Begin typing your search above and press return to search.

యాదాద్రిలో హెలిక్యాప్టర్ కు వాహన పూజ.. కేసీఆర్ కోసమేనా?

By:  Tupaki Desk   |   15 Dec 2022 10:30 AM GMT
యాదాద్రిలో హెలిక్యాప్టర్ కు వాహన పూజ.. కేసీఆర్ కోసమేనా?
X
ఏపీలో తిరుమల వేంకటేశ్వరుడు ఎలానో తెలంగాణలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అలాగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ నడుం బిగించారు. వందల కోట్లను కేటాయించి మరీ యాదాద్రి ఆలయాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దాడు. అందుకే ఇక్కడికి ఇప్పుడు తెలంగాణ నుంచే కాదు.. వివిధ రాష్ట్రాల నుంచి కూడా జనాలు తరలివస్తున్నారు. ఎంతో ప్రాచుర్యం పొందుతోంది.

తెలంగాణలో యాదాద్రి కొత్త ఆధ్యాత్మిక సమగ్ర గమ్యస్థానంగా ప్రజలకు నిలుస్తోంది. పునరుద్ధరణ తర్వాత ఆలయం చాలా మంది సందర్శకులను ఆకర్షిస్తోంది. జంట నగరాల ప్రజలకు, దైవిక ఆశీర్వాదాలు పొందడానికి కేవలం ఒక గంట లేదా రెండు గంటల సమయం ఇక్కడి నుంచి దూరం కావడంతో చాలా మంది యాదాద్రికి తరలివస్తున్నారు. కేవలం ప్రజలు మరియు వారి దర్శనం కోసం మాత్రమే కాకుండా ఫ్యాన్సీ వస్తువుల కోసం కూడా వివిధ రకాల షాపులు వెలువడంతో అందరూ పోటెత్తుతున్నారు.

ఇక యాదాద్రిలో వివిధ కొత్త వాహనాలకు పూజా కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయట.. ఇదొక ట్రెండ్ గా మారింది. తాజాగా కొత్త హెలికాప్టర్ కు యాదాద్రిలో వాహన పూజ చేయడం వైరల్ గా మారింది. ఈ ఫోటో మరియు వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.. ప్రతిమ మెడికల్ కాలేజీ ఎండీ బోయినపల్లి శ్రీనివాసరావు కొత్త హెలికాప్టర్‌ను కొనుగోలు చేసి హిందూ సంప్రదాయంలో భాగంగా దానికి తొలి పూజలు చేయడానికి యాదాద్రికి తీసుకొచ్చారు. ఈ పూజా కార్యక్రమంలో శ్రినివాసరావుకు బంధువైన మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు కూడా పాల్గొన్నారు.

ఇక బోయినపల్లి శ్రీనివాసరావు మరెవరో కాదు.. టీఆర్ఎస్ ఎంపీ బోయినపల్లి సంతోష్ రావుకు బంధువు అవుతారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబుకు కూడా వీళ్లు చుట్టాలే. కరీంనగర్ మాజీ ఎంపీ, ప్రస్తుత ప్రణాళిక సంఘం చైర్మన్ వినోద్ కు కూడా దగ్గరి బంధువులు. సో ఈ హెలిక్యాప్టర్ కొనుగోలు కేసీఆర్ కోసమేనని.. ఆయనే దీని వెనుక ఉన్నారని కరీంనగర్ జిల్లాలో ప్రచారం సాగుతోంది. బోయినపల్లి కుటుంబం కేసీఆర్ కు తోడల్లుడి వరుస కావడంతో వీరిచేత కొనిపిచ్చి ఉంటారని ఒక వార్త సర్క్యూలేట్ అవుతోంది.

తెలంగాణ సీఎం కేసీఆర్ తన కొత్త బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ఈ ఛాపర్‌ని ఉపయోగించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఆయన న్యూఢిల్లీలో బిజెపియేతర మరియు కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని తేలాలని యోచిస్తున్నందున బిజెపికి వ్యతిరేకంగా వారి మద్దతును సేకరించడానికి అనేక ప్రాంతాలకు వెళ్లి అనేక ప్రాంతీయ పార్టీలను కలవనున్నారు. ఇందుకోసమే దీన్ని వినియోగిస్తారని.. బోయినపల్లి కుటుంబంతో కేసీఆర్ కు ఉన్న బంధుత్వం దృష్ట్యానే ఈ చాపర్ ను వారిచేత కొనిపించి పూజలు చేసినట్టు ప్రచారం సాగుతోంది.

మరి ఈ చాపర్ టీఆర్ఎస్ కోసమా? లేక మెడికల్ కాలేజీ సహా విద్యాసంస్థలు , వ్యాపారాలు ఉన్నా బోయినపల్లి కుటుంబం కోసమా? అన్నది అధికారికంగా వాళ్లు అయితే స్పందించలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.