Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ..!

By:  Tupaki Desk   |   30 Nov 2022 6:46 AM GMT
బ్రేకింగ్: ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ..!
X
'లైగర్' చిత్రానికి సంబంధించిన లావాదేవీల విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈరోజు ఈడీ అధికారులు హీరో విజయ్ దేవరకొండను విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన 'లైగర్' సినిమా వ్యవహారంలో.. నిబంధనలకు విరుద్ధంగా విదేశాల నుంచి పెట్టుబడులు వచ్చాయన్న ఆరోపణలపై మనీలాండరింగ్ కోణంలో ఈడీ విచారణ సాగుతోంది.

దుబాయ్ కి డబ్బులు పంపించి అక్కడి నుంచి తిరిగి సినిమాలో పెట్టుబడులు పెట్టినట్టు ఈడీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారని నివేదికలు పేర్కొన్నాయి. ఈ వ్యవహారంలో ఓ రాజకీయ నేత ప్రమేయం కూడా ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోందని అంటున్నారు.

ఇప్పటికే 'లైగర్' దర్శక నిర్మాతలు పూరీ జగన్నాథ్ మరియు ఛార్మి కౌర్ లు ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అధికారులు వారిని దాదాపు 12 గంటల పాటు విచారించారు. ఈ క్రమంలో ఇప్పుడు హీరో విజయ్ ను విచారిస్తున్నారు.

ఈ వ్యవహారంలో ముందుగా విజయ్ దేవరకొండ కు నోటీసులు జారీ చేసిన ఈడీ అధికారులు.. 'లైగర్' చిత్రానికి సంబంధించిన లావాదేవీల విషయంలో ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. అతని రెమ్యునరేషన్ మరియు సినిమాలో ఎవరెవరు పెట్టుబడులు పెట్టారనే విషయాలపై ఆరా తీయనున్నారు.

ప్రస్తుతం విజయ్ ను ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు.. రానున్న రోజుల్లో 'లైగర్' ఆర్థిక లావాదేవీలలో భాగమైన ఇతర ప్రముఖులను కూడా విచారించే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.