Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ - బీజేపీ స‌భ్య‌త్వాల్లోనూ యుద్దాలేనా..!

By:  Tupaki Desk   |   27 Aug 2019 5:56 AM GMT
టీఆర్ ఎస్ - బీజేపీ స‌భ్య‌త్వాల్లోనూ యుద్దాలేనా..!
X
తెలంగాణ‌లో గులాబీకి - క‌మ‌లానికి మ‌ధ్య ఆధిప‌త్య పోరు రోజురోజుకు రాజుకుంటోంది. అధికార టీఆర్ ఎస్ ను ధీటుగా ఎదుర్కోవాల‌ని బీజేపీ వ్యూహాలు ర‌చిస్తుంటే - ఎలాగైనా కాషాయ పార్టీ దూకుడుకు క‌ళ్లెం వేయాల‌ని టీఆర్ ఎస్ భావిస్తోంది. ఈక్ర‌మంలోనే ఇరు పార్టీలు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ బ‌స్తీమే స‌వాల్‌ కు దిగుతున్నాయి. అయితే తాజాగా సభ్యత్వ నమోదు అంశం అధికార టీఆర్‌ ఎస్ - విపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది.

బోగస్‌ సభ్యత్వాలు అంటూ పరస్పరం నిందారోపణలు చేసుకుంటూ ఇరు పార్టీల నేతలు సవాళ్లు - ప్ర‌తి స‌వాళ్లు విసురుకుంటున్నారు. రెండేళ్లపాటు అమల్లో ఉండే పార్టీ సభ్యత్వాల సేకరణ కార్యక్రమాన్ని టీఆర్‌ ఎస్‌ అధ్యక్షుడు - సీఎం కేసీఆర్‌ ఈ ఏడాది జూన్‌ 27న ప్రారంభించారు. కోటి మందిని పార్టీ సభ్యులుగా చేర్చాలని లక్ష్యం నిర్దేశించుకోగా సుమారు నెలన్నర వ్యవధిలో 60 లక్షల మందికి సభ్యత్వం ఇచ్చారు.

ఈనెల 31 వరకు పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటు ప్రక్రియను కూడా పూర్తి చేసేందుకు టీఆర్‌ ఎస్‌ సన్నాహాలు చేస్తోంది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున 50 వేల సభ్యత్వాల ద్వారా దేశంలోనే ఎక్కువ మంది సభ్యులు ఉన్న పార్టీగా టీఆర్‌ ఎస్‌ నిలిచిందని పార్టీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ కేటీఆర్‌ ప్రకటించారు.

మ‌రోప‌క్క రాష్ట్రంలో స‌భ్య‌త్వ న‌మోదును బీజేపీ కూడా అత్యంత ప్ర‌తిష్టాత్మంగా తీసుకుంది. ఈ ఏడాది జూలై 6న పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా స్వయంగా రాష్ట్రానికి వచ్చి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ త‌ర్వాత పార్టీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ న‌డ్డా కూడా తెలంగాణ‌కు వ‌చ్చి - పార్టీ నాయ‌క‌త్వానికి దిశానిర్దేశం చేశారు. కాగా బీజేపీ - టీఆర్‌ ఎస్‌ సభ్యత్వ నమోదు గ‌డువు ముగుస్తున్న క్రమంలో ఇరు పార్టీలు ‘బోగస్‌ సభ్యత్వాలు’ అంటూ పరస్పరం ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నాయి.

టీఆర్‌ ఎస్ వి బోగస్‌ సభ్యత్వాలు అని బీజేపీ విమర్శిస్తుండ‌గా - బీజేపీ ‘మిస్డ్‌ కాల్‌’ద్వారా చేసిన సభ్యత్వాలను కూడా కలుపుకొని పార్టీ సభ్యుల సంఖ్య 13 లక్షలు అని చెప్పుకుంటోందని టీఆర్‌ ఎస్‌ ప్రతి విమర్శలు చేసింది. బీజేపీ తరహాలో మిస్డ్‌ కాల్‌ సభ్యత్వాలు చేయాలనుకుంటే గంట వ్యవధిలో మూడు కోట్లు చేస్తామని ఎద్దేవా చేసింది. సభ్యత్వాల సేకరణ - సంఖ్యను ఇరు పార్టీలు తాము రాష్ట్రంలో బలంగా ఉన్నామనే సందేశాన్ని జనంలోకి పంపడమే లక్ష్యంగా ఉపయోగించుకుంటున్నాయి.

ఈక్ర‌మంలోనే రాష్ట్రంలో 60 లక్షలకుపైగా సభ్యత్వాలను సేకరించామనే అంశానికి విస్తృత ప్రచారం కల్పించడం ద్వారా బీజేపీ విమర్శలకు అడ్డుకట్ట వేయాలని టీఆర్‌ ఎస్‌ భావిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం హైద‌రాబాద్‌ లో సభ్యత్వ నమోదు విజయోత్సవ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. మ‌రి టీఆర్ ఎస్‌ కు కౌంట‌ర్ ఇచ్చేందుకు బీజేపీ ఏ వ్యూహాన్ని ర‌చిస్తుందో వేచి చూడాలి.