Begin typing your search above and press return to search.

బెంగళూరు వెళ్లిన కేసీఆర్ దేవెగౌడతో ఏం మాట్లాడారు?

By:  Tupaki Desk   |   26 May 2022 11:30 AM GMT
బెంగళూరు వెళ్లిన కేసీఆర్ దేవెగౌడతో ఏం మాట్లాడారు?
X
దేశ ప్రధాని ఒక రాష్ట్రానికి వస్తున్నప్పుడు.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన్ను సాదరంగా ఆహ్వానించటం.. వెంట ఉండటం లాంటివి చేస్తారు. అయితే.. ప్రధాని మోడీకి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మధ్య లొల్లి నడుస్తున్న వేళ.. అలాంటి ముచ్చట్లకు తావు లేదు.

నువ్వు తోపు అయితే.. నేను మహా తోపు అన్నట్లుగా కేసీఆర్ ఫీల్ కావటమే కాదు.. తానేమిటో చూపించాలని భావించిన ఆయన.. ప్రధాని మోడీ హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యే వేళకు ఆయన పక్కనున్న కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరుకు వెళ్లారు.

ఇటీవల కాలంలో పలు రాష్ట్రాలకు వెళుతున్న ఆయన.. తాజాగా కర్ణాటకలోని మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ అయ్యారు. ఏ మాటకు ఆ మాటే సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం లభించింది. దేవెగౌడ ఇంటికి చేరుకున్న కేసీఆర్ ను ఆయన కుటుంబ సభ్యులు ఇంటి బయటకు వచ్చి మరీ సాదరంగా లోపలకు తీసుకెళ్లారు.

ఎప్పటిలానే బెంగళూరులో ల్యాండ్ అయిన కేసీఆర్ కు.. దేశ వ్యాప్తంగా ఆయనకున్న అభిమానగణం.. ఆయన మీద ప్రేమాభిమానాలు ప్రదర్శిస్తూ దేవెగౌడ నివాసం ఉన్న పద్మనాభనగర్ లోని పలు ప్రాంతాల్లో కేసీఆర్ కటౌట్లు.. ఫ్లెక్సీలు పెట్టి సందడి చేశారు. ఆ ప్రాంతాల్లోనూ గులాబీ కటౌట్లను పరిచయం చేశారు.

కర్ణాటక పెద్ద మనిషి ఇంటికి వెళ్లిన కేసీఆర్.. ఆయనతో ఏం మాట్లాడారు? అన్నది ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. తాజా జాతీయ రాజకీయాల గురించి.. సమకాలీన అంశాల గురించి మాట్లాడుకున్న వారు.. మరికొద్ది నెలల్లో జరిగే రాష్ట్రపతి ఎన్నికలకు విపక్షాల ఉమ్మడిఅభ్యర్థిని నిలబెడితే ఎలా ఉంటుందన్న అంశాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

ఇందులో ప్రాంతీయ పార్టీల పాత్రపై చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. చర్చల సారాంశం ఏమిటన్నది ఇంకా బయటకు రాలేదు కానీ.. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష అభ్యర్థిని నిలబెట్టాలన్న కేసీఆర్ ఎజెండా మాత్రం బయటకు వచ్చింది. మరి.. అందుకు దేవెగౌడ ఎలా రియాక్టు అవుతారన్న దానిపై సమాచారం రావాల్సి ఉంది.