Begin typing your search above and press return to search.

సంక్షేమం వర్సెస్ అభివృద్ధి...ఏపీ జనం ఓటు ఎటు...?

By:  Tupaki Desk   |   29 Sep 2022 7:30 AM GMT
సంక్షేమం వర్సెస్ అభివృద్ధి...ఏపీ జనం ఓటు ఎటు...?
X
నీకు రోడ్డు కావాలా లేక తినడానికి తిండి కావాలా అంటే ముందు తిండి పెట్టమనే ఎవరైనా అంటారు. అది సంక్షేమం. మరి ఆ తిన్న వారు నడిచి తిన్నగా కొంపకు చేరుకోకుండా గతుకుల రోడ్డులో పడి ప్రాణం మీదకు తెచ్చుకున్నా అది బాగా కష్టమే కదా. అంటే అభివృద్ధి కూడా కావాలి. ప్రభుత్వం ఈ రెండూ సమంగా చూడాలి. అంటే పాలకులు అన్న వారు తమ ముందు ఉన్న త్రాసులో ఏ వైపునకు మొగ్గినా రాష్ట్రం కానీ దేశం కానీ ఇబ్బందుల్లో పడుతుంది.

అయితే పాలకులు ఎన్నికలు ఓట్లు అన్న బుర్రలతో ఆలోచన చేయడం మొదలెట్టాక అభివృద్ధికి అంతకంతకు నిధులు తగ్గిపోతున్నాయి. జనాలకు కూడా తమ చేతికి ఎంత వచ్చింది అన్నదే ముఖ్యమైపోతోంది. అలా చూసుకుంటే సామాజిక ప్రయోజనాలు, అభివృద్ధి అన్నవి పక్కకు పోతున్నాయి. ఇది కొన్ని దశాబ్దాలుగా సాగుతోంది. ఇక ఏపీ ఏ విషయంలో కాకున్నా సంక్షేమం విషయంలో దేశానికి ఇపుడు ఒక మోడల్ గా కనిపిస్తోందా లేక అతి పెద్ద ప్రశ్నగా మారుతోందా అంటే జవాబు చెప్పడం కష్టమే.

ఏపీలో సంక్షేమం కోసం విచ్చలవిడిగా డబ్బులు తెచ్చి ఖర్చు పెడుతున్నారు. అప్పుల కుప్పగా రాష్ట్రం ఉన్నా బేఖాతరు చేస్తూ మరీ డబ్బులు సంక్షేమం పేరిట కుమ్మరిస్తున్నారు. దీని వల్ల రాజకీయంగా ప్రయోజనం. చేకూరుతుంది అని భావిస్తున్నారు. అదే ఒక అభివృద్ధి కార్యక్రమం చేస్తే అడవిలో అమ్మా అని అరచినట్లే. అందరూ ఉపయోగించుకునే అభివృద్ధికి కేరాఫ్ అంటూ పర్టిక్యులర్ గా ఓటర్లు ఉండరు. దాంతో జై సంక్షేమమ‌ని ఏపీ సర్కార్ అంటోంది.

అయితే ఏపీ సర్కార్ చేస్తున్న పని మంచిదా కాదా అంటే రెండింటి మీద ఇపుడు జనాలలో హాట్ హాట్ డిస్కషన్ సాగుతోంది. సామాజిక చైతన్యం అంతా సోషల్ మీడియాలో కనిపిస్తున్న వేళ సంక్షేమాన్ని కోరుకున్న వారున్నారు. అలాగే వద్దు అభివృద్ధి చాలు అన్న వారు ఉన్నారు. లేదు రెండూ కావాలీ అన్న వారు కూడా ఉన్నారు. ఏపీ చూస్తే విభజన తరువాత ఆదాయం బాగా తగ్గిపోయింది. నిజానికి జీతాలు కూడా చెల్లించలేని స్థితిలోకి ప్రభుత్వం ఎన్నో సార్లు వెళ్ళిపోయింది.

ఈ నేపధ్యంలో సంక్షేమం కొన‌సాగించాలన్నా అభివృధ్ధి పనులు చేయాలన్నా కూడా దండీగా డబ్బులు కావాలి. అవి కూడా అప్పులు తెచ్చి పెట్టాలి. అభివృద్ధి మీద పెట్టిన డబ్బు ఈ రోజు కాకపోయినా రేపు అయినా తిరిగి ఏదో రూపంలో వస్తుంది. కానీ సంక్షేమం పేరిట పప్పు బెల్లాలుగా పంచిన సొమ్ములు తిరిగి రావు. కానీ రాజకీయ ఫలాలను అవి అందిస్తాయి. దాంతో ఏలికలు షార్ట్ కట్ మెదడ్స్ ని ఎంచుకుంటున్నారు.

దీంతో సంక్షేమం వర్సెస్ అభివృద్ధి అన్నట్లుగా ఏపీ సమాజంలో భారీ చీలిక‌ వచ్చినట్లుగా చెబుతున్నారు. మధ్యలో మధ్యతరగతి వర్గాలు రెండూ కావాలని అంటున్నారు. ఇక్కడ స్థూలంగా చెప్పుకోవాలీ అంటే పేదలు సంక్షేమం వైపున ఉన్నారు. పెద్దలు అంటే డబ్బున్న వారు అభివృద్ధి ఉండాల్సిందే అని వాదిస్తున్నారు. మధ్యతరగతి వర్గాలు మాకు పధకాలూ కావాలీ అభివృద్ధి జరగాలని నినదిస్తున్నారు.

దీంతో 2024లో ఏపీలో జరిగే ఎన్నికలు చాలా కీలకంగా మారబోతున్నాయి. అదే విధంగా ఆసక్తికరమైన ఫలితాలను కూడా ఈ ఎన్నికలు ఇవ్వబోతున్నాయి అని అంటున్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దీని మీద కొద్ది రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. జగన్ సంక్షేమం పేరిట ఒక రాజకీయ పందేం కడుతున్నారు. అది కనుక ఫలిస్తే దేశంలో అంతా ఇదే రూట్ పడతారు అని కూడా అన్నారు. మరి జగన్ రాజకీయ పందెం నెగ్గుతుందా. అభివృద్ధి గెలుస్తుందా లేక రెండూ కావాలని కోరే గొంతులు పెద్దగా వినిపిస్తాయా అంటే వేచి చూడాల్సిందే మరి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.