర్భంగా ప్ర‌త్యేక హోదా కోసం తాను పార్లమెంటులో పోరాడానని - తనకు ఆనాటి స‌భా నేత‌ జైట్లీ జత కలిశారని వెంక‌య్య‌నాయుడు తెలిపారు. అప్పట్లో ఇస్తామని హామీ ఇచ్చినప్ప‌టికీ దాన్ని చట్టంలో పెట్టలేదని దీంతో అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయని14వ ఆర్థిక సంఘం - నీతి అయోగ్‌ అభ్యంతర పెట్టాయని వివరించారు. అందువల్లే మరోమార్గం లేక రాష్ట్రానికి ప్యాకేజీ ఇచ్చామన్నారు. హోదాతో వచ్చే లాభాలన్నీ ప్యాకేజీ వల్ల వస్తాయని వెంక‌య్య నాయుడు భ‌రోసా ఇచ్చారు. హోదా వల్ల మూడు వేల కోట్ల నుండి నాలుగువేల కోట్లకు మించి రావని కానీ ప్యాకేజీ వల్ల రూ.2.25 లక్షల కోట్ల లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ వివరాలన్నీ చంద్రబాబుకు వివరించామని వెంక‌య్యనాయుడు తెలిపారు. ప్యాకేజీ వల్ల కలిగే లాభాలను ముందునుండీ తాను చంద్రబాబు చెబుతున్నానని, ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి లాభమే తప్ప నష్టం ఉండదని తెలిపారు.

ప్ర‌త్యేక ప్యాకేజీపై కొన్ని పార్టీలు పనిగట్టుకుని దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అది సరైన పద్ధతి కాదని వెంక‌య్య నాయుడు విమర్శించారు. పరిశ్రమలు స్థాపించే వారు హోదా ఉందా లేదా అని చూడరని వెంక‌య్య చెప్పారు. తాను తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికవ్వకున్నా తెలుగువాడిగా రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం కృషిచేస్తానని వెంక‌య్య నాయుడు తెలిపారు. విజయవాడ - గుంటూరు మధ్య రాజధాని నిర్మాణం చేయాలని కూడా సీఎం చంద్రబాబుకు తానే సలహా ఇచ్చానని వెంకయ్యనాయుడు ఈ సంద‌ర్భంగా కొత్త విష‌యం చెప్పారు. ఈ సంద‌ర్భంగా టీడీపీ - బీజేపీ నేతలు వెంక‌య్య‌ను సన్మానించారు.