Begin typing your search above and press return to search.

'ఎర' ఎమ్మెల్యేల బ్యాక్ గ్రౌండ్ ఏమిటి?

By:  Tupaki Desk   |   27 Oct 2022 4:01 AM GMT
ఎర ఎమ్మెల్యేల బ్యాక్ గ్రౌండ్ ఏమిటి?
X
తెలంగాణ అధికారపక్షానికి చెందిన నలుగురు ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేయటానికి డీల్ జరగ్గా.. ఆ విషయాన్ని చివర్లో పోలీసులకు చెప్పటం.. వారు కాస్తా ఎంట్రీ ఇవ్వటం.. సుమారు రూ.400 కోట్ల డీల్ కుట్ర యత్నం భగ్నమైందంటూ వస్తున్న వార్తల వేళ.. ఈ ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. వందకు పైగా ఎమ్మెల్యేలు ఉన్న టీఆర్ఎస్ కు నలుగురు ఎమ్మెల్యేల్ని ఎవరవేయటం ద్వారా బీజేపీ ఒరిగేదేమిటి? వచ్చే లాభం ఏమిటి? అన్న ప్రశ్నలు వినిపిస్తుంటే.. ఇంతకీ అంతమందిలో నలుగురికి మాత్రమే ఎర వేయటం చూసినప్పుడు.. వారి బ్యాక్ గ్రౌండ్ ఏమిటన్న ఆసక్తి వ్యక్తమవుతోంది.
ఇంతకూ ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరంటే..

1. రేగా కాంతారావు
2. గువ్వల బాలరాజు
3. బీరం హర్షవర్ధన్ రెడ్డి
4. పైలెట్ రోహిత్ రెడ్డి

మొత్తం నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ కు వచ్చిన ఘన చరిత్ర ఉన్న వారు ఉంటే.. ఒకరు ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుంటే.. మరొకరు మంత్రి కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా చెబుతారు. మొత్తంగా చూసినప్పుడు 'ఎర' బారిన పడినట్లుగా చెబుతున్న నలుగురు ఎమ్మెల్యేల కమిట్ మెంట్ ను.. వారి విధేయతను శంకించాల్సిన అవసరం లేదు. అన్నింటికి మించి.. ఈ నలుగురిలో ఎవరికి భారీ ప్రజాదరణ ఉన్న వారు కాదు. కానీ.. ఆ నలుగురికి ఎర వేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.

'ఎర'కు చిక్కినట్లుగా చెబుతున్న నలుగురిలో ఒకరైన ఎమ్మెల్యే రేగా కాంతారావు విషయానికి వస్తే.. ప్రభుత్వ టీచరుగా కెరీర్ షురూ చేసిన ఆయన.. తర్వాత రాజకీయాల్లోకి చేరారు. 2009లో పినపాక నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్రానికి ఆఖరు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న రేగా.. 2014లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

కట్ చేస్తే.. 2018లోనూ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి.. తాను అనుకున్న రీతిలో విజయం సాధించారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో.. ఆపరేషన్ ఆకర్ష్ ను చేపట్టిన కేసీఆర్ కు ఆకర్షితులైన ఆయన.. టీఆర్ఎస్ గూటికి చేరారు. ఆ వెంటనే.. ఆయనకు విప్ పదవి దక్కింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న రేగా కాంతారావు ఎర బారిన పడ్డారన్న ఉదంతం షాకింగ్ గా మారింది.

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు మరో మంత్రి నిరంజన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. రియల్ ఎస్టేట్ సంస్థలు.. రియల్ ఎస్టేట్ అధినేతలతో దగ్గర సంబంధాలు ఉన్న ఎమ్మెల్యేగా గువ్వలకు పేరుంది. రిజర్వ్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ కు రెండుసార్లు ఎన్నికైన గువ్వల.. ప్రభుత్వ విప్ గా వ్యవహరిస్తున్నారు. ఆయనకు మంత్రి కేటీఆర్ బాగా క్లోజ్ అన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది.
'ఎర' ఎపిసోడ్ లో మూడో ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెరడ్డి. కాంగ్రెస్ నేతగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. టీఆర్ఎస్ అభ్యర్థులపై పోటీ చేసి గెలిచిన అతి కొద్ది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో హర్షవర్ధన్ రెడ్డి ఒకరు. సీఎం కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా టీఆర్ఎస్ గూటికి చేరిన ఆయనకు దైవభక్తి ఎక్కువని చెబుతారు. తరచూ తిరుమలకు వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకొని వస్తారని చెబుతారు.

నాలుగో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి. ఉన్నత విద్యావంతుడైన ఆయన విదేశాల్లో ఉండేవారు. తెలంగాణ ఉద్యమం వేళలో తెలంగాణకు తిరిగి వచ్చిన కొందరిలో పైలెట్ రోహిత్ రెడ్డి ఒకరు. టీఆర్ఎస్ లో చేరిన ఆయన తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో 2009లో మన పార్టీ తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2018లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి.. కేసీఆర్ సర్కారులో మంత్రిగా వ్యవహరించిన మహేందర్ రెడ్డిపై పోటీ చేసి విజయం సాధించి అందరిని ఆకర్షించారు. కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా పార్టీలో చేరిన అతనికి అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో పలువురికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.