Begin typing your search above and press return to search.

విజ‌య‌వాడ టీడీపీలో అన్న‌ద‌మ్ముల మ‌ధ్య వార్!

By:  Tupaki Desk   |   20 July 2022 9:30 AM GMT
విజ‌య‌వాడ టీడీపీలో అన్న‌ద‌మ్ముల మ‌ధ్య వార్!
X
విజయవాడ టీడీపీ ఎంపీ కేశినాని నాని త‌న సొంత త‌మ్ముడిపైనే పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం హాట్ టాపిక్ గా మారింది. ఎంపీగా త‌న పేరున్న స్టిక్క‌ర్ ను ఎవ‌రో అజ్ఞాత వ్య‌క్తి అత‌డి కారుకు పెట్టి వాడుకుంటున్నారంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీనిపైన విచార‌ణ ప్రారంభించిన ఆ పోలీసులు ఎంపీ కేశినేని నాని ఫిర్యాదు చేసిన కారు హైద‌రాబాద్ లోని మాదాపూర్ ప‌రిస‌ర ప్రాంతాల్లో తిరుగుతోంద‌ని గుర్తించారు.

అయితే ఇందులో ట్విస్ట్ ఏమిటంటే ఆ కారు ఎంపీ కేశినేని నాని సోద‌రుడు కేశినేని చిన్ని భార్య ఝాన్సీ పేరు మీద రిజిస్ట‌రై ఉంది. కాగా ఈ విష‌యంపై ఎంపీ ఫిర్యాదు చేసి నెల రోజుల‌వుతోంద‌ని.. ఆల‌స్యంగా వెలుగుచూసింద‌ని వార్తలు వ‌స్తున్నాయి. ఒకవేళ ఆ కారు ఏదైనా వివాదంలో ఇరుక్కుంటే.. ఆ కారు మీద ఉన్న స్టిక్క‌ర్ చూసి.. దాన్ని ఎంపీ కేశినేని నాని కారుగా భావిస్తార‌ని.. ఇలా జ‌రిగితే తాను చిక్కుల్లో ప‌డ‌తాన‌ని భావించే ఎంపీ కేశినేని పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

అయితే.. త‌న ఎంపీ స్టిక్క‌ర్ తో కారును వాడుతోంది.. త‌న సొంత త‌మ్ముడు కేశినేని చిన్ని అని తెలిసే కేశినేని ఫిర్యాదు చేసిన‌ట్టు తెలుస్తోంది. చాలాకాలంగా సోద‌రుల ఇద్ద‌రి మ‌ధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయ‌ని అంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ ఎంపీగా టీడీపీ త‌ర‌ఫున‌ కేశినేని చిన్నిని దింపే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు కూడా వ‌చ్చాయి.

మ‌రోవైపు విజ‌య‌వాడ టీడీపీలో ఎంపీ కేశినేని నానికి, విజ‌య‌వాడ న‌గ‌ర టీడీపీ అధ్య‌క్షుడు బుద్ధా వెంక‌న్న‌, మ‌రో నేత నాగుల్ మీరాతో తీవ్ర విభేదాలు ఉన్నాయి. ప‌లుమార్లు వీరు రోడ్లెక్కి మ‌రీ బ‌హిరంగ విమ‌ర్శ‌లు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ విభేదాలు ముదిరి పాకాన ప‌డ్డాయి. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థుల‌కు టికెట్ల విష‌యంలో వీరి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు పొడ‌సూపాయి. టీడీపీ మేయ‌ర్ అభ్య‌ర్థిగా కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత ప్ర‌చారంలోకి వ‌చ్చారు. అయితే ఇందుకు బుద్ధా, నాగుల్ మీరా వ‌ర్గాలు ఒప్పుకోలేదు.

అయితే కేశినేని కుమార్తె శ్వేత కార్పొరేట‌ర్ గా విజ‌యం సాధించినా కార్పొరేష‌న్ ను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. దీంతో మేయ‌ర్ పీఠం వైఎస్సార్సీపీకే పోయింది. కేశినేని కుమార్తె కేవ‌లం కార్పొరేట‌ర్ గానే మిగిలిపోయారు. ఈ నేప‌థ్యంలో కేశినేని టీడీపీ అధిష్టానంపై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుపడ్డారు. బుద్ధా వెంక‌న్న‌, నాగుల్ మీరా వ‌ర్గాల‌కు చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు నారా లోకేష్ అండ‌దండ‌లు అందిస్తున్నార‌ని భావించిన కేశినేని తీవ్ర విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో టీడీపీ నుంచి కేశినేని నాని త‌ప్పుకుంటార‌నే వార్త‌లు వ‌చ్చాయి. అయితే పార్ల‌మెంటు వ‌ర్ష‌కాల స‌మావేశాల సంద‌ర్భంగా టీడీపీ ఎంపీల‌తో చంద్ర‌బాబు నాయుడు నిర్వ‌హించిన స‌మావేశానికి కేశినేని నాని హాజ‌రుకావ‌డంతో ఆయ‌న టీడీపీలోనే కొన‌సాగుతార‌ని భావించారు.

ఈ నేప‌థ్యంలోనే కేశినేని చిన్నిని వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ నుంచి టీడీపీ త‌ర‌ఫున ఎంపీ అభ్య‌ర్థిగా బ‌రిలో నిలుపుతార‌ని విజ‌య‌వాడ పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గంలో చ‌ర్చ జ‌రుగుతోంది.