Begin typing your search above and press return to search.

జగన్ భారతిల మీద ఎనలేని ప్రేమతో విజయమ్మ

By:  Tupaki Desk   |   25 Dec 2022 12:06 PM GMT
జగన్ భారతిల మీద ఎనలేని ప్రేమతో విజయమ్మ
X
ముఖ్యమంత్రి అయినా ప్రధాని అయిన తల్లికి కొడుకే. అలాగే జగన్ అంటే విజయమ్మకు ఎనలేని అభిమానం ఉంటుంది. ఇది వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకోవడం ఎందుకు అంటే ఏపీలో చంద్రబాబు కానీ తెలుగుదేశం నాయకులు కానీ ఊరూరా తిరుగుతూ తల్లిని చెల్లెలును తరిమేసిన మనిషి జగన్ అంటూ ప్రచారం చేస్తున్నారు.

చెల్లెలు విషయంలో చూస్తే ఆమె వేరే పార్టీ పెట్టుకుని హైదరాబాద్ లో ఉన్నారు. ఇద్దరు మధ్య ఏమి జరిగిందన్నది తెలియదు కానీ విభేధాలు ఉన్నట్లే కనిపిస్తున్నాయి. కానీ తల్లి విషయంలో టీడీపీ నాయకులు చేస్తున్న ప్రచారం తప్పు అని నిరూపించే సంఘటనలే గత కొన్ని రోజులుగా జరిగాయి. డిసెంబర్ 21న జగన్ పుట్టిన రోజు మొదలుకుని విజయమ్మ ఆయన వెంటే ఉన్నారు.

జగన్ బర్త్ డే వేళ తాడేపల్లి నివాసానికి వచ్చిన విజయమ్మ కొడుకు జగన్ కోడలు భారతితో కలసి గడిపారు. పిక్స్ కూడా బయటకు వచ్చాయి. ఆ తరువాత వారి సొంత ఊరు పులివెందులలో కూడా మూడు రోజుల జగన్ పర్యటనలో విజయమ్మ ఉన్నారు. అధికారిక కార్యక్రమాల్లో ఆమె లేకపోయినా క్రిస్మస్ వేడుకలలో ఆమె కనిపించారు. అలాగే ఇడుపుల పాయలో సైతం ఆమె జగన్ వెంటే ఉన్నారు.

ఇక క్రిస్మస్ వేళ పులివెందుల భాక‌రాపురం సీఎస్‌ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్‌ వేడుకల‌కు కుటుంబ సభ్యులతో కలిసి జగన్ హాజరయ్యారు. అనంతరం త‌ల్లి వైఎస్ విజయమ్మ, కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి కేక్ క‌ట్ చేశారు. సీఎస్ఐ చ‌ర్చి నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కొడుకు జగన్ కి కేక్ ని స్వయనా విజయమ్మ తినిపిస్తే జగన్ సైతం తల్లికి కేక్ అందించారు. అలాగే కోడలు భారతితో కూడా అన్యోన్యంగా ఉన్న సన్నివేశాలు పిక్స్ రూపంలో బయటకు వచ్చాయి.

ఇక ప్రతీ క్రిస్మస్ వేడుకకూ వైఎస్సార్ కుటుంబం మొత్తం కలుస్తుంది. మూడు రోజుల పాటు అంతా కలసి ఆనందంగా జరుపుకుంటారు. ఈసారి వైఎస్ షర్మిల కనిపించలేదు. ఆమె అమెరికా వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఆమె జనవరి మొదటి వారం కానీ తిరిగి భారత్ రారు అని అంటున్నారు. ఇదిలా ఉండగా ఒక వైపు కుమార్తె మరో వైపు కుమారుడు ఇద్దరూ వేరు వేరు దారులలో వెళ్తున్నా కూడా ఇద్దరి మధ్యన విభేదాలు తారస్థాయిలో ఉన్నా వైఎస్సార్ సతీమణిగా విజయమ్మ పెద్ద మనసుతో ఉంటున్నారని అటూ ఇటూ కూడా సమన్యాయంతోనే వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు.

ఆమె జగన్ మూడున్నరేళ్ల పాలనకు కూడా నూటికి నూటాభై మార్కులు వేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి విజయమ్మ విషయంలో తల్లిని జగన్ దూరం చేసుకున్నారు అంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలు తప్పు అనిపించేలాగానే తాజా సంఘటనలు ఉన్నాయని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.